Kakinada Politics: పార్టీ అధినేత ఆదేశాలు ఒకవైపు.. క్షేత్రస్థాయిలో నేతల తీరు మరోవైపు. వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు గీసిన లక్షణరేఖను కొందరు నేతలు దాటేస్తున్నారు. కాకినాడ జిల్లా చీడిగలో శెట్టిబలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం వేదికగా ఒక అరుదైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు పాలిక శ్రీను నిర్వహించిన ఈ వేడుకలో ఏకంగా మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులు పాల్గొని ఒకే వేదికను పంచుకోవడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
వైసీపీ నేతలతో ఒకే ఫ్రేమ్లో మంత్రి సుభాష్
మొన్న విజయవాడలో బోండా ఉమ ఉదంతం చల్లారకముందే.. ఇప్పుడు మంత్రి సుభాష్ సైతం వైసీపీ నేతలతో ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో టీడీపీ నేతలు షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై టీడీపీ ఆఫీస్కు కంప్లైంట్ వెళ్లింది. కుల సంక్షేమం, సామాజిక వర్గ కార్యక్రమాల సాకుతో ప్రత్యర్థి పార్టీలతో వేదికలు పంచుకోవడం తప్పుకాకపోవచ్చు. పార్టీ అధినేత గీసిన లైన్ను దాటడమే పెద్ద చర్చగా మారింది. మరి అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేస్తుందా.. లేదంటే క్లాస్ పీకి క్రమణశిక్షణ చర్యలు తీసుకుంటుందా?