Operation Terror Hunt: ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు దిమ్మతిరిగిపోయింది. ఉగ్ర సంస్థలకు మైండ్ బ్లాంక్ అయింది. కానీ.. ఒక్క భారీ ఎటాక్తో టెర్రరిస్టులు భయపడతారా? పాక్లో ఇంకా ధ్వంసం చేయాల్సిన ఉగ్ర స్థావరాలు ఎన్ని ఉన్నాయ్? ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తే.. ఉగ్రవాదం సమూలంగా నాశనమవుతుందా? టెర్రరిజంపై యుద్ధం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్పై.. భారతీయుల్లో జరుగుతున్న చర్చేంటి?
సర్జికల్ స్ట్రైక్స్ చేశాం.. మళ్లీ వచ్చారు!
ఎయిర్స్ట్రైక్స్ చేశాం.. మళ్లీ వచ్చారు!
పీవోకేలోని ఉగ్ర స్థావరాలను కనిపెట్టి.. చుట్టుముట్టి మరీ ధ్వంసం చేశాం.. అయినా మళ్లీ వచ్చారు. కశ్మీర్లో నక్కిన ఒక్కొక్క టెర్రరిస్టుని.. వెతికి వెతికి మరీ ఏరిపారేసింది మన ఆర్మీ. అయినా సరే.. మళ్లీ వచ్చారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ సిందూర్తో.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్రస్థావరాలను లేపేశాయ్ మన భారత దళాలు. ఇప్పటికీ.. ఉగ్రవాదం అంతమవుతుందనే నమ్మకం లేదు. భారత్లో మళ్లీ ఉగ్రదాడులు జరగవని కచ్చితంగా చెప్పే గ్యారంటీ లేదు. ఇందుకు గత అనుభవాలే.. బిగ్ ఎగ్జాంపుల్. పైగా.. పాకిస్తాన్లో ఉగ్రవాదం కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. ఆ దేశంలో 30 ఏళ్లుగా ఉగ్రవాదం వేళ్లూనుకుపోయింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన రిక్రూట్మెంట్, ట్రైనింగ్ క్యాంపులు, లాంచ్ప్యాడ్ల రూపంలో.. ఉగ్ర స్థావరాలు పుట్టుకొస్తూనే ఉన్నాయని.. మన బలగాలే ప్రకటించాయి.
పాక్, పీవోకేలో మొత్తం 21 ఉగ్రవాద శిబిరాలు
భారత దళాలు ప్రకటించినట్లుగా.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో మొత్తం 21 ఉగ్రవాద శిబిరాలున్నాయి. వాటిలో.. ఆపరేషన్ సిందూర్తో 9 స్థావరాలను ధ్వంసం చేశాయి మన బలగాలు. ఇంకా.. 12 టెర్రరిస్ట్ క్యాంపులు మిగిలే ఉన్నాయి. అంటే.. ఈ ఒక్క ఆపరేషన్తో ఉగ్రవాదం అంతం కాలేదనే విషయం క్లియర్గా అర్థమవుతోంది. మరి.. మిగిలిన వాటిని ఎప్పుడు ధ్వంసం చేస్తారు? వాటిపై.. ఇండియా మిసైల్ స్ట్రైక్ ఎప్పుడు ఉంటుంది? అనే చర్చ మొదలైంది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలంటే.. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రరిస్ట్ క్యాంపులన్నింటిని సమూలంగా నాశనం చేయాలి. అప్పుడే.. ఉగ్రవాదం కంట్రోల్లోకి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలా జరగకపోతే.. మళ్లీ కొన్నాళ్లకు ఇండియాపై ఉగ్రవాద దాడులు జరగడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కేవలం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తే సరిపోదనే చర్చ
ఉగ్రవాదుల్ని సమూలంగా నాశనం చేయాలంటే.. కేవలం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తే సరిపోదనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఉగ్రవాదంతో పాటు ఉగ్రమూలాల్ని కూడా కూకటివేళ్లతో సహా పెకిలించాలంటే.. ఆ మిగతా టెర్రరిస్ట్ క్యాంపులను కూడా లేపేయ్యాలి. మళ్లీ ఉగ్రవాద స్థావరాలు నెలకొల్పాలంటే భయపడేలా చేయాలి. ఎందుకంటే.. ఉగ్రదాడి జరిగిన ప్రతిసారీ.. కౌంటర్ ఎటాక్గా భారత దళాలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తూ వస్తున్నాయి. మనం కచ్చితంగా ప్రతీకారదాడులు చేస్తామనే ఆలోచనతో.. పాక్ కూడా పీవోకేలోని టెర్రర్ క్యాంపుల్ని ఖాళీ చేయిస్తోంది.
