Janwada Farm House Rave Party: తెలంగాణలో పేకాట క్లబ్బులు, గ్యాబ్లింగ్ ఉండకూడదంటూ మొదటి సారి అధికారం చేపట్టిప్పుడు గొప్పగా వార్నింగ్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ . అప్పట్లో శపథం చేసినట్లు కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు అభాసుపాలవుతుంది. కేటీఆర్ బావమరిది ఫామ్హౌజ్లోనే క్యాసినో ఏర్పాటు చేయటం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత నిందితురాలిగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే కేటీఆర్ బంధుగణం ఇంట్లోనే అనుమతిలేని లిక్కర్ పార్టీలు, క్యాసినో దందాలు పట్టుపడటంతో ఆ ఫ్యామిలీ అంతా రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్గా మారింది.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత క్లబ్బులపై కేసీఆర్.. భారీగా దాడులు చేయించారు. పేకాట క్లబ్బులు, గ్యాంబ్లింగ్లకు పూర్తి స్థాయిలో తెర దించుతామన్నారు. దీంతో చాలాకాలం పాటు పేకాట ఆడడానికే గ్యాంబ్లర్స్ భయపడ్డారు. అయితే ఇప్పుడు కేటీఆర్ బావమరిది ఫామ్హౌజ్లోనే క్యాసినో ఏర్పాటు చేయటం విమర్శలకు దారి తీస్తోంది. బ్లాక్ జాక్ గేమ్ నిర్వహిస్తూ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల.. పోలీసులకు దొరికిపోయారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత నెలల తరబడి తీహార్ జైల్లో మగ్గి బెయిల్పై విడుదలయ్యారు. ఆ కేసు ఏ మలుపు తిరుగుతుందో, నిందితురాలిగా ఉన్న కవిత పరిస్థితి ఏంటో అన్న గుబులు గులాబీ శ్రేణుల్లో కనిపిస్తుంది. తాజాగా కేటీఆర్ బామమరిది ఇంట్లోనే క్యాసినో, అనుమతి లేని లిక్కర్ పార్టీ జరుగుతున్న వ్యవహారం వెలుగు చూడటంతో ఆ ఫ్యామిలీ పరువు మరింత రచ్చకెక్కినట్లైంది
జన్వాడలో ఫామ్హౌస్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్హౌస్లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దాదాపు 80 మంది పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఫామ్హౌస్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిందిగా గుర్తించారు. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధరించారు. విదేశీ మద్యం సహా భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కాయిన్స్ సైతం ఇక్కడ లభ్యమయ్యాయి.
ఆ రేవ్ పార్టీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం రాజ్ పాకాల పబ్ వ్యాపారంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు చెందిన ఫామ్ హౌస్లోనే ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో మొత్తం 80 మంది వరకు పాల్గొన్నారు. అంతేకాదు 10.5 లీటర్ల ఏడు విదేశీ మద్యం బాటిల్స్.. 10 ఇండియన్ మేడ్ లిక్కర్ బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ రూల్స్ ప్రకారం ఆ స్థాయి పార్టీ జరిగేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి.. కానీ రాజ్పాకాల ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. అంతేకాదు ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
Also Read: రావు గారి రేవ్ పార్టీ ఫుటేజ్ డిలీట్.. నేషనల్ మీడియాలో చర్చ
ఆ ఫాంహౌస్లో అర్ధరాత్రి పార్టీలు నిత్యకృత్యమని స్థానికులు అంటున్నారు. కేటీఆర్ కూడా తరచూ వస్తుంటారని జన్వాడ కాలనీ వాసులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి రావడానికి కొద్దిసేపటి ముందే.. ఫామ్హౌస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఫామ్హౌస్ పార్టీలో కేటీఆర్ భార్య శైలిమ కూడా పాల్గొన్నట్లు సమాచారం. శైలిమ సోదరుడే రాజ్ పాకాల.
మరోవైపు జన్వాడ ఫామ్హౌస్లో రేవ్ పార్టీపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు రెయిడ్ చేసిన సమయంలో ఏం జరిగింది? అనేది హాట్ డిబేట్గా మారింది. కేవలం మగవాళ్లకు మాత్రమే డ్రగ్ కిట్స్తో టెస్ట్ చేసిన పోలీసులు.. విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. మహిళలకు మాత్రం డ్రగ్ కిట్తో టెస్ట్ చేయలేదు. దీంతో మహిళలకు ఎందుకు డ్రగ్ కిట్తో పరీక్షలు చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ సన్నిహితులు కూడా చాలా మంది పార్టీలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. వాళ్లను తప్పించడానికే మహిళలకు డ్రగ్ కిట్తో టెస్ట్ చేయలేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కేసీఆర్ కుటుంబం ఇలా వరుస వివాదాల్లో ఇరుక్కుంటుండటంతో గులాబీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి . మరో వైపు ఆ ఫ్యామిలీ ఇతర పార్టీల నేతలకు ఒక రేంజ్లో టార్గెట్ అవుతుంది . కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలని ప్రభుత్వం చేస్తుంటే కేటీఆర్ ఇలాంటి పార్టీలను ప్రోత్సహించడం.. దేనికి సంకేతమని మండిపడ్డారు. డ్రగ్స్ పార్టీలను ఎంకరేజ్ చేస్తూ..ప్రజలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు.
డ్రగ్ పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గతంలో డ్రగ్స్ నిందితులను బీఆర్ఎస్ సర్కారు కాపాడిందన్న సంజయ్…కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడే యత్నం చేస్తే ప్రజలు తిరగబడతారనే విషయాన్ని సర్కారు గుర్తించుకోవాలన్నారు. పార్టీలో కేటీఆర్ పాల్గొన్నట్లు సమాచారం ఉందని… టవర్ లోకేషన్స్ ఎంక్వయిరీ చేయాలని సూచించారు.
తన ఫాంహౌస్లో రెయిడ్ జరిగిన వెంటనే కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పరారయ్యారు. దీంతో రాయదుర్గంలోని ఆయన విల్లా డోర్ బద్దలుకొట్టి లోపలకు వెళ్లడానికి పోలీసులు ప్రయత్నిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ ప్రత్యక్షమై పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడం మరన్ని అనుమానాలకు తావిస్తుంది.