Karimnagar Politics: పాలకపీఠాన్ని సాధించుకోవడం వేరు.. ఆ పీఠమెక్కాక అక్కడి సవాళ్లను ఛేదించి పేరు తెచ్చుకోవడం వేరు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకపీఠం వైకుంఠపాళీ ఆటలో సక్సెస్ అయిన కాషాయదళం.. మరిప్పుడు అక్కడ ప్రధానంగా పేరుకుపోయిన రెండు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుందా అన్న చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఇంతకీ కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఆ సవాళ్లేంటి..? వాటిని బీజేపీ పాలకపక్షం ఎలా ఎదుర్కోబోతోంది..?
కరీంనగర్ నగరం నడిబొడ్డున ఉన్న డంప్ యార్డ్.. నిత్యం సాయంత్రమైతే చాలు రావణకాష్టంలా కాలుతూ.. కరీంనగర్ ప్రధాన నగరంలోని పలు కాలనీల్లో పొగచూరిన బతుకులకు కారణమవుతోంది. డంప్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు అది శివారు ప్రాంతమే అయినప్పటికీ.. ఇప్పుడు కరీంనగర్ నగరం విస్తరించడం.. డివిజన్ల సంఖ్య పెరగడంతో ఇప్పుడు డంప్ యార్డ్ నగరం మధ్యలో ఉన్నట్టే భావించాల్సి ఉంటుంది. ఈ డంప్ యార్డ్తో కోతిరాంపూర్, బొమ్మకల్, బైపాస్ రోడ్డు, రామచంద్రాపురం, కట్టరాంపూర్, అల్గనూర్, అల్కాపురి వంటి కాలనీలన్నీ పొగచూరిపోయి.. జనం శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు.
డంప్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు గతంలో 16 కోట్ల రూపాయలతో యంత్రాలు బిగించినా.. అవి వాడకపోవడంతో పూర్తిగా చిలుంపట్టి ఇప్పుడు పనికిరాకుండా పోయాయి. నేటి టెక్నాలజీకి అనుగుణంగా యంత్రసామాగ్రి లేకపోవడంతో పాటు.. నిత్యం చెత్తకు మంటలంటుకోవడం.. ఫైర్ ఇంజన్స్ రావడం ఇదో నిత్యకృత్యంగా మారింది. దీంతో కరీంనగర్ లో రెండు ప్రధాన సమస్యల్లో డంప్ యార్డ్ ఇప్పుడు మెయిస్ ఇష్యూగా మారి.. శివారు ప్రాంతాలు నిత్యం ధర్నాలు, నిరసనలతో మారుమోగుతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కేంద్ర పట్టణశాఖా మంత్రి మనోహర్ లాల్ కట్టర్ కూడా ఇక్కడికొచ్చి ఈ డంప్ యార్డ్ ను ఎత్తివేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. కానీ, ఇప్పటివరకూ అతీగతీ లేదు.
Also Read: ACB Raids: అగ్రికల్చర్ ఆఫీస్లో ఆకస్మికంగా ఏసీబీ రైడ్స్.. బయటపడ్డ సంచలనాలు
ఇక కరీంనగర్ లో మరో ప్రధాన సమస్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట, ఆదిలాబాద్, మంచిర్యాలను కలిపే రోడ్డులో ఆర్వోబీ నిర్మాణం పూర్తికాక ప్రయాణీకులు నిత్య నరకమనుభవిస్తున్నారు. విపరీతమైన దుమ్ముధూళితో ఈ శివారు ప్రాంతానికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. సగం సగం పనులు మాత్రమే పూర్తై, ఎక్కడికక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో పాటు.. రైల్వే గేటు పడ్డప్పుడు ఆంబులెన్సులు ఆగిపోయి కొందరి ప్రాణాల మీదకే వస్తున్న పరిస్థితులు గతంలో ఆవిష్కృతమయ్యాయి. ఇక్కడ ఆర్వోబీ నిర్మాణానికి కేంద్రం 154 కోట్ల రూపాయలు కేటాయించగా.. రైల్వేశాఖ నుంచి ప్రధాన స్థంభాలకు కావల్సిన డిజైన్స్ అనుమతులు రాక ఈ పనులు ఆగిపోయినట్టుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడం వల్లే పనులు జాప్యం జరుగుతున్నాయన్నది బీజేపీ వాదన. అయితే సర్వీస్ రోడ్లకు కావల్సిన భూసేకరణ సంగతి పక్కనబెట్టి.. ముందు పియర్స్ కు కావల్సిన డిజైన్స్ సంగతి చూడాలంటోంది కాంగ్రెస్. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న రెండు పార్టీలు బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) మధ్య సమన్వయం లేక జనం నానా బాధలు పడుతున్నారు. ప్రస్తుతం ఆర్వోబీ నిర్మాణంలో ఉన్న 2వ డివిజన్ కార్పోరేటర్ కొలగాని శ్రీనివాసే మేయర్ గా ఎన్నికయ్యారు. మరి ఇంతకాలం ఆర్వోబీపైన ప్రతిపక్ష కార్పోరేటర్ గా, నేతగా పోరాటం చేసిన మేయర్ శ్రీనివాస్.. ఇప్పుడు బీజేపీ పాలనలో ఆర్వోబీ పూర్తి చేస్తారా…? అసలు దానిపై ఆయన ఏమంటున్నారు?.
Also Read: Damodar Rajanarasimha: హరీష్ రావుకు మంత్రి దామోదర రాజనర్సింహా స్ట్రాంగ్ కౌంటర్..!
మున్సిపల్ ఎన్నికలకు ముందు చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో బహిరంగ సభకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ నగరంలోని ప్రధాన సమస్యలను ఇక్కడి కాంగ్రెస్ నాయకులు వివరించారు. దాంతో కరీంనగర్ లో కాంగ్రెస్ మేయర్ పీఠమెక్కితే.. కరీంనగర్ లో ప్రస్తుతమున్న డంప్ యార్డ్ ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్-వరంగల్ మధ్యలోకి డంప్ యార్డ్ ను తరలించి… ఈ రెండు సిటీస్ ను జంట నగరాల్లా అభివృద్ధి పరుస్తామంటూ హామీ ఇచ్చారు.
కానీ, ఇప్పుడు నగర మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు బీజేపీకి దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా 14 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ ఏం చేయబోతోంది? డంప్ యార్డుతో పాటు, మరో ప్రధాన సమస్యైన ఆర్వోబీపై ఫైట్ ఎలా ఉండబోతోంది? వాటిపైకాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్స్ ఏమంటున్నారో చూడండి.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటంతో బీజేపీ నేతలు ఈ సమస్యల పరిష్కారానికి నిధులు తీసుకురాగలిగారు. కేంద్రమంత్రులు కూడా వచ్చి చూసి వెళ్లారు. అయినా డంప్ యార్డ్ ఎత్తివేతతో పాటు, ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేయడంలో బీజేపీ ఇంతకాలం విఫలమైంది. మరిప్పుడు ఏకంగా కరీంనగర్ పాలకపీఠాన్నే దక్కించుకుని కార్పోరేషన్ పై కాషాయజెండాను ఎగురవేసింది. ఇప్పుడైనా ఈ ప్రధాన సమస్యలను సవాల్ గా స్వీకరించి పరిష్కరిస్తుందా అన్నది చూడాలి.
Also Read: Vijay – Rashmika : ఉదయ్పూర్ లో అంబానీ ల్యాండ్ .. విజయ్ – రష్మిక పెళ్లికోసమేనా?