TDP Telangana: తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీతో పాటు, ఏపీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. నారా లోకేష్ పార్టీలో ప్రమోషన్ పొంది జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఏపీలో కొత్తగా పలువురికి పార్టీ పదవులు లభించాయి. ఈ నేపధ్యంలో తెలంగాణలో టీడీపీ పరిస్ధితేంటి అనే చర్చ మళ్లీ స్టార్ట్ అయింది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మనుగడ.. తెలంగాణలో మాత్రం ప్రశ్నార్ధకంగా మారిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ నడుస్తోంది. ఏదో తెలంగాణ నుంచి నామ్ కే వాస్తేగా ఇద్దరు ముగ్గురికి పార్టీ కమిటీల్లో అధిష్టానం స్థానం కల్పించింది. మరి ముందు నుంచి పార్టీ వెంట నడుస్తున్న కేడర్ పరిస్థితి ఏంటన్నది అంతుపట్టకుండా తయారైంది.
తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గంలో ఇంతకాలం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. 2029 ఎన్నికల లక్ష్యంగా సామాజిక వర్గాల సమతుల్యత పాటిస్తూ 29 మందితో పొలిట్బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాసరావు తిరిగి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రకటించిన కార్యవర్గంలో కేవలం ముగ్గురు తెలంగాణ నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. ఇటీవల జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లోను పోటీ చేయలేదు. దీంతో పార్టీ నేతలు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్ధితి. ఇలాంటి తరుణంలోనే టీడీపీ జాతీయ కమిటీతో పాటు.. ఏపీ కమిటీని కూడా ప్రకటించింది. కాని తెలంగాణ టీడీపీ కమిటీ జోలికి రాలేదు. దీంతో మరోసారి తెలంగాణలో టీడీపీ పరిస్ధితేంటనేది చర్చనీయంశంగా మారింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీతో పాటు ఏపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కమిటీని విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ టీడీపీ కమిటీలో స్థానం దక్కించుకున్న నేతలు సంతోషంలో ఉంటే.. తెలంగాణకు సంబంధించిన నేతల మాత్రం తమ పరిస్థితేంటని ఆవేదన చెందుతున్నారంట. తెలంగాణకు సంబంధించి కమిటీని ప్రకటించకపోవడంతో నేతలు అసంతృప్తికి లోనవుతున్నారట. 2023 ఎన్నికల సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఙానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. రాష్ట్ర కమిటీ భర్తీ చేయాలని తెలంగాణకు చెందిన నేతలు, కార్యకర్తలు అధిష్టానాన్ని ఎంతలా కోరుతున్నా, అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఈ దిశగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. దీనిపై టీటీడీపీ కార్యకర్తలు అసంతృప్తి చెందుతున్నారట.
Also Read: సొంత జిల్లాలో సీన్ రివర్స్.. బోత్సకు పీడకలగా మారిన కిమిడి నాగార్జున..?
తాజా కమిటీల ప్రకటన సందర్భంగా తెలంగాణ విషయమై అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్ర కమిటీ నియామకం జరిగే అవకాశం లేదని అంటున్నారు. చాలా కాలం నుంచి రాష్ట్ర కమిటీ కోసం డిమాండ్ వినిపిస్తున్నా, అధిష్టానం ఆ దిశగా ఎలాంటి కసరత్తు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ కేడర్ తమ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని నిట్టూరుస్తున్నారట. తెలంగాణలో పార్టీ విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ అధినాయకత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, విపక్షమైన బీఆర్ఎస్ పార్టీలు టీ టీడీపీ కేడర్ మద్దతు కోసం వెంపర్లాడుతున్న పరిస్థితుల్లో, సొంత పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
టీడీపీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయినా కేడర్ మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉందని గతంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ అధిష్టానం, ఎన్నికల తర్వాత పార్టీని పటిష్ట పరిచే కార్యక్రమాన్ని వదిలేసిందని అంటున్నారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో టీడీపీ కేడర్ సొంతంగా పోరాడి అక్కడక్కడ విజయాలు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ ను పలుమార్లు కలిసిన టీటీడీపీ నేతలు తమ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించాలని విన్నవిస్తున్నా, హైకమాండ్ మాత్రం ఎందుకనో వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన కార్యవర్గంలో కేవలం ముగ్గురు తెలంగాణ నేతలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నర్సింహులును పొలిట్ బ్యూరోలోకి తీసుకోగా, నన్నూరి నర్సిరెడ్డిని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. మరి ఇంతకాలం పార్టీ జెండా పట్టుకుని నడుస్తున్న కేడర్ పరిస్ధితేంటన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది.
Also read: AC Mistakes: ఇంట్లో ఏసీ ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే ఏ క్షణమైనా..!