Palamuru Project: పాలమూరు గుమ్మంలో కృష్ణమ్మ పారుతున్నా.. ఆ జిల్లా ప్రజల గొంతులు ఎండుతున్నాయి. ఆ ప్రజల కన్నీళ్లను తుడిచే జీవధార.. తండాల దాహం తీర్చే ప్రాణధార.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ఎప్పటి నుంచో అడుగుతుంది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న కేంద్రం.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్పై నీళ్లు చల్లింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రసక్తే లేదని.. అసలు ఆ డీపీఆర్నే తిరస్కరించి వెనక్కి పంపేశామని రాజ్యసభ సాక్షిగా తేటతెల్లం చేసింది కేంద్రం. ఒకవైపు AIBP రూల్స్ ప్రకారమే నిర్ణయం ఉంటుందని చెప్తూనే.. అసలు జాతీయ హోదా పరిశీలనే లేదనడంపై తెలంగాణలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా..?
పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే.. కృష్ణా జలాల వివాదం, అంతర్రాష్ట్ర జలవివాదాలు కొలిక్కి రావాలంటోంది కేంద్రం. ఇవన్నీ ఇప్పుడు కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 పరిధిలో న్యాయ విచారణలో ఉన్నాయి. ఈ వివాదాలు తేలకుండా టెక్నో-ఎకనామిక్ అప్రైజల్ కూడా సాధ్యం కాదని కేంద్రం కొర్రీలు పెట్టింది. అంటే.. ప్రాజెక్ట్ పనులు ఒకవైపు.. జలాల లెక్కలు మరోవైపు.. ట్రైబ్యునల్ తీర్పు ఇంకోవైపు. ఇవే పాలమూరు ప్రాజెక్ట్కు అతిపెద్ద అడ్డంకిగా మారాయి. లేదంటే కేంద్రం తాత్సారం వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా? కృష్ణా జలాల పంచాయితీ తెగేదెప్పుడు..? పాలమూరు ప్రాజెక్టుకు నిధులు వచ్చేదెప్పుడు?