BJP Unity: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు, సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకు ఇకపై తావివ్వకూడదని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు, వారి అనుచరులు సోషల్ మీడియాలో చేసే పోస్టులకు సంబంధిత నేతలదే బాధ్యత అని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. వ్యక్తిగత విమర్శలు, బహిరంగ ఆరోపణలతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించవద్దని రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలిసింది. గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వర్గాల మధ్య చోటుచేసుకున్న ఫ్లెక్సీ వివాదాలు, సోషల్ మీడియా వేదికగా జరిగిన విమర్శలను పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
ఇలాంటి ఘటనల వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో లీడర్లు సంయమనం పాటించాలని నితిన్ నబీన్ సూచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒక లీడర్ మరో లీడర్ పై అనుచరులపై విమర్శలు చేసినట్లయితే ఆ ప్రభావం అలాగే ఉంటుందని, తద్వారా సోషల్ మీడియాలో విమర్శలు జరుగుతున్నట్లు హైకమాండ్ గ్రహించినట్లు తెలిసింది. అందుకే అనుచరులు, సన్నిహితుల వద్ద ఎలాంటి ప్రస్తావన తీసుకురావద్దని స్పష్టంచేసినట్లు సమాచారం. నాయకుల అనుచరులు పెట్టే పోస్టులు కూడా ఆయా నేతల ఖాతాలోనే పడతాయని, కాబట్టి కార్యకర్తలు, అనుచరుల వ్యవహారశైలిపై నేతలు నియంత్రణ కలిగి ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.
Also Read: కొత్త పింఛన్లపై రేవంత్ సర్కార్ కోతలు.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే పింఛన్లు బంద్!
తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నితిన్ నబీన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతినెలా ఒక జాతీయ స్థాయి నేత తెలంగాణకు వచ్చి పార్టీ కార్యక్రమాలను సమీక్షించనున్నట్లు ఆయన వెల్లడించినట్లు సమాచారం. అదే విధంగా ప్రతి నెల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్రమబద్ధమైన కార్యాచరణ రూపొందించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు సమాచారం. ప్రతి మూడు నెలలకు ఒక ప్రధాన ప్రజా సమస్యను ఎంచుకుని, దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం ద్వారా పార్టీకి క్షేత్రస్థాయిలో బలం పెంచాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పార్టీ నేతలు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ కు పాల్పడినా ఉపేక్షించేది లేదని నితిన్ నబీన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో లోపాయికారీ అవగాహనకు రావడం, పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించాలని నేతలకు సూచించినట్లు తెలిసింది. తెలంగాణ విషయంలో జాతీయ నాయకత్వం అత్యంత సీరియస్గా ఉందని నితిన్ నబీన్ స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి సమష్టిగా పనిచేయాలని, నాయకులు పరస్పర విమర్శలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, నేతల మధ్య సమన్వయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బిగ్ అడ్వెంచర్ బైక్.. లాంచ్ కు ముందే హిమాలయన్ 750 లీక్!