Act Commission: స్వేచ్ఛ బ్యూరో: ఇటీవల రిటైర్డ్ అయిన ఓ గ్రూప్ 1 మహిళా ఆఫీసర్ కు మళ్లీ కొత్త పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. వికలాంగులు, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఆమె..తాజాగా కొత్త పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పవర్ కుర్చీ కోసం తనదైన శైలీలో ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఆ శాఖకు చెందిన మంత్రి కూడా సహకరిస్తున్నారనే చర్చ ఉన్నది. యాక్ట్ కమిషన్ ను ఏర్పాటు చేసి, కమిషనర్ గా ఆమెకు బాధ్యతలు ఇచ్చేందుకు ఫైల్ రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆ రిటైర్ట్ మహిళా గ్రూప్ 1 ఆఫీసర్ నిత్యం సెక్రటేరియట్ లో తిరుగుతూ మంత్రి ఛాంబర్ చుట్టూ తిరుగుతున్నారు.
వికలాంగుల శాఖలో పెద్ద ఎత్తున చర్చ..
సెలక్ట్ కమిటీ అప్రూవల్ లేకుండానే ఆమె ను ఎంపిక చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు వికలాంగుల శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మినిస్టర్ సపోర్టుతోనే ఆ ఫైల్ మూవ్ అవుతున్నట్లు స్వయంగా ఆ శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. వాస్తవానికి గతంలో వికలాంగుల శాఖలో యాక్ట్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీంతో నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు 7–8 నెలల క్రిందట సుమారు 20 అప్లికేషన్లు వచ్చాయి. రూల్ ప్రకారం వచ్చిన అప్లికేషన్లను స్కూట్నీ చేసి సెలక్ట్ కమిటీలో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సెలక్ట్ కమిటీకి చైర్మన్ గా మంత్రి, మెంబర్లుగా ఆ శాఖ డైరెక్టర్, సెక్రటరీ ఉంటారు. కానీ ఈ కమిటీలో వచ్చిన అప్లికేషన్లపై ఎలాంటి డిస్కషన్ జరగలేదని తెలిసింది. అంతేగాక ఆ నోటిఫికేషన్ ను కూడా రద్దు చేసినట్లు సమాచారం.
ఎందుకు అంత ప్రాధాన్యత..?
గతంలోని నోటిఫికేషన్ రద్దు చేయడం, ఇప్పుడు సెలక్షన్ కమిటీలో చర్చ లేకుండా ఆమె పేరును ఫైనల్ చేసేలా ఫైల్ మూవ్ చేయడం వంటి అంశాలపై సెక్రటేరియట్ లో విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా 2018 లో రూల్స్ ఫ్రేమింగ్ లోనూ ఆమె డైరెక్టర్ గా కొనసాగుతూ అనుకూలంగా తయారు చేసుకున్నారనే చర్చ కూడా ఉన్నది. ప్రీ ప్లాన్డ్ గా ఆమె ఆ పోస్టు కోసం ముందగానే స్కేచ్ వేసి సాధించుకునేందుకు అన్ని రకాల రూట్లలో లైన్ క్లీయర్ చేసుకున్నారనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతుంది. వాస్తవానికి ఈ యాక్ట్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నిబంధనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. చత్తీస్ ఘడ్,కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సెంట్రల్ రూల్స్ ప్రకారమే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కానీ సెలక్ట్ కమిటీలో ఎంపిక లేకుండానే ఆమె పేరును ఫైనల్ చేశారనే లీకులతో సచివాలయంలోని ఉద్యోగులంతా అవాక్కవుతున్నారు.
మంత్రి పదవికే ఎసరు..?
సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఈ యాక్ట్ కమిషన్ ఏర్పడాలంటే అసెంబ్లీ, మండలిలో చర్చ జరగడంతో పాటు బిల్లు పాస్ కావాల్సి ఉన్నదని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కమిషన్ ఏర్పాటుపై అసెంబ్లీ, లా సెక్రటరీలు కూడా రూల్స్, ఏర్పాటు విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. కానీ సంబంధిత శాఖ మంత్రి అధిక చొరవ తీసుకొని ఆ పోస్టును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పార్లమెంటరీ సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఈ కమిషన్ ఏర్పాటు కాకపోతే, మంత్రి పదవిని కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఓ అధికారి చెప్పారు. ఆమె డైరెక్టర్ గా ఉన్నంత కాలం యాక్ట్ కమిషన్ ను ఏర్పాటు చేయకుండా, రిటైర్మెంట్ పొందగానే స్పీడ్ గా భర్తీ చేసేందుకు జరుగుతున్న ప్రాసెస్ను చూసి సంబంధిత శాఖ పేషీ స్టాఫ్ కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ విమర్శలు ఊపందుకున్నాయి.
Also Read: గులాబీ నేతలకు ఏమైంది?.. పట్నం వదలట్లేరు, పల్లెకు రావట్లేరు!