Drunk Driving: స్వేచ్ఛ బ్యూరో: చట్టాలంటే గౌరవం లేదు. పోలీసులంటే భయం లేదు. పీకలదాకా తాగుతున్నారు. కార్లు.. టూ వీలర్లతో రోడ్ల మీదకు వస్తున్నారు. మత్తులో ప్రమాదాలు చేస్తున్నారు. ప్రాణాలను బలి తీసుకుంటూ పదుల సంఖ్యలో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. పోలీస్ లెక్కల ప్రకారమే ఏటా డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా కనీసం 60మంది మృత్యువాత పడుతున్నారు. అయితే, వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. చాలా ప్రమాదాల్లో ఇతరత్రా కారణాలు చూపిస్తున్నారని అంటున్నాయి. కఠినమైన శిక్షలు లేకపోవటం.. పట్టుబడ్డ వారిని చిన్నాచితక జరిమానాలు విధించి వదిలేస్తుండటమే ఈ పరిస్థితికి కారణం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రతీ రోజు జరుపుతున్న డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు
ఒక్క హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధుల్లో ప్రతీ రోజు జరుపుతున్న డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో వెయ్యి నుంచి పన్నెండు వందల మంది పరిమితికి మించి మందు కొట్టి పట్టుబడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే వీళ్లల్లో చాలా మంది మళ్లీ మళ్లీ దొరుకుతుండటం. దీనికి కారణం ఇలాంటి తాగుబోతులకు కఠిన శిక్షలు పడకపోతుండటమే అన్నది సుస్పష్టం. నిజానికి రాష్ట్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో మద్యం తాగి పట్టుబడితే మోటారు వాహనాల చట్టం ప్రకారం మొదటిసారి 10వేల వరకు జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రెండోసారి దొరికితే 15వేల జరిమానా, 2సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.
నేరుగా ఆఫీసులకే కేసు వివరాలు..
కొన్నిసార్లు మెజిస్ట్రేట్ల ఆదేశాల మేరకు తాగి దొరికిన వారికి కొన్ని రోజుల జైలు శిక్షతోపాటు కూడళ్ల వద్ద ప్లకార్డులతో కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తారు. డ్రంకెన్ డ్రైవ్ లో ఉద్యోగులు దొరికితే కేసు వివరాలను వారి ఆఫీసులకు పంపిస్తారు. స్టూడెంట్స్ అయితే కాలేజీలకు వివరాలు తెలియ చేస్తారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులైతే శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ను తాత్కాలికంగా, కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంది.
ట్రాఫిక్ పోలీసుల వివరణ..
అయితే, మందు కొట్టి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్న వారిలో ఈ శిక్షలు అమలు కావటం లేదు. ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న దానిని బట్టే కోర్టుల్లో పట్టుబడుతున్న వారిలో ఎనభై శాతం మందికి కేవలం జరిమానాలే పడుతున్నాయి. అందులోనూ ఎక్కువ మందికి 2వేల జరిమానాలు విధిస్తున్నారు. ఇక, జైలు శిక్షల విషయానికి వస్తే రెండు.. మూడు రోజులు మాత్రమే పడుతోంది. ఎక్కువలో ఎక్కువగా వారంపాటు కారాగారవాసం విధిస్తున్నారు.
ప్రమాదాలు చేసినపుడు..
మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదం జరిపినపుడో.. ప్రాణం పోవటానికి కారణం అయినపుడో బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసుల్లో శిక్షలు కాస్త కఠినంగా ఉంటున్నాయి. అయితే, ఈ కేసుల్లో విచారణ నెలల తరబడి సాగుతోంది. ఈలోపు నిందితులుగా ఉన్నవారు బాధిత కుటుంబాలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. కేసులో మేము జైలుకు పోతే మీకు వచ్చేది ఏముండదు.. ఎంతో కొంత తీసుకొని కాంప్రమైజ్ చేసుకుందాం చెప్పి రాజీ కుదుర్చుకుంటున్నారు. మరికొన్ని కేసుల్లో సాక్షులుగా పోలీసులు పేర్కొన్నవారు కోర్టులకు రావటం లేదు. వచ్చినా తమకేమీ తెలియదని.. పోలీసులు సాక్షులుగా ఉండమంటే సంతకాలు పెట్టామని కోర్టుల్లో చెబుతున్నారు. దాంతో న్యాయస్థానాల్లో కేసులు వీగిపోతున్నాయి.
దొరికినపుడు చూసుకుందాంలే..
ఈ నేపథ్యంలోనే మందుబాబులకు భయం లేకుండా పోతోంది. దొరికినపుడు చూసుకుందాం.. పట్టుబడ్డా జరిమానా కట్టేసి బయటికి వచ్చేయొచ్చు అని భావిస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతో పాటు ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డవారికి గరిష్ట శిక్షలు విధించటం ఒక్కటే మార్గమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ దిశగా అధికార యంత్రాంగాలు.. కోర్టులు చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం.
Also Read: జగ్గారెడ్డికి అబద్ధాల్లో ఆస్కార్ ఇవ్వొచ్చు: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్