Vijay Mallya: ఒకప్పటి లిక్కర్ బారన్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా మళ్లీ సీన్ లోకి వస్తున్నాడు. 2016లో భారత్ ను వీడిన తర్వాత మళ్లీ ఇక్కడికి రాలేదు. తొమ్మిదేళ్ల నిశ్శబ్దాన్ని ఇటీవలే మాల్యా బ్రేక్ చేశాడు. తాను దొంగను కాదు.. తాను పారిపోలేదన్నాడు. అప్పు 6 వేల కోట్లైతే 14 వేల కోట్లు వసూర్ చేశారంటున్నాడు. కానీ ఈ కొత్త స్టోరీలో నిజం ఎంత? బ్యాంకులు ఏమంటున్నాయి? చలో 14 వేల కోట్ల సీక్రెట్ ఏంటో డీకోడ్ చేద్దాం.
విజయ్ మాల్యా..
ఈ పేరు వినగానే.. లగ్జరీ లైఫ్
మోడ్రన్ లుక్, ఫ్యాషన్ స్టైల్స్..
ఇలాంటివన్నీ గుర్తొస్తాయి..
ఒకప్పటి లిక్కర్ కింగ్ లెక్కలు తేల్చేశాడా?
ఇంతే కాదు వీటికి మించి లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, మోడల్స్ తో క్యాలెండర్ ఎన్నెన్నో.. ఒకప్పుడు భారత్ లో వ్యాపారాల పేరుతో చక్రాలు తిప్పి బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని, ఆ తర్వాత చేతులెత్తేసి, బ్యాంకుల్ని ముంచేసి దేశం దాటి వెళ్లిపోయిన స్టోరీ అందరికీ తెలిసిందే. ఎయిర్ లైన్స్ బిజినెస్ అంటే మోడల్స్ తో కింగ్ ఫిషర్ క్యాలెండర్ ప్రింట్ చేసినంత ఈజీ అనుకున్నాడు. విమానాలు కొని ఎయిర్ హోస్టస్ లతో ఫోటోలు దిగినంత సులువనుకున్నాడు. కానీ అవేవీ కాదు. వాస్తవం మరోలా ఉంటుంది. బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకుని వ్యాపారం సరిగా చేయకపోతే ఏం జరుగుతుందో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జీవితమే ఉదాహరణ. ఇప్పుడు మాల్యా ప్రస్తావన ఎందుకంటే.. ఇటీవలే 4 గంటల సుదీర్ఘ పాడ్ కాస్ట్ లో తాను చెప్పాలనుకున్నవన్నీ చెప్పుకున్నాడు. తనను బ్యాంకులు అతిగా బాదేశాయని వాపోయాడు. అప్పు, వడ్డీ అంతా చెల్లించినా ఇంకా దొంగ అంటున్నారన్నాడు.
రూ. 6,200 కోట్ల అప్పులకు రూ.14వేల కోట్లు చెల్లించాడా?
మాల్యా తన గతం, రుణ వివాదం, బ్యాంకులతో జరిగిన సెటిల్మెంట్ ప్రయత్నాలు, భారత్కు తిరిగి రాకపోవడానికి కారణాలను ఆ ఇంటర్వ్యూలో వివరించాడు. కానీ, ఈ మాటల్లో నిజమెంత? బ్యాంకులు ఏమంటున్నాయన్నదే ఇప్పుడు కీలకంగా మారాయి. మాల్యా నిజంగా 6,200 కోట్ల అప్పులకు 14వేల కోట్లు చెల్లించాడా? ఒకవేళ అది నిజమైతే ఆయన ఇంకా లండన్లోనే ఎందుకు ఉంటున్నాడు? ఇలాంటి ప్రశ్నలెన్నో వస్తూనే ఉంటాయి. ముందుగా పాడ్ కాస్ట్ లో విజయ్ మాల్యా ఏమేం చెప్పాడో చూద్దాం. మాల్యా తనను చోర్ అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాను పారిపోలేదని, ముందస్తు ప్రణాళికలో భాగంగానే 2016లో తాను భారత్ నుంచి విదేశాలకు వెళ్లానన్నారు. కొన్ని కారణాల వల్ల తిరిగి రాలేకపోయానని, మధ్యలో ఈ దొంగతనం అనే విషయం ఎక్కడి నుంచి వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నాడు మాల్యా. అంతే కాదు భారత్ విడిచి వెళ్లే ముందు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తన ప్రయాణం గురించి సమాచారం ఇచ్చానని కూడా అంటున్నాడు.
మొత్తం రుణం 11.5% వడ్డీతో రూ. 6,203 కోట్లు
ఇక అసలు మ్యాటర్ రుణాల గురించి మాల్యా ఏమన్నాడో చూద్దాం. తన కంపెనీలైన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్, కింగ్ఫిషర్ ఫిన్ వెస్ట్ తీసుకున్న రుణం 6,203 కోట్ల రూపాయలే అని, అది కూడా 11.5% వడ్డీతో కలిపి అంటున్నాడు. అయితే బ్యాంకులు మాత్రం 14,131 కోట్ల రూపాయలు రికవరీ చేశాయన్నాడు. ఇందులో ఇంకో ట్విస్టు. తాను రుణం తీసుకోలేదు, తన కంపెనీ తీసుకుందంటున్నాడు. తాను గ్యారెంటర్ మాత్రమే అని వాదిస్తున్న పరిస్థితి.
