కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం తప్పదనే భావనకు వచ్చింది రేవంత్ సర్కార్. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆమెపై వేటు పడనుంది. అయితే ఆమె అధిష్టానం నుంచి వచ్చే సందేశం ఎలా ఉండబోతుందనే విషయాన్ని మౌనంగా గమనిస్తున్నారు. మరో ఐదారు రోజుల పాటు ఢిల్లీ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోతే.. మళ్లీ మంత్రిగా ఆమె విధుల్లో యాక్టివ్ కానున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ అధిష్టానం కొండా సురేఖను తప్పించాలని డిసైడ్ అయితే … మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా సూచిస్తుంది. కానీ దీనికి ససేమిరా అనేలా ఉన్నారు కొండా సురేఖ. ఇది సాధ్యం కాకపోతే గవర్నర్ ద్వారా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయించేందుకు మరో అవకాశం ఉంది. ఇక మూడో పరిష్కార మార్గంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను ప్రయార్టీలోకి తీసుకోనుంది అధిష్టానం.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణను పెండింగ్లో పెట్టేసింది అధిష్టానం. ఇప్పుడు కొండా సురేఖపై వేటు ఉదంతం నేపథ్యంలో దీన్ని తెరపైకి తేవడం మూలంగా.. ఆమెను తొలగించి.. కొత్త వారికి చాన్స్ ఇస్తే సరిపోతుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే కేబినెట్లో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కొండా పదవి ఖాళీ అవడంతో మూడు మంత్రి పదవులకు అవకాశం దొరకనుంది. ఇంకా ఒకరిద్దరిని తప్పిస్తారని ప్రచారం జరిగినా..ఈ వివాదం నేపథ్యంలో ఇతరుల మంత్రి పదవుల జోలికి పోయే పరిస్థితులు లేవంటున్నారు. దీంతో ఖాళీగా ఉన్న మూడు బెర్తులకు గాను ఒక బీసీ, ఎస్టీతో పాటు ఓసీకి అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఆది శ్రీనివాస్ను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా మున్నూరుకాపు సామాజికవర్గానికి సమన్యాయం చేసినట్టవుతందనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్టీ జాబితాలోని లంబాడా వర్గానికి ఈ కేబినెట్లో చాన్స్ దొరకలేదు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి ఓ ఎస్టీ కి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు.
ఇక ఓసీల జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్రెడ్డి మంత్రి పదవులు ఆశించిన వారిలో ప్రధాన రేసులో ఉన్నారు. వీరిలో కోమటిరెడ్డి తనకు పదవి ఇవ్వాల్సిందేనని అసమ్మతి రాగం వినిపిస్తున్న నేపథ్యంలో.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొన్నది.
సుదర్శన్రెడ్డి ఇక రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నారు. ఇదే ఆయనకు ఆఖరు టర్ము. కానీ మంత్రి పదవి వచ్చేలా లేదని, కేబినెట్ ర్యాంకుతో కూడిన ప్రభుత్వ సలహాదారు పదవిని అప్పగించారు సీఎం రేవంత్రెడ్డి, మల్రెడ్డి కూడా ఈ మధ్య మంత్రి పదవి విషయంలో కొంత తగ్గినట్టు కనిపిస్తున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇటీవల రాహుల్గాంధీని కలిసి రావడంతో ఆయనకు బెర్త్ ఖాయమనే ప్రచారం జరిగింది.