కొండా సురేఖపై ఇక వేటు తప్పదని డిసైడ్ చేసింది రేవంత్ సర్కార్. దీనికి తమ వంతుగా చేయాల్సినవన్నీ పూర్తి చేసి అధిష్టానానికి తమ నిర్ణయాన్ని తెలియజేసింది. ఇక ఫైనల్ నిర్ణయం అధిష్టానం టేబుల్ పై ఉంది. అయితే దీనిపై ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదనే ఉద్దేశ్యంతో ఉంది సర్కార్.
కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్. దానిపై ఒత్తిడి పెంచలేరు. పదే పదే తమ నిర్ణయాన్ని అమలు చేయాలని బలవంత పెట్టలేరు. అదంతే. ఆ పార్టీ విధానం, సిద్దాంతం అలాగే ఉన్నాయి మరి. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. అందుకే ఇప్పుడు అందరికంటే ఎక్కువ దీనిపై రేవంత్ సర్కార్లోనే ఉత్కంఠ నెలకొని ఉంది. కౌంట్ డౌన్ షురూ అయ్యింది. నిన్న క్రమ శిక్షణ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేసింది. వేటు వేయాల్సిందేనని చెప్పేసింది.
ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లింది రిపోర్టు. ఇక ఉత్కంఠగా ఎదురు చూడటం తప్ప ఇంకేమీ మాట్లాడలేని స్థితి సర్కార్ది. ఢిల్లీలోనే డిస్కషన్ చేస్తారు. వెంటనే నిర్ణయం అమలు చేయమంటారా? కోల్డ్ స్టోరేజీలో పెడతారా? దీనిపైనే ఇప్పుడు అందరి చర్చంతా. అయితే ఓ డిస్కషన్ మాత్రం స్టేట్ కాంగ్రెస్లో అంతర్లీనంగా బలంగా సాగుతోంది.
అధిష్టానం తీసుకోబోయే ఈ నిర్ణయం .. రేవంత్కు ఢిల్లీ పెద్దలు ఇచ్చే ప్రయార్టీని సూచిస్తుందని లింకు పెట్టి మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. చాలా సందర్భాల్లో ఢిల్లీతో రేవంత్కు సత్సంబంధాలు లేవనే విధంగా ప్రతిపక్షం బీఆరెస్ బాగా ప్రచారం చేయాలనుకున్నది మొదట్లో.
ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ, మొదట్లో రాహుల్తో ఒక్క ఫోటోనైనా దిగాడా? అసలు ఆయన టైం ఇస్తున్నాడా? రేవంత్ను లైట్ తీసుకుంటున్నారు? అంటూ ఇక్కడ పార్టీలో ఓ అలజడి, చంచలత్వాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు కేటీఆర్. కానీ దీనికి తరువాత కాలంలో పెద్దగా పట్టు దొరకలేదు. జనాలు కూడా లైట్ తీసుకున్నారు.
ఇప్పుడు మళ్లీ కొండా ఉదంతంలో ఇదే చర్చ తెరపైకి వస్తోంది. వెంటనే కొండాపై వేటు వేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే.. ఇక్కడ సీఎంకు వారు అత్యధిక ప్రయార్టీ ఇచ్చినట్టు సంకేతం అనే సమీకరణలు చేస్తున్నారు. ఒకవేళ ఈ విషయంలో తాత్సారం చేసినా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసినా.. సీఎం నిర్ణయాన్ని కూడా అవసరమైతే పక్కన పెట్టేసి .. ఆ పార్టీ సమీకరణలకే కట్టుబడి ఉంటారనే మెసేజ్ ఇచ్చినట్టవుతుందనే ముచ్చట కూడా వినిపిస్తోంది.
నిర్ణయం ఏదైనా.. ఎప్పుడైనా.. ఇది ఓ రకంగా పరిపాలనపై ప్రభావం చూపే విధంగానే ఉంది. అంతిమంగా సీఎం రేవంత్ రెడ్డి కొండా ఫ్యామిలీ వ్యవహారంపై మాత్రం సీరియస్గా ఉన్నది వాస్తవం. ఒకవేళ దీన్ని రచ్చ చేయొద్దనుకుంటే రాజీ ఫార్మూలాను ఇక్కడే ఉపయోగించేవాడు. కానీ ఓసారి ఇలాంటి వాటిపై సీరియస్ యాక్షన్ ఉంటే.. అందరూ సెట్ అవుతారని రేవంత్ భావిస్తున్నాడు. మరి ఈ విషయంలో అధిష్టానం ఆలోచన ఎలా ఉందో తెలియాల్సి ఉంది.