బ్యాంకులకు సెటిల్మెంట్ ఆఫర్స్ ఇచ్చానన్న మాల్యా
అంతే కాదు.. బ్యాంకు రుణాలు తీర్చే విషయంలో 2012 నుంచి 2015 మధ్య తాను నాలుగు సార్లు సెటిల్మెంట్ ఆఫర్స్ ఇచ్చానని, అయితే బ్యాంకులు వాటిని తిరస్కరించాయన్నాడు. అంతే కాదు.. తనకు న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవనం హామీ ఇస్తే భారత్కు తిరిగి రావడం గురించి ఆలోచిస్తానంటున్నాడు మాల్యా. భారత్ లో జైళ్లు ముఖ్యంగా తిహార్ లాంటివి చాలా డేంజర్ అని యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 3కి విరుద్ధంగా భారత్ లోని జైళ్లు ఉన్నాయని, ఓ కేసులో UK కోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చెబుతూ అక్కడే కాలం గడుపుతున్నాడు.
బ్యాంకుల సపోర్ట్ ఉంటుందని ప్రణబ్ చెప్పారన్న మాల్యా
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ గురించి కూడా ఓ కీలక విషయం చెప్పాడు మాల్యా. ఎయిర్ లైన్స్ పునర్నిర్మాణ ప్రణాళికతో తాను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించి.. తాను సమస్యల్లో ఉన్నట్లు ఆయనకు చెప్పానన్నాడు. ఆర్థిక మాంద్యంలో బిజినెస్ కష్టంగా ఉందని, అందుకోసం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విమానాల సంఖ్యను తగ్గించాలని, ఉద్యోగులను తొలగించాలనుకున్న విషయాన్ని ప్రణబ్ కు చెప్పానన్నారు. అయితే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవద్దని, బ్యాంకుల నుంచి సపోర్ట్ ఉంటుందని ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారన్నాడు. కింగ్ ఫిషర్ ఉద్యోగులకు తాజాగా క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ తర్వాత దేశం వీడాల్సి వచ్చిందన్నాడు. మరి పాడ్ కాస్ట్ లో విజయ్ మాల్యా చెప్పినవన్నీ నిజాలేనా?
లండన్లో లగ్జరీ జీవితం, భారత్లో జైలు భయం..
లండన్లో లగ్జరీ జీవితం, భారత్లో జైలు భయం.. మాల్యా రిటర్న్ ఇక కష్టమేనా? అంటే అవునన్న సమాధానమే వస్తుంది. ఎందుకంటే బ్యాంకులకు చెల్లించాల్సించి ఇచ్చేసినా.. ఇంకా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈడీ, సీబీఐ, మనీలాండరింగ్, చీటింగ్.. ఇలాంటివెన్నో రెడీగా ఉన్నాయి. వీటిలో విచారణ ఎదుర్కోవాల్సిందే. అయితే ఇన్నాళ్లూ లగ్జరీ లైఫ్ అనుభవించిన మాల్యా.. ఇక్కడి జైలు జీవితాన్ని అస్సలు ఇష్టపడడం లేదు. భారత్ లోని జైళ్లు బాగాలేవని చెప్పి యూకే కోర్టులను కూడా ఒప్పిస్తూ అక్కడే ఉంటున్నాడు.
మాల్యాపై 17 బ్యాంకుల కన్సార్షియం కేసు
మాల్యా పాడ్ కాస్ట్ లో చెప్పిన విషయాల్లో వాస్తవాలేంటో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకులు మాల్యాపై మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు చేశాయి. కేసులు నమోదయ్యాయి. మాల్యా దేశం దాటి వెళ్లిపోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. మాల్యా ప్రకారం డెట్ రికవరీ ట్రిబ్యునల్ 6,203 కోట్ల రుణంగా నిర్ధారించగా బ్యాంకులు 14,131 కోట్లు రికవరీ చేశాయన్నారు. అయితే ఈ రికవరీలో ఎక్కువ భాగం మాల్యా ఆస్తుల అమ్మకం ద్వారానే వచ్చింది.
రూ. 14,131 కోట్ల రికవరీని ధ్రువీకరించన నిర్మల
బ్యాంకులు జప్తు చేసుకుని అమ్మేశాయి. ఇందులో యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆస్తులు కూడా ఉన్నాయి. అంతేగానీ.. మాల్యా తనంతట తాను వచ్చి ఆస్తులు రాసిచ్చి రుణాలు క్లియర్ చేయలేదు. అటు బ్యాంకులు 14,131 కోట్లు రికవరీ చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధృవీకరించారు. 2024 డిసెంబర్లో లోక్సభలో మాట్లాడారు. మాల్యా ఆస్తుల విక్రయం ద్వారా 14,131 కోట్లు బ్యాంకులకు ఈడీ ఆధ్వర్యంలో తిరిగి ఇచ్చినట్లు ధృవీకరించారు.