ఇంతకుమించిన పరిష్కారం కావాలంటున్న భారత్
దాంతో.. ఉగ్రవాద శిబిరాలను ధ్వసం చేసినా.. పదుల సంఖ్యలో ఉగ్రవాదుల్ని హతమార్చినా.. పూర్తి స్థాయిలో టెర్రరిజం అంతం కావట్లేదు. భారత్ ఉగ్రవాద శిబిరాల్ని పేల్చేయడం.. వాళ్లు మళ్లీ స్థాపించడం, ట్రైనింగ్ మొదలుపెట్టడం, భారత్ మీదకు ఎగదోయడం కామనైపోయింది. మళ్లీ.. ఇండియా రిలాక్స్ అయ్యే సమయానికి టెర్రరిస్టులు వచ్చి దాడులు చేస్తున్నారు. ఎంతసేపూ.. ఇదే సరిపోతోంది. కానీ.. ఇప్పుడు ఇండియా కోరుకుంటున్నది ఇది కాదు. ఇంతకుమించిన పరిష్కారం కావాలంటున్నారు భారతీయులు.
ఉగ్ర శిబిరాలను ధ్వంసంతో టెర్రరిస్టులు బలహీనం
ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం వల్ల.. టెర్రరిస్టులు కొంతవరకు బలహీనమవుతారు. కానీ.. అంతటితో టెర్రరిజం అంతమవదు. శిబిరాలు ధ్వంసమైనా.. వారు కొత్త ప్రదేశాల్లో మళ్లీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. లేకపోతే.. రహస్య స్థావరాలకు మారతారు. పైగా.. ఈ ఉగ్రవాద సంస్థలకు పాక్ సైన్యం, ఐఎస్ఐ నుంచి నిధులు, ట్రైనింగ్, రాజకీయ మద్దతు ఉంటుంది కాబట్టి.. కొత్త శిబిరాల ఏర్పాటుకు ఎంతోకాలం పట్టదనే అభిప్రాయాలున్నాయి. పాక్ నుంచి మద్దతు ఉన్నంత వరకు.. ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను పునరుద్ధరిస్తూనే ఉంటాయ్. అందువల్ల.. టెర్రరిస్ట్ క్యాంపులని ధ్వంసం చేయడం వల్ల.. ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్ర దాడులు తాత్కాలికంగా తగ్గొచ్చు గానీ, దీర్ఘకాలంలో ఉగ్రవాదం అంతమవ్వాలంటే మరిన్ని సమగ్ర చర్యలు అవసరమనే వాదనలున్నాయి.
పూర్తిగా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని ప్రజల డిమాండ్
అందువల్ల.. పాక్ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని తుంచిపడేసి.. పూర్తిగా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలనే డిమాండ్లు.. భారత ప్రజలందరి నుంచి వినిపిస్తున్నాయి. ఉగ్రవాదం అనే పదాన్ని తలచుకోవాలంటేనే.. ఉగ్ర సంస్థలకు తడిసిపోయేలా కఠినచర్యలు చేపట్టాలంటున్నారు. టెర్రరిజం క్యాంపు పెట్టాలనే ఆలోచన వస్తే.. ఇండియా కచ్చితంగా దాడి చేస్తుందనే భయాన్ని.. వాళ్ల గుండెల్లో పెట్టాలంటున్నారు. ప్రతిసారీ.. భారత దళాలు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడం, కొన్నాళ్లకు.. ఉగ్రవాదులు వచ్చి మళ్లీ దాడులు చేయడం లాంటి సీన్లు.. ఇకపై రిపీట్ కావొద్దంటున్నారు. అందువల్ల.. ఏం చేసినా ఇప్పుడే చేసెయ్యాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు.. భారత్ ముందున్న అవకాశాలేంటి?
