RBI Recovery Rules: బ్యాంకులు ఆర్థిక సంస్థల రికవరీ ఏజెంట్ల దౌర్జన్యాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెక్ పెట్టింది. దీనికోసం మార్గదర్శకాలను రూపొందించింది. 2027,జనవరి నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ప్రస్తుత రోజుల్లో టూ వీలర్ కొనాలన్నా.. సొంతింటి కలను నిజం చేసుకోవాలన్నా.. వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా బ్యాంక్ రుణం తప్పనిసరై పోయింది. కొందరు ప్రైవేట్ బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇక, ఆన్ లైన్ లో అప్పులు ఇచ్చే యాప్ లు కూడా పదుల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. మినిమం పేపర్ వర్క్ అంటూ బ్యాంకులు.. ప్రైవేట్ ఆర్థిక సంస్థలు ఆఫర్లు ఇస్తుంటే..యాప్ లు నో పేపర్ వర్క్.. జస్ట్ సిబిల్ స్కోర్ బాగుంటే చాలని చెబుతూ అప్పులు ఇస్తున్నాయి. దాంతో అవసరం తీరితే చాలనుకుంటూ జనాలు రుణాలు తీసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరిస్థితుల కారణంగానో..వ్యాపారాలు ఆశించినట్టు నడవక పోవటం వల్లనో చాలామంది నెలవారీ వాయిదాల (ఈఎంఐ)ను సరిగ్గా చెల్లించలేక పోతున్నారు. ఓ నాలుగైదు నెలలు ఇలా గడిచిపోతే అప్పు ఇచ్చిన సంస్థలు ఆ బాకీపై కూడా వడ్డీ విధిస్తున్నాయి. దాంతో చెల్లించాల్సిన మొత్తం చూస్తుండగానే కొండలా పెరిగి పోతోంది.
సరిగ్గా అప్పుడే రికవరీ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు.సాధారణంగా జాతీయ బ్యాంకులు రుణ వసూళ్ల కోసం ఆర్బీఐ నిబంధనల ప్రకారం రికవరీ ఏజెన్సీలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేసుకుంటాయి. ఏజెంట్లు లేదా ఏజెన్సీల పూర్వాపరాలను పరిశీలించి నేర చరిత్ర లేనివారిని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) నుంచి సర్టిఫైడ్ శిక్షణ పొందిన వారిని మాత్రమే బ్యాంకులు తమ తరఫున నియమించుకోవడానికి అనుమతిస్తాయి. ఏజెన్సీలు చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉన్నాయా? లేదా? అన్నది చూస్తాయి. పాన్ కార్డ్, సాంకేతిక మౌలిక వసతులు కలిగి ఉండటం తప్పనిసరి. ఏజెన్సీలపై ఎలాంటి క్రిమినల్ కేసులు, పోలీస్ ఫిర్యాదులు, కోర్టు కేసులు ఉండకూడదు. బ్యాంకులు, సీబీఐ బ్లాక్ చేసిన సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయవు. ఇక, జాతీయ బ్యాంకుల ఏజెంట్లుగా పని చేస్తున్నవారికి ఇచ్చే కమీషన్ 0.5శాతం నుంచి మొదలవుతుంది. మరీ మొండి బకాయిలను వసూలు చేస్తే 5 నుంచి 10శాతం వరకు ఇస్తారు. ఈ క్రమంలో జాతీయ బ్యాంకుల ఏజెంట్లు దౌర్జన్యంగా వ్యవహరించటం అరుదుగా కనిపిస్తుంది.
Also Read: ఆస్తులతోపాటు దానధర్మాలు కూడా.. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలివే!
అయితే, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రికవరీ ఏజెంట్లు అరాచకంగా ఉంటుంది. ఫోన్లు చేసి బూతులు తిట్టటం.. రాత్రి వేళల్లో..తెల్లవారగానే ఇండ్లకు రావటం.. గొడవలు పెట్టుకోవటం.. నలుగురిలో పరువు తియ్యటం చేస్తున్నారు. టూ వీలర్.. కారు కొంటే ఈఎంఐ కట్టలేదని చెప్పకుండానే తమ దగ్గర పెట్టుకున్న తాళంచెవులతో తీసుకెళ్లి పోతున్నారు. కొన్నిసార్లు పని చేస్తున్న చోటుకు కూడా వెళుతూ హంగామా సృష్టిస్తున్నారు. దీనిపై ఓ జాతీయ బ్యాంకులోని సీనియర్ ఆఫీసర్ తో మాట్లాడగా ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రికవరీ ఏజెంట్లకు ఎక్కువ కమీషన్ ఇస్తాయన్నారు. పైగా, నేరచరిత్ర ఉన్నవారిని సైతం నియమించుకుంటారని చెప్పారు. అందుకే దురుసుగా వ్యవహారిస్తారని తెలిపారు.
