Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అధిష్టానం వేసే ఒక్కో అడుగు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తుంటుంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ నాయకురాలు, కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ కొండా సురేఖకు ఢిల్లీ హైకమాండ్ నుంచి అత్యవసర పిలుపు (అర్జెంట్ కాల్) వచ్చింది. ఈ పరిణామంతో తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో కొండా సురేఖ హుటాహుటిన హస్తినకు వెళ్లారు. పార్టీ అగ్రనేతలతో ఆమె ఢిల్లీలో ముఖాముఖి కానున్నారు. ఈ భేటీ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అధిష్టానం సురేఖకు ఏ తరహా బాధ్యతలు అప్పగించబోతోంది? అనే అంశాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.
ఏ ఐ సి సి అగ్ర నేతలతో కొండా సురేఖ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చ జరగనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.బీసీ వర్గాల్లో కాంగ్రెస్ పట్టును మరింత బలపరచడం, రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీలో నాయకుల మధ్య సమన్వయం సాధించడం, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలో పార్టీ క్యాడర్ను పూర్తిస్థాయిలో సమాయత్తం చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు. అంతేగాక మంత్రి పదవి తీయడానికి కారణాలు కూడా కొండా సురేఖ అడిగి తెలుసుకోనున్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి కొండ సురేఖ ఎ సి సి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ ను అడిగారు. ఢిల్లీలో డిస్కషన్ చేద్దామంటూ ఆమె దాటవేసినట్లు కొండ సురేఖ అనుచరులు చెబుతున్నారు.
Also read: బన్నీతో ఆ ఒక్క సీన్.. వైష్ణవిచైతన్యకి చుక్కలు కనిపించాయట!
కొండా దంపతులకుఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆవేశం, మైక్ ముందుకు వస్తే ప్రత్యర్థులపై విరుచుకుపడే నైజం కొండా సురేఖ సొంతం. బీసీ వర్గాల్లో తీవ్ర ప్రభావం చూపగల నాయకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆమె సేవలను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా, జాతీయ స్థాయిలో , రాష్ట్ర స్థాయిలో కీలకమైన ప్రాధాన్యత ఉన్న పదవిని అప్పగించే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. జాతీయ కార్యవర్గంలో కీలక బాధ్యతలు లేదా పార్టీ సంస్థాగత నియామకాల్లో ఆమెకు పెద్ద పీట వేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.
అనూహ్యంగా కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో గాంధీ భవన్లోని ముఖ్య నేతల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఆమె ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనే దానిపై రచ్చబండ నుంచి పార్టీ కార్యాలయాల వరకు చర్చలు మొదలయ్యాయి. మరోవైపు కొండా అనుచరులు, అభిమానులు మాత్రం ఈ వార్తతో తీవ్ర ఉత్సాహంలో ఉన్నారు. అధిష్టానం సురేఖ సుదీర్ఘ సేవలకు తగిన గుర్తింపునిచ్చి, కీలక పదవి కట్టబెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ భేటీ తెలంగాణ కాంగ్రెస్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా? హైకమాండ్ కొండా సురేఖకు ఎలాంటి మాస్టర్ ప్లాన్ అప్పగించబోతోంది? అనేది
సస్పెన్స్ గా మారింది.
యూత్ కోసం నాయిస్ సరికొత్త ప్రయోగం! ఈ ట్రెండీ ఇయర్బడ్స్ చూశారా?