CM Chandrababu: ఆర్థిక సంఘం సిఫార్సులతోనే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు వస్తాయి. ఆ నిధులను పెంచాలని సీఎం చంద్రబాబు ఆర్థిక సంఘానికి రిక్వెస్ట్ చేశారు. ఏపీలో పర్యటించిన 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. విజన్ 2047 టార్గెట్స్ కూడా చెప్పారు. టార్గెట్ రీచ్ అవ్వాలంటే కేంద్రం నుంచి ప్రత్యేక ప్రోత్సహకాలు అవసరమని స్పష్టం చేశారు సీఎం.
14-04-2025 సోమవారం ( అంబేద్కర్ ఆశయ సాధన దిశగా )
సమాజంలో అంటరానితనం, వివక్ష, అసమానతలు రూపుమాపడమే తమ లక్ష్యమని అన్నారు సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా తాడికొండలోని పొన్నెకల్లులో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ స్పూర్తితోనే పేదరిక నిర్మూలనకు పీ4 కార్యక్రమాన్ని తీసుకొని వచ్చామని చెప్పారు సీఎం. అదే రోజు 102 కోట్లతో సాంఘిక సంక్షేమ వసతిగృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పొన్నెకల్లులోని ఓ దళిత కుటుంబాన్ని కలిసి మాట్లాడారాయన. వారి పరిస్థితిని చూసి చలించిపోయారు.
రెండు గదులున్న ఓ ఇంట్లో 10 మంది ఉంటున్నారని చెప్పారు సీఎం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని పైకి తీసుకురావడానికే పీ4 అన్నారాయన. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఉక్కు సంకల్పంతో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు లేని వ్యవస్థను సాధిస్తానని అన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారాయ. ఈ పథకం కింద 2014-19లో 7 వేల మందిని చదివించడానికి రూ. 467 కోట్లను ఖర్చు చేశామన్నారు. కానీ, వైసీపీ టైంలో కేవలం 430 మందినే విదేశాలకు పంపారని విమర్శించారు.
ప్రజలు వైసీపీ నేతల మాటలు నమ్మొద్దని అన్నారు. దేవుడి విగ్రహాలను ద్వంసం చేసిన వారు తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవపట్టించడమే వారి లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 5 ప్రాంతీయ హబ్ల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి కార్యకలాపాలను పాలకమండళ్లు పర్యవేక్షిస్తాయని తెలిపింది. ప్రాంతీయ హబ్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలు పర్యవేక్షించనున్నాయి. ప్రభుత్వం కొంత మొత్తాన్ని సీడ్ క్యాపిటల్గా అందించడంతో పాటు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ గ్రాంటు అందించనుంది. శాశ్వత భవనాలు అందుబాటులోకి వచ్చే వరకు హబ్ల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించి వాటికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
15-04-2025 మంగళవారం ( కేబినెట్ నిర్ణయాలు)
మంగళవారం ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం 617 కోట్ల రూపాయలు, హైకోర్టు భవన నిర్మాణం కోసం 786 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించింది. విశాఖలో టీసీఎస్కు, ఉరుస క్లస్టర్స్కు భూములు కేటాయించారు. బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్కు కూడా లైన్ క్లియర్ చేసింది కేబినెట్.
జలవనరుల శాఖ 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలు ఆమోదించింది. పలు పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ మీటింగ్ లో ఆమోదం లభించింది. విశాఖపట్నంలోని ఐటీ హిల్ -3లో టీసీఎస్కు 21.66 ఎకరాల భూమి, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 3.5 ఎకరాల భూమిని కేటాయించారు. కాపులుప్పాడలో కూడా ఉరుస క్లస్టర్కు 56 ఎకరాల భూమిని ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర చిన్న ఖనిజాల విధానం 2025కి ఆమోదం లభించింది. 4లక్షల 62 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు కూడా ఆమోదించింది కేబినెట్.
కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. తిరుమల గోశాల, వక్ఫ్ బిల్లు, పాస్టర్ ప్రవీణ్ మృతి అంశాలను వివాదాస్పదం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూశాఖపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, అర్జీల్లో ఎక్కువ రెవెన్యూశాఖవే ఉంటున్నాయని అన్నారు. దాన్ని ఎలా ప్రక్షాళించాలో అర్థంకావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ వివాదాల్లో, భూసమస్యల్లో పోలీసుల జోక్యంపైనా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కొత్తగా 2వేల 260 ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 11వందల 36 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 11వంద 24 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి. వీటిని డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం సూచించింది. మానసిక వైకల్యం కలిగిన వారికి టీచ్ చేసేందుకు ఈ ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నాయి.
మత్స్యకారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. చేపల వేట నిషేధ సమయంలో వారికిచ్చే 10వేల రూపాయల సాయాన్ని 20వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెలలోనే లబ్ధిదారులకు సాయం అందనుంది. ఈ నెల 26న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ సాయం అందిచనున్నారు. ఓ మత్స్యకార గ్రామంలో పర్యటించి అక్కడే సీఎం పెంచిన ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకిచ్చే 10వేల రూపాయల సాయాన్ని 20వేలకు పెంచి ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే 20వేలు ఇవ్వనుంది.
16-04-2025 బుధవారం (ఆర్థిక సంఘానికి రిక్వెస్టులు)
రాష్ట్ర పరిస్థితిని కేంద్రానికి వివరించాలి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఇదే ఏపీ సీఎం ఆలోచన. బుధవారం ఏపీలో పర్యటించిన 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియా దగ్గర చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలు చూస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తోంది. రాష్ట్రానికి ఆదాయం కంటే అప్పులపై చెల్లిస్తున్న వడ్డీలే ఎక్కువగా ఉన్నాయని సీఎం పనగాడియాకు వివరించారు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పారు. అందుకే కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం అందించాలని కోరారు సీఎం. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. విజన్ 2047 లక్ష్యాలు కూడా పనగాడియాకు చెప్పారు. అంతేకాదు… 10 నెలల కూటమి ప్రభుత్వంలో తీసుకున్న సహసోపేత నిర్ణయాలను కూడా స్పష్టంగా వివరించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు వెళ్తుందని అన్నారు సీఎం. అందుకే.. ప్రస్తుతం ఉన్న 41 శాతం నుంచి 50 శాతానికి వర్టికల్ డెవల్యూషన్ వాటా పెంచాని కోరారు.
విజన్ 2047తో పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలనకు పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అమరావతికి నిర్మాణానికి 31 వేల కోట్లు రూపాయలు సమకూరాయని.. మరో 47వేల కోట్లు అవసరమని సీఎం లెక్క. పోలవరం ప్రాజెక్టును వచ్చే పుష్కరాలకు ముందే పూర్తి చేస్తామని చెప్పారు. పనగాడియాను సీఎం ప్రశంసించారు. ఆయన ఆయన సహకారంతోనే 2014-19 మధ్యలో 73% పోలవరం పూర్తి చేసామన్నారు.
ఏపీలో అమలు అవుతున్న వాట్సాప్ గవర్నెన్స్పై పనగాడియా ప్రశంసల వర్షం కురిపించారు. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సేవలు అమలులో ఉంటే పరిపాలన సులభం అవుతుందని అన్నారు పనగాడియా.
