Monsoon Deficit: నైరుతి రుతుపవనాలు రావడమే ఆలస్యంగా వచ్చాయ్. ఇప్పుడిప్పుడే దేశంలో పుంజుకుంటున్నాయ్. అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు.. ముంబైతో పాటు శివారు ప్రాంతాలు, గుజరాత్లోని కొన్ని భాగాల్లోకి ప్రవేశించడం మొదలైంది. దాంతో.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వర్షాలు బాగా కురవబోతున్నాయనే ఆశలు చిగురిస్తున్నాయ్. అప్పుడప్పుడు వానలు కురుస్తున్నా.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గత 146 ఏళ్లలో.. అత్యంత లోటు వర్షపాతం నమోదైన జూన్ నమోదవబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐఎండీ లెక్కల ప్రకారం జూన్ 4 నుంచి జూన్ 22 మధ్య దేశంలో సాధారణంగా కురవాల్సిన 97 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా.. కేవలం 53 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే దేశంలో 46 శాతం లోటు వర్షపాతం రికార్డైంది. దేశంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ తీవ్ర లోటు వర్షపాతంలోనే ఉన్నాయ్. ఇదే.. ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. భారతదేశ రుతుపవన కేంద్రానికి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్లో 58 శాతం వర్షపాతం లోటు ఉండగా, మహారాష్ట్రలో 85 శాతం లోటు నమోదైంది. దేశంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్లో సాధారణ స్థాయి కంటే 84 శాతం తక్కువగా ఉంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో 71 శాతం, మేఘాలయాలో 81 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
Also Read: ఈ లేత వయస్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు ? వైభవ్ కు డారిల్ హెచ్చరికలు
లేటెస్ట్గా ఐఎండీ రిలీజ్ చేసిన శాటిలైట్ ఇమేజెస్ సుదీర్ఘ పొడి వాతావరణానికి గల కారణాన్ని సూచిస్తున్నాయ్. కొన్ని రోజుల పాటు మేఘాలు బంగాళాఖాతం, తూర్పు భారతదేశం, హిమాలయ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉండగా, మధ్య భారత్, పశ్చిమ భారతదేశంలోని చాలా విస్తారమైన ప్రాంతాలు మేఘాలు లేకుండా ఉన్నాయ్. సరైన విధంగా రుతుపవనాలు లేకపోవడం, తేమ బలహీనంగా ఉండటం వల్ల వర్షాన్ని మోసుకొచ్చే మేఘాలు ముందుకు సాగలేకపోయాయ్. ఈ పరిస్థితులన్నీ ఇప్పుడిప్పుడే మారుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం క్రమంగా పెరగనుంది.
వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం వందేళ్లకు పైగా నమోదైన పరిశీలనలో 2026 జూన్ అత్యంత పొడి జూన్ నెలల్లో ఒకటిగా మారబోతోంది. వర్షపాతు లోటు కేవలం తీవ్రమైన కరువు సంవత్సరాల్లో మాత్రమే కనిపించే స్థాయికి చేరుకుంటోంది. బలహీనమైన రుతుపవనాల కారణంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో.. విత్తనాలు నాటే పరిస్థితులు ప్రభావితమయ్యాయ్. నీటి లభ్యతపైనా కొన్ని రాష్ట్రాల రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్లోని రైతులు పెద్ద ఎత్తున నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు ఎడతెరిపి లేని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అందువల్ల.. ఈ వారం వ్యవసాయానికి కీలకం కానుంది. రుతుపవనాలు మళ్లీ కదులుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ సీజన్లోని అత్యంత కీలక దశలో పేరుకుపోయిన భారీ వర్షపాత లోటు భర్తీ అవుతుందా? లేదా? అనేదే సస్పెన్స్గా మారింది.
Also read: తుంగభద్ర జలాలపై.. రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చేసిన మంత్రి ఉత్తమ్