Power Services: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ‘ప్రజాబాట-బస్తీ బాట’ కార్యక్రమాన్ని మళ్లీ అమలు చేయనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సేవల లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం, గురువారం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా వినియోగదారుల ఇళ్లను సందర్శించనున్నారు. విద్యుత్ సరఫరా, మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు తదితర అంశాలపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, సాధ్యమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. తక్షణ పరిష్కారం సాధ్యం కాని సమస్యలను నమోదు చేసి, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు.
విద్యుత్ అంతరాయాలను తగ్గించడం, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడం, క్షేత్రస్థాయిలో లోపాలను గుర్తించి సకాలంలో చర్యలు చేపట్టడం ద్వారా నాణ్యమైన విద్యుత్ సేవలను అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ద్వారా సేవలపై విశ్వాసం మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ‘ప్రజాబాట-బస్తీ బాట’ను ఈనెల 6వ తేదీ నుంచే అమలుచేయనున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ప్రతి మంగళ, గురువారాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా టీజీఎస్పీడీసీఎల్ అధికారులు వినియోగదారుల వద్దకే వెళ్లి విద్యుత్ సంబంధిత సమస్యలను తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
Also Read: దమ్ముంటే ఆడియోలు బయట పెట్టండి.. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజల వద్దకే పాలన’కు అనుగుణంగా, విద్యుత్ వినియోగదారులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబాట-బస్తీ బాట కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది నేరుగా బస్తీలు, కాలనీలు, గ్రామాలు, తండాలు, పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రతి వినియోగదారుడిని కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేలా సీఎండీ జితేశ్ పాటిల్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, ఫీల్డ్ స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే ప్రక్రియకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రజాబాట-బస్తీ బాట కార్యక్రమాల్లో భాగంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే పనులను విస్తృతంగా చేపట్టనున్నారు. ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, యార్డుల పరిశుభ్రత, వోల్టేజ్ సమస్యల పరిష్కారం, వదులుగా ఉన్న విద్యుత్ తీగల బిగింపు, ఇంటర్ పోల్స్ ఏర్పాటు, దెబ్బతిన్న లేదా తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాల మార్పిడి, దెబ్బతిన్న కండక్టర్ల గుర్తింపు, మార్పిడి వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదేవిధంగా వరదలకు గురయ్యే ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల ప్లింత్ల ఎత్తు పెంపు, పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ, మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.కొత్త విద్యుత్ కనెక్షన్లు, అదనపు లోడ్, పేరు మార్పు, కేటగిరీ మార్పు, బిల్లింగ్ సమస్యలు, సీఎస్సీలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు, ఇతర వినియోగదారుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత ఇంజినీర్లు నేరుగా పర్యవేక్షించి, పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణ రూపొందిస్తారు.
Also Read: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై పోక్సో కేసు నమోదు!
విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజాబాట-బస్తీ బాటలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గృహాల్లో సరైన ఎర్తింగ్ ఏర్పాటు, విద్యుత్ను సురక్షితంగా వినియోగించడం, విద్యుత్ పొదుపు, ఇంధన సామర్థ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వ్యవసాయ వినియోగదారులకు వర్షాల సమయంలో మోటార్ స్టార్టర్లను తప్పనిసరిగా ఆఫ్ చేయడం, విద్యుత్ లైన్లు, స్తంభాల సమీపంలో పశువులను కట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం, విద్యుత్ ప్రమాదాల నివారణకు పాటించాల్సిన సూచనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రజాబాట-బస్తీ బాటలో నిర్వహిస్తారు. ప్రజాబాట-బస్తీ బాట కార్యక్రమాల ద్వారా విద్యుత్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు, పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన సేవలందింపునకు మరింత బలం చేకూరుతుందని ఎస్పీడీసీఎల్ అధికారులు భావిస్తున్నారు.
ప్రజల సమస్యలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా అవినీతికి తావులేకుండా, ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా అందించే వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. సంస్థకు వినియోగదారుడే కేంద్రబిందువు. ప్రజలు మా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా విద్యుత్ శాఖే వారి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజాబాట-బస్తీ బాట కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తున్నాం. ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, వేగంగా పరిష్కరించడం ద్వారా నాణ్యమైన, విశ్వసనీయమైన, నిరంతర విద్యుత్ సేవలను అందించడం మా లక్ష్యం. గ్రామం నుంచి నగరం వరకు ప్రతి వినియోగదారుడికి విద్యుత్ సేవలు మరింత చేరువ కావాలి. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్రమంగా ప్రజాబాట-బస్తీ బాట నిలుస్తుంది.
Also Read: యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!