పాకిస్తాన్లో దశాబ్దాలుగా ఉగ్రవాదం వేళ్లూనుకుపోయింది. ఇప్పుడు దానిని కూకటివేళ్లతో సహా పెకిలించాలంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ని భారత్ తన ఆధీనంలోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అసలు.. పీవోకే.. ఇండియా కంట్రోల్లోకి రావాలనే చర్చ ఎందుకు జరుగుతోంది? అదే గనక జరిగితే.. పాక్లో టెర్రరిజం సమూలంగా నాశనమవుతుందా? ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు.. భారత్ ముందున్న అవకాశాలేంటి?
ఆపరేషన్ సిందూర్తో వీక్ అయిన పాక్
కశ్మీర్లో అశాంతి సృష్టించేందుకు.. పహల్గామ్లో పాక్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు.. పాక్కు కౌంటర్గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ని కూడా గ్లోబ్ మొత్తం గమనిస్తోంది. 9 ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడి చేశాక.. పాక్ వీక్ అయింది. పైగా.. ప్రపంచ దేశాల మద్దతు కూడా మనకే ఉంది. ఉగ్రవాదం విషయంలో దేశంలో ప్రభుత్వం కూడా ధృడంగా ఉంది. వీటన్నింటికి మించి భారత ప్రజల సపోర్ట్ బలంగా ఉంది. సరిహద్దుల్లో భారత దళాలు మాత్రమే కాదు.. ఇండియా మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. ఉగ్రవాదుల్ని ఏరిపారేయ్యాలి.. ఉగ్రవాదాన్ని గోతి తీసి పాతెయ్యాలనే మూడ్లో ఉంది దేశం మొత్తం. అందువల్ల.. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇంతకంటే మంచి టైమ్ లేదనే చర్చ సాగుతోంది. కొడితే.. ఇప్పుడే బలంగా కొట్టేయాలంటున్నారు. ఈసారి కొడితే.. టెర్రరిజం మళ్లీ లేవకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి.
పీవోకేని భారత్ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలనే డిమాండ్లు
ఎలాగూ.. ఆపరేషన్ సిందూర్తో ఉగ్ర స్థావరాలపై స్ట్రైక్స్ జరిగాయి. పాక్లోని డిఫెన్స్ సిస్టమ్స్పైనా.. మన ఆర్మీ దాడులు చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎలాగూ ఉన్నాయి. ఉగ్రవాదాన్ని నాశనం చేసేందుకు ఇదే మంచి సమయం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందువల్ల.. ఇప్పుడే పాక్ ఆక్రమిత కశ్మీర్ని.. భారత్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఎందుకంటే.. ఉగ్రవాద శిబిరాలన్నీ పీవోకే నుంచే ఆపరేట్ చేస్తోంది పాక్. ఉగ్రవాద కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే నడుస్తున్నాయి.
ట్రైనింగ్ ఇచ్చి.. ఉగ్రదాడులకు తెగబడతారు.
