Bhogapuram Airport: ఆంధ్రా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు శతాబ్దం పాటు విశాఖపట్నం ప్రయాణికులకు సేవలందించిన పాత విమానాశ్రయం సర్వీసులు నిలిచిపోగా, దాని స్థానంలో పెద్ద విమానాలను, ఎక్కువ మంది ప్రయాణికులను, అంతర్జాతీయ విమానాలను మెయింటెయిన్ చేసే కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది.
భోగపురం విమానాశ్రయం ప్రత్యేకతల్లో ముఖ్యమైనది అంతర్జాతీయ విమాన సర్వీసులతోనే కార్యకలాపాలు ప్రారంభించడం. అబుదాబి, సింగపూర్ నుంచి విమానాలు ఇక్కడికి వచ్చాయి. ఇండిగో, స్కూట్ లాంటి విమానయాన సంస్థలు తొలి అంతర్జాతీయ సర్వీసుల్లో భాగమయ్యాయి. మొదటి రోజే దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలతో కొత్త విమానాశ్రయం తన సామర్థ్యాన్ని చాటుకుంది. భవిష్యత్తులో విశాఖపట్నాన్ని మరిన్ని విదేశీ నగరాలతో అనుసంధానించనుంది.
భోగపురం విమానాశ్రయంలో 3,800 మీటర్ల పొడవైన కోడ్ 4E రన్ వే ఉంది. పెద్ద విమానాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో విమానాల సంఖ్య పెరిగినప్పుడు దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ రన్ వే కీలకంగా మారనుంది. ప్రారంభ దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో విమానాశ్రయాన్ని రూపొందించారు. దశలవారీగా విస్తరణ పూర్తయితే, ఏటా 4 కోట్లకు పైగా ప్రయాణికులను నిర్వహించే స్థాయికి చేరుకోనుంది.
భోగపురం విమానాశ్రయంలో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైడ్ 4.0 టెక్నాలజీ, ఎయిర్ పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ లాంటి వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్ లాంటి సదుపాయాలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో సాయపడుతున్నాయి. కేవలం పెద్ద టెర్మినల్ మాత్రమే కాకుండా, స్మార్ట్ ఎయిర్ పోర్ట్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూపొందింది.
భోగపురం విమానాశ్రయం లక్ష్యం కేవలం ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడం మాత్రమే కాదు. ఉత్తరాంధ్రలో పర్యాటకం, పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాలు, ఎయిర్ కార్గో రంగాలకు ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలకు కూడా మెరుగైన కనెక్టివిటీ అందే అవకాశం ఉంది.
భోగపురం విమానాశ్రయ నిర్మాణంలో స్థానిక సంస్కృతి, ప్రకృతికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. టెర్మినల్ పైకప్పు డిజైన్ లో ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ నిర్మాణాలు, అరకు లోయ ప్రకృతి దృశ్యాల నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. మొత్తం నిర్మాణం ఎగిరే చేపను తలపించేలా రూపొందించారు.
పాత విశాఖపట్నం విమానాశ్రయం 1929లో ప్రారంభమైన ప్రయాణంతో దాదాపు శతాబ్దపు చరిత్రను సొంతం చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనిక స్థావరంగా పనిచేసిన ఈ ప్రాంతం తర్వాత పౌర విమానయానానికి కీలక కేంద్రంగా మారింది. ఇప్పుడు అక్కడ సాధారణ వాణిజ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
Read Also: 2026లోనూ రైల్వే లైన్ లేని దక్షిణ భారత జిల్లాలు ఇవే.. కారణం తెలిస్తే షాక్!