డిఫాల్టర్ అయితే ఏయే ఛార్జీలు చెల్లించాలో క్లారిటీ
6,203 కోట్ల రుణంలో ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీ, ఇతర ఛార్జీలు ఉన్నాయి. మాల్యా ఈ రికవరీని అతిగా వసూల్ చేశారని అన్నప్పటికీ.. రుణం ఇచ్చేటప్పుడే పేపర్లలో డిఫాల్టర్ అయితే ఏయే ఛార్జీలు చెల్లించాలో క్లియర్ గా ఉంటుంది. అందుకే బ్యాంకులు కూడా వడ్డీ, లీగల్ ఖర్చులు ఇవన్నీ ఉన్నాయన్నారు. అయితే బ్యాంకులు వసూలు చేసిన మొత్తాలకు సంబంధించి అకౌంట్ స్టేట్మెంట్లను అందించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో మాల్యా ఇటీవలే పిటిషన్ కూడా దాఖలు చేశాడు. మాల్యా చెప్పిన మరో విషయం ఏంటంటే.. తాను బ్యాంకులకు నాలుగు సెటిల్మెంట్ ఆఫర్స్ ఇచ్చినా తిరస్కరించాయన్నారు. అయితే ఆ ఆఫర్ లో మాల్యా ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే చెల్లించాలని ప్రతిపాదించాడుని, బ్యాంకులు వడ్డీతో సహా పూర్తి మొత్తం డిమాండ్ చేశాయన్న టాక్ బయటికొచ్చింది.
2020లో మాల్యా ఎక్స్ట్రాడిషన్కు UK ఆమోదం
కాబట్టి రుణాలు చెల్లించినా ఇంకా దేశానికి ఎందుకు రాకుండా ఉండిపోతున్నారన్న ప్రశ్నలున్నాయి. భారత జైళ్ల పరిస్థితులను గుర్తు చేస్తూ, యూరోపియన్ కోర్టు తీర్పును సాకుగా చూపుతున్నాడు. న్యాయమైన విచారణ హామీ ఇవ్వడం లేదని, తన పాస్పోర్ట్ రద్దు కావడం వల్ల తిరిగి రాలేనంటున్నాడు మాల్యా. నిజానికి UK కోర్టు 2020లో మాల్యా ఎక్స్ట్రాడిషన్ను ఆమోదించింది. కానీ కథ మారుస్తూ అక్కడే ఉండిపోతున్నాడు. అయితే బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించినా ఈడీ, సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సెబీ.. ఇలాంటి సంస్థలన్నీ మాల్యాపై మోసం, క్రిమినల్ కుట్ర, మనీలాండరింగ్, రుణంగా తీసుకున్న నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలు మోపాయి. వాటి విచారణలు కొనసాగుతాయి. మాల్యా వస్తే ఇంకా ఇరుక్కుపోవడం ఖాయమే. అందుకే రాకుండా లండన్ లోనే ఉండిపోతున్నాడు.
మాల్యాపై గతేడాది జులైలో సెబీ నిషేధం
పైగా మాల్యా నుంచి బ్యాంకులు రికవరీ చేసినట్లుగా చెబుతున్న మొత్తం.. ఆయన సొంతంగా ఇచ్చింది కాదు. ఇది అతని వ్యక్తిగత చెల్లింపు కాదు. బ్యాంకులు జప్తు చేసిన ఆస్తుల విక్రయం. సో మాల్యా తనంతట తానుగా 14,131 కోట్లు చెల్లించలేదన్నది వాస్తవం అంటున్నారు. మరోవైపు భారత్ లో విజయ్ మాల్యా ఒంటరి అయ్యారు. చాలా మంది రాజకీయ నేతలు, కార్పొరేట్లు ఆయన్ను పూర్తిగా దూరం పెట్టాయి. ఆర్థిక నేరస్తుడు అన్న ముద్రపడడంతో ఎవరూ మాల్యాను వెనకేసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఫ్రాన్స్లో 35 మిలియన్ యూరోలతో స్థిరాస్తి కొనుగోలు
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ గతేడాది జులైలో నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ లిస్టెడ్ కంపెనీ అయినా భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. మూడేళ్ల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందన్నది సెబీ. మాల్యా ఆస్తులు కొన్న దేశాలకు వెళ్లనివ్వకుండా చేయాలని భారత్ డిసైడైంది. ఇందులో భాగంగా నేరస్థుల అప్పగింత ఒప్పందాలున్న దేశాలతో చర్చలు జరుపుతోంది. మాల్యా వస్తే అప్పగించాలని ఫ్రాన్స్ కు గతేడాది విజ్ఞప్తి చేసింది భారత్. ఫ్రాన్స్లో 35 మిలియన్ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొన్నాడు. దీనికి తన ఆధీనంలోని కంపెనీ గిజ్మో హోల్డింగ్ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం 14 కోట్ల రూపాయల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసింది. ఈడీ అభ్యర్థనతో ఈ చర్యలు తీసుకుంది. ఇవే కాదు మాల్యాపై రకరకాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అవుతూనే వస్తున్నాయి.