అందుకే.. పీవోకేని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే తప్ప.. టెర్రరిజానికి ఎండ్ కార్డ్ వేయలేమనే చర్చ జరుగుతోంది. అలా చేయకుండా.. ఇలా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసుకుంటూ వెళితే.. కొన్నాళ్లకు మళ్లీ మొదలుపెడతారు. రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ట్రైనింగ్ ఇచ్చి.. ఉగ్రదాడులకు తెగబడతారు. ఇది.. పదే పదే జరగొద్దంటే.. శాశ్వత పరిష్కారం కావాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాక్, ఐఎస్ఐ నిధులతో ఉగ్ర సంస్థల శిబిరాల నిర్మాణం
ఉగ్ర స్థావరాలను ఎన్నిసార్లు ధ్వంసం చేసినా.. పాక్ ప్రభుత్వం, ఐఎస్ఐ ఇచ్చే నిధులతో ఉగ్ర సంస్థలు మళ్లీ తమ శిబిరాలను నిర్మించుకుంటున్నాయి. వాళ్లు కొత్తగా టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టాలంటే.. మళ్లీ పీవోకేలోనే పెట్టాలి. అందువల్ల.. పీవోకే మన కంట్రోల్లోకి వచ్చేస్తే.. పాక్ ఉగ్రవాదులు దాదాపుగా ఖతమైనట్లే. పీవోకే మన ఆధీనంలోకి తెచ్చుకొని.. అక్కడున్న మిగతా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలి. అప్పుడు.. టెర్రరిస్టులకు మరో ఆప్షన్ లేక.. పాకిస్తాన్ భూభాగంలోనే పెట్టుకోవాల్సి వస్తుంది. అలా జరిగితే.. అంతర్జాకీయంగా పాక్కు ఇబ్బందులు తప్పవు. అంతేకాదు.. ఉగ్రవాదుల క్యాంపులు ఎక్కడున్నా.. వెంటనే ధ్వంసం చేస్తుండాలి.
ఉగ్రవాదంపై భారత్ పోరుకు ప్రపంచ దేశాల మద్దతు
మళ్లీ టెర్రరిస్టులు వచ్చి దాడులు చేసే దాకా వెయిట్ చేయొద్దనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఎక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ యాక్టివ్గా ఉందని తెలిసినా.. వెంటనే ఎటాక్ చేసెయ్యాలి. ఉగ్రవాద శిబిరం ఎక్కడ పెట్టినా.. ఇండియా ఎటాక్ చేస్తుందనే భయం పుట్టాలి. అప్పుడు మాత్రమే.. టెర్రరిజాన్ని అంతం చేయగలం. ఉగ్రవాద సంస్థల అధినేతలకు కూడా భయం మొదలవుతుంది. ఉగ్రవాదంపై భారత్ చేసే పోరుకు.. ప్రపంచ దేశాల మద్దతు కూడా ఉంటుంది. పాక్ కూడా చేసేదేమీ ఉండదు. అందుకోసమే.. ఏం చేసినా.. ఇప్పుడే చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆపరేషనే సిందూర్ లాంటి ఆపరేషన్లు కొనసాగాలి
నిరంతరం.. ఆపరేషన్ సిందూర్ లాంటి సైనిక ఆపరేషన్లు కొనసాగుతూ ఉంటే.. టెర్రరిస్టుల్లో భయం ఉంటుంది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతూ ఉంటే.. టెర్రరిజం వీక్ అవుతుంది. రా, ఇంటలిజెన్స్ బ్యూరో సహా సైనిక విభాగాల సామర్థ్యాన్ని పెంచి.. ఉగ్రవాద సంస్థల కదలికలపై నిఘా పెట్టాలి. రియల్ టైమ్ ఇంటలిజెన్స్ని మెరుగుపరిచి.. ఎప్పటికప్పుడు ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తుండాలి. పాక్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందనే విషయాన్ని.. అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయాలి. ఆర్థిక సంస్థలు, ఇతర దేశాల ద్వారా పాక్కు ఆర్థికసాయం అందకుండా కట్టడి చేయాలి.
రుణాలు, పెట్టుబడులు రాకుండా పాక్ ఆర్ధిక వ్యవస్థపై ఒత్తిడి
ప్రపంచ వేదికపై పాక్ని ఒంటరిగా మార్చాలి. ఉగ్రవాద సంస్థలకు వెళ్లే నిధుల్ని అడ్డుకోవాలి. పాకిస్తాన్కు అంతర్జాతీయ రుణాలు, పెట్టుబడులు రాకుండా.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాలి. వీటన్నింటి కంటే ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుగా పాక్ ఆక్రమణలో కశ్మీర్ని.. భారత్ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే డిమాండ్ భారత ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇదొక్కటి జరిగితే.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం దాదాపుగా అంతమైపోతుందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది.