Terror Threat: స్వేచ్ఛ బ్యూరో: పంద్రాగస్టు సందర్భంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఢిల్లీలో విధ్వంసం సృష్టించే కుట్రలు చేస్తున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం.. భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో అనుమానాస్పద ప్రాంతాలు, వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టారు. కీలక ప్రాంతాల్లో ఇప్పటి నుంచే మెటల్ డిటెక్టర్లు, పోలీస్ జాగిలాలతో తనిఖీలు జరుపుతున్నారు.
పదుల సంఖ్యల్లో మరణించిన ఉగ్రవాదులు..
పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ జరిపిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా మన వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదులు పదుల సంఖ్యలో చనిపోయారు. వాటి స్థావరాలు కూడా దెబ్బ తిన్నాయి. అప్పటి నుంచి హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఏ తొయిబా తదితర ఉగ్ర సంస్థలు పగతో రగిలి పోతున్నాయి. మన దేశానికి చెందిన వారినే డబ్బు ఆశ చూపించి ఉగ్ర బాటలోకి నడిపిస్తూ ధ్వంస రచనలు చేస్తున్నాయి. అయితే, నిఘా వర్గాలు ఈ కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతూ అప్రమత్తం చేస్తూ వస్తున్న నేపథ్యంలో కుట్రలు భగ్నమవుతూ వస్తున్నాయి.
జంతర్ మంతర్ నిరసనలో ఉగ్రవాదులు..
పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను వేర్వేరు రాష్ట్రాల పోలీసులు సీజ్ చేశారు. ఇటీవల నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరిపినపుడు కూడా ఉగ్రవాదులు పెట్రోల్ బాంబులు విసరటంతోపాటు కాల్పులు జరపాలని పన్నాగాలు పన్నారు. పోలీసుల అప్రమత్తతతో ఈ కుట్రలు ఫలించలేదు. ఆ తర్వాత పంజాబ్ పోలీసులు ఈ కుట్రలు చేసినవారిని అరెస్ట్ కూడా చేశారు.
అలర్ట్ అయిన పోలీసులు..
ప్రస్తుతం స్వాతంత్ర్య దినోత్సవం సమీపించిన నేపథ్యంలో ఢిల్లీలో హింసను రేకెత్తించటానికి లష్కర్ ఏ తొయిబాతోపాటు మరికొన్ని ఉగ్ర సంస్థలు కుట్రలు చేస్తున్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఇటు కేంద్రం అటు భద్రతా బలగాలను అలర్ట్ చేశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొని ఉన్న అంతర్గత పరిస్థితుల నుంచి జనం దృష్టిని మరలించటం కూడా ఈ కుట్రల వెనక మరో కారణమని తెలిపాయి. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైల్వే, బస్సు, మెట్రో స్టేషన్లలో నిఘాను పటిష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై కన్నేశారు. భద్రత కాస్త తక్కువగా ఉండే నగరాల్లో కూడా ముందస్తు చర్యలు చేపట్టారు.
బంగ్లాదేశ్ బోర్డర్లో భద్రతా చర్యలు..
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను అప్రమత్తం చేశారు. అదే సమయంలో వెస్ట్ బెంగాల్.. బంగ్లాదేశ్ బోర్డర్ లో కూడా భద్రతా చర్యలను పటిష్టం చేశారు. ఈ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు చొరబాటులు జరుపవచ్చని ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు ఆపరేషన్ అలర్ట్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. గస్తీని కూడా ముమ్మరం చేసినట్టు తెలిసింది.