16-04-2025 బుధవారం ( అమరావతిలో కీలక అడుగు)
అమరావతిలో సచివాలయం, మంత్రుల కార్యాలయాలకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణం మూడు ప్యాకేజీల కింద విభజించారు. 4వేల 688 కోట్ల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారు. వచ్చే నెల 1న మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లు దాఖలకు గడువు నిర్దేశించారు. 2019-24 మధ్యలో ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణానికి 2వేల 703 కోట్లతో టెండర్లు పిలిచింది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు ఈ అంచనా వ్యయం 73 శాతం పెరిగింది. మొదటి ప్యాకేజీలో 11వందల 26 కోట్లతో జీఏడీ టవర్ నిర్మాణం, రెండో ప్యాకేజీలో 18వందల 97 కోట్లతో 1, 2 టవర్లు, మూడో ప్యాకేజీలో 16వందల 64 కోట్లతో 3, 4 టవర్లు నిర్మించనున్నారు.
17-04-2025 గురువారం (ఎస్సీ వర్గీకరణ విధివిధానాలు)
ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కీలక అడుగు పడింది. వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉద్యోగ నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్లాక్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీకి మాత్రం ఇది వర్తించదు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నింటికీ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 15 శాతం రిజర్వేషన్లను మూడు భాగాలుగా విభజించారు. గ్రూప్-1 కింద రెల్లి దాని ఉపకులాలకు 1శాతం, గ్రూప్-2 కింద మాదిగ దాని ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్-3 కింద మాల దాని ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
18-04-2025 శుక్రవారం ( పాస్టర్లకు గుడ్ ఫ్రైడే గిఫ్ట్ )
గుడ్ ఫ్రైడే రోజున ఏపీ ప్రభుత్వం క్రిస్టియన్లకు గుడ్ న్యూస్ చెప్పారు. పాస్టర్లకు నెలకు 5 వేల రూపాయల చెప్పున గౌరవ వేతనం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 8వేల 427 మంది పాస్టర్లకు నెలకు 5 వేలు ఇచ్చేందుకు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. 2024, మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనం విడుదల చేయనున్నారు. ఈ ఏడు నెలల కాలానికిగాను 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్కు 35 వేల చొప్పున లబ్ది చేకూరనుంది.
19-04-2025 శనివారం ( క్రీడాకారులకు గుడ్న్యూస్ )
ఏపీలోని క్రీడాకారులకు ప్రభుత్వం శనివారం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీసు, ఎక్సైజ్, ఆటవీ శాఖతో సహా యూనిఫాం సర్వీసుల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2024-29కి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది. క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అందులో ప్రకటించింది. ఏపీపీఎస్సీ ద్వారా లేదా శాఖల వారీగా, డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపట్టే ప్రతీ నియామకాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. స్పోర్ట్స్ కోటా కింద అందించే రిజర్వేషన్లకు పోటీ పరీక్షల అవసరం లేదు. ప్రత్యక్ష నియామకాల్లో అర్హత కలిగిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు సమాంతర రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ మార్గదర్శకాలు స్పోర్ట్స్ పాలసీ ప్రకటించినప్పటి నుంచే ఐదేళ్లు అమల్లో ఉంటాయి.
ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్, ఆసియన్ పారా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్లో స్వర్ణం, రజతం పతకాలు సాధించిన వారికి మాత్రమే గ్రూప్- 1, 2 విభాగాల్లో నేరుగా ఉద్యోగాలు కల్పించే వెసులుబాటు కల్పించింది. కాంస్య పతకంతో పాటు క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉంటే గ్రూప్- 3 విభాగంలో ఉద్యోగాలకు ప్రభుత్వం అర్హత కల్పించింది. మిగతా క్రీడల్లో గ్రూప్- 3కి మాత్రమే అర్హత ఉంటుంది.
20-04-2025 ఆదివారం ( డీఎస్సీకి వేళాయే! )
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఆదివారం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం పుట్టిన రోజు ట్రీట్గా మెగా డీఎస్సీని రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరింత మందికి ఈ పోస్టులకు అర్హులుగా మారారు. కూటమి సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు రాష్ట్ర నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఎగ్జామ్, నియామకాలు ఆలస్యం కాకుండా స్పెషల్ ఫోకస్ చేసింది ప్రభుత్వం. 45 రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఇక్కడే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. గత డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న వారు ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.