AP Politics: మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు టీడీపీలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితులుగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పట్టించుకున్న దాఖలులు లేవు. ప్రస్తుతం ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి ఏడాదిగా ఏ పార్టీలో చేరలేకపోతున్నారు. దాంతో ఆయనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడిందంట.
మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఫొలిటికల్ ఫ్యూచర్పై చర్చ
మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఫొలిటికల్ ఫ్యూచర్పై ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీడీపీలో కీలక నేతగా పలు పదవులను అలంకరించిన మాజీ మంత్రి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండా తయారయ్యారు. గడిచిన సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఒకప్పుడు టీడీపీలో కీలక నేత గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధా రాఘవరావు రాజకీయ జీవితం డైలమాలో పడటానికి స్వయం కృతాపరాధమే అంటున్నారు. వ్యాపార వేత్తగా ఉన్న సిద్ధా రాఘవరావు 1999లో టీడీపీలో చేరగానే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి పోటీచేయించారు.
శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించిన చంద్రబాబు
అయితే ఎన్నికల్లో ఓడిన రాఘవరావు కు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించి చంద్రాబాబు సముచిత గౌరవం ఇచ్చారు. అనంతరం 2007లో ఎమ్మెల్సీగాను అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అక్కడ విజయం సాధించిన రాఘవరావుకు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలు కేటాయించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు సైకిల్ దిగి ప్యాన్ కిందకు చేరాడు.
2024 ఎన్నికల్లో శిద్దాకు టికెట్ కేటాయించని జగన్
వైసీపీలో చేరిన శిద్దాకు ఐదేళ్ల కాలంలో కనీస ప్రాధాన్యత లభించలేదు. టీడీపీలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అంతా తానై శాసించిన రాఘవరావుకు వైసీపీలో ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా 2024 ఎన్నికల్లో ఎక్కడ సీటు కేటాయించలేదు. ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన శిద్ధా రాఘవరావు గడిసిన సంవత్సర కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండి పోయారు. అయితే అతని అనుచరగణం మాత్రం ఆయన టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం మాత్రం చేసుకుంటున్నారంట. మరో వర్గం మాత్రం కష్టకాలంలో పార్టీ వీడి పోయిన వారిని ఎవరిని పార్టీలో చేర్చుకోవద్దని లోకేష్ చెప్పారని, రాఘవరావు ను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు.
ప్రశ్నార్థకంగా మారిన శిద్దా కుమారిడి రాజకీయ భవిష్యత్తు
జిల్లాలో మాత్రం టీడీపీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన శిద్దా వైసీపీకి వెళ్ళి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది. రాఘవరావుతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం అయ్యిందట. శిద్దా రాఘవరావు తన కుమారున్ని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు బాగానే ప్రయత్నాలు చేశారంట. టీడీపీలో మంత్రిగా శిద్దా కొనసాగుతున్న సమయంలో ఆయన పోటీచేసి విజయం సాధించిన దర్శి నియోజకవర్గంలో సిద్ధా సుధీర్ పెత్తనమే కొనసాగిందంట. 2019 ఎన్నికల్లో తాను ఒంగోలు ఎంపీగా పోటీచేస్తూ తన కుమారుడికి దర్శి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారట.
Also Read: చిత్తూర్ జిల్లా ఎమ్మెల్యేలకు షాక్.. అసలేం జరుగుతోంది
వ్యాపార అవసరాల కోసం వైసీపీలో చేరిన శిద్దా
అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల తర్వాత వ్యాపార వ్యవహారాల్లో వచ్చిన చిక్కుల నుండి బయట పడేందుకు శిద్దా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రిజైన్ చేసి, టీడీపీలో చేరే అవకాశం లేకుండా పోయిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారట . దీంతో ఆయనతో పాటు సిద్ధా సుధీర్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. 2014 నుండి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న శిద్ధా కుటుంబం ఇంటికి పరిమితం కావటంతో సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై కూడా నీలి నీడలు కమ్ముకున్నామి. 2024 ఎన్నికల ముందు కూడా రాఘవరావు కు టీడీపీ లో చేరే అవకాశం వచ్చిందట. అయితే దానిని అప్పట్లో ససేమిరా అన్నారంట. చేజేతులా చేసుకున్న దానికి ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నారని టీడీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయిప్పుడు.
Story By Apparao, Bigtv