CM Chandrababu: సంక్రాంతి సందర్భంగా వివిధ వర్గాలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులకు మోక్షం లభించింది. సీఎం ఆదేశాలతో చెల్లింపులు ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న తరహా కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులను ఆర్ధికశాఖ… వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇవాళ్టికి ఆరు వేల ఏడు వందల కోట్ల బిల్లులు చెల్లించనుంది.
సంక్రాంతిని అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించిన చంద్రబాబు.. పండక్కి తీపికబురు అందించారు. పలు వర్గాలకు.. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న… ప్రభుత్వ బకాయిలను చెల్లించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. వారి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఎనిమిది ఏళ్లుగా పెండింగ్ ఉన్న బిల్లులతో పాటు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఇవ్వాల్సిన నగదునూ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవటంతో సర్వత్రా ఆనందం వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న సుమారు 6 వేల 700 కోట్ల రూపాయలను వెంటనే క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో… పది లక్షల లోపు బిల్లులు,ఉద్యోగుల జీపిఎఫ్, పోలీసుల సరెండర్ లీవులు, విద్యార్దులు ఫీజు రియంబర్స్ మెంట్ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే సుమారు లక్షా 20 వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. 2014-19 మధ్య.. తెలుగుదేశం హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పటి వరకూ చెల్లించలేదు. అందులో చిన్నచిన్న కాంట్రాక్టర్లు, చిన్న పరిశ్రమలకు చెల్లింపులు , విద్యార్ధుల ఫీజు రియంబర్స్ మెంట్ ఇలా.. అనేక బిల్లులను గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. అదంతా కూటమి ప్రభుత్వానికి భారంగా మారినా… వివిధ వర్గాల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..
ప్రభుత్వం విడుదల చేసిన బిల్లుల్లో పోలీసులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు చెందిన బిల్లులు ఉన్నాయి. ఉద్యోగుల జీపీఎఫ్ 519 కోట్లు నిధులు విడుదల చేశారు. పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవులకు గాను..ఒక ఇన్స్టాల్మెంట్ కింద.. 213 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించారు. మరోవైపు.. CPS కింద 300 కోట్లు నిధులు విడుదల చేయగా. TDS కింద 265 కోట్లు చెల్లింపులను ఆర్ధికశాఖ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉద్యోగులకు… 1300 కోట్లు పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేశారు. ఇదే క్రమంలో సుమారు 6.5 లక్షల మంది విద్యార్ధులకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్ మెంట్ నిధులైన 788 కోట్లు రూపాయిలు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.
ముఖ్యంగా కాంట్రాక్లర్ల విషయంలో గత ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందనే ఆరోపణ ఉంది. ప్రభుత్వాలు మారినా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. టీడీపీ హయాంలో ఇవ్వాల్సిన బకాయిను నాటి సీఎం జగన్…రాజకీయ కక్ష్యతో నిలిపివేశారనే అపవాదు ఉంది. చిన్న, చిన్న ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన 26 వేల మందికి.. 10 లక్షల లోపు బిల్లులుగా ఉన్న586 కోట్లు విడుదల చేశారు. ఇదే క్రమంలో 650 చిన్న కంపెనీలకు గాను… ప్రభుత్వ రాయితీలు కింద 90 కోట్లు రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ వివిధ వర్గాలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ క్రింద 500 కోట్లు విడుదల చేశారు. జగన్ ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకున్న ఆరోగ్య శ్రీ బకాయిలు.. దాదాపు 3 వేల కోట్లు పెండింగ్ పెట్టింది. విడతలు వారీగా ఇప్పటికే కొన్ని చెల్లింపులు చేసిన ప్రభుత్వం… సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవకు 400 కోట్లు రిలీజ్ చేసింది. ఐదేళ్లుగా అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలు పెండింగ్ నిధును కూడా క్లియర్ చేసింది.దీనికోసం ప్రభుత్వం 241 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
Also Read: Kondapalli Srinivas: మంత్రి పదవి నుంచి తొలగిస్తారా..? అవును.. ఇది నిజమేనా..?
పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు..ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు సీఎం. ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నా.. విడతల వారీగా క్లియర్ చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఏకంగా 94 కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాలను నిలిపివేయగా… వాటిల్లో 73 పథకాలను రివైవ్ చేయడం కోసం సీఎం చంద్రబాబు ఆరువేల కోట్ల రూపాయలు కేటాయింపుల చేసి..తిరిగి వాటిల్ని ఏపీలో అమలు చేసేందుకు కేంద్రం అనుమతి కోరింది.గత ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెడితే.. చంద్రబాబు సర్కార్ మాత్రం ప్రజల ఆదాయం పెంచేందుకు వినియోగిస్తోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.