వీరి సంగతి ఇలా ఉంటే ఆన్ లైన్ లో లోన్లు ఇస్తున్న యాప్ సంస్థల్లో పని చేస్తున్నవారు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ యాప్ ల నిర్వాహకులు రుణం ఇచ్చేముందే తీసుకుంటున్నవారి మొబైల్ ఫోన్లలోని కాంటాక్ట్ లిస్ట్, వాట్సాప్ యాక్సెస్ తీసుకుంటున్నారు. రెండు వాయిదాలు కట్టకపోయినా కాంటాక్ట్ లిస్ట్ లోని నెంబర్లకు ఫోన్లు చేసి చెబుతూ పరువు తీస్తున్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్ చేస్తున్నారు. ఈ కారణంగా పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే డిజిటల్ రుణ యాప్ల వేధింపులు, రికవరీ ఏజెంట్ల అరాచకాలను అడ్డుకోవటానికి ఆర్బీఐ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. రుణగ్రహీతల హక్కులను కాపాడటంతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో సరికొత్త రుణ వసూళ్ల మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే ఏడాది అంటే 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్ ప్రకారం రుణగ్రహీతలతో ఆర్థిక సంస్థలు వ్యవహరించే తీరులో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం రికవరీ ఏజెంట్లు ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల మధ్య మాత్రమే రుణం తీసుకున్న వ్యక్తులను సంప్రదించాలి.
Also Read: ఏడాది వ్యాలిడిటీ నుండి ఇంటర్నేషనల్ రోమింగ్ వరకు.. Airtel బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ లిస్ట్!
రుణగ్రహీత స్వయంగా కోరితే తప్ప, ఈ సమయాన్ని ఉల్లంఘించే అధికారం ఏజెంట్లకు లేదు. బెదిరింపులకు పాల్పడటం, అసభ్య పదజాలం వాడటం, కొత్త నంబర్ల నుంచి ఫోన్లు చేసి భయపెట్టడం చెయ్యొద్దు. రుణగ్రహీత కుటుంబంలో మరణం సంభవించినా, వైద్య అత్యవసర పరిస్థితుల్లో, వివాహాల వంటి వేడుకలు ఉన్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టకూడదు. రుణగ్రహీత ప్రతిష్టకు భంగం కలిగించేలా, వారి కుటుంబ సభ్యులను భయపెట్టేలా వ్యవహరించడం నిషిద్ధం. రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చే ముందు కనీసం ఒక రోజు ముందే రుణగ్రహీతకు సమాచారం అందించాలి. ఏజెంట్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు, బ్యాంకు ఇచ్చే అధీకృత పత్రం, సంబంధిత నోటీసును కలిగి ఉండాలి. ఈ పత్రంలో బ్యాంకు గ్రీవెన్స్ అధికారి వివరాలు ఉండాలి. ఎక్కడ కలవాలో ఎంచుకునే హక్కు రుణగ్రహీతకు ఉంటుంది. చెప్పిన ప్రదేశానికి వారు రాకపోతేనే ఇల్లు లేదా కార్యాలయానికి వెళ్లాలి.
సామాజిక మాధ్యమాల్లో రుణగ్రహీతల ఫోటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్లు పెట్టి వారిని బహిరంగంగా అవమానించడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. రుణగ్రహీత వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయితే దానికి పూర్తి బాధ్యత బ్యాంకులే వహించాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ కొనుగోలుకు తీసుకున్న రుణ వాయిదాలు చెల్లించకపోతే మాత్రమే ఆ పరికరాన్ని రిమోట్గా స్తంభింపజేసే హక్కు ఉంటుంది. సాధారణ వ్యక్తిగత రుణాల అంశంలో లాక్ చేయకూడదు. ఈఎంఐ ఆలస్యమైతే బాకీ పడిన 30 రోజుల తర్వాతే పాక్షిక నియంత్రణలు విధించాలి. 60 రోజులు దాటితేనే పూర్తిస్థాయిలో లాక్ చేయాలి. ఫోన్ లాక్ చేసినా ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, అత్యవసర సేవలు పనిచేస్తూనే ఉండాలి.
గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు) ఉపాధికి అవసరమైన యాప్లు అందుబాటులో ఉండాలి. బాకీ చెల్లించిన గంట లోపు లాక్ ను తొలగించాలి. ఆలస్యమైతే ప్రతి గంటకు 250రూపాయల చొప్పున బ్యాంకులు రుణగ్రహీతకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వసూళ్ల ప్రక్రియను వేరే ఏజెన్సీలకు ఇచ్చినా ఉల్లంఘనలు జరిగితే బ్యాంకులదే పూర్తి బాధ్యత. ప్రతి రికవరీ కాల్ను రికార్డు చేయడంతో పాటు ఆ ఫోన్ నంబర్, మాట్లాడిన సమయాలను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి. రికవరీ ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. ఏజెంట్లకు ఇచ్చే ఇన్సెంటివ్లు, ప్రోత్సాహకాలు రుణగ్రహీతలను వేధించేలా ఉండకూడదు. ఈ నిబంధనలు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ లతోపాటు ఆర్బీఐ పర్యవేక్షణలో ఉన్న ఆర్థిక సంస్థలన్నింటికీ వర్తిస్తాయి.
Also Read: తెలంగాణ బీజేపీకి నితిన్ నబీన్ వార్నింగ్.. అలా చేస్తే మీ పోస్టు ఉస్టే..!