కల్వకుంట్ల కవిత ఈడీ కేసులో అరెస్టై నెల రోజులైంది. ఇప్పటి వరకు భర్త అనిల్ కుమార్, అన్న కేటీఆర్ సహా అనేకమంది కుటుంబ సభ్యులు.. కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి అనేక విషయాలు మాట్లాడారు. కానీ అందులో కూడా కవిత పేరు ఎక్కడా వినిపించలేదు. ఇదే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది.. ఎందుకు? కేసీఆర్కు ఎందుకు కవిత పేరును కలవరించడం లేదు? తమ ఓటమికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక కారణమని కేసీఆర్ భావిస్తున్నారా? తనకు చెప్పకుండా లిక్కర్ దందా చేశారని ఆగ్రహమా? చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అన్న కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా? ఏంటీ రీజన్.. కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు.
ఒక్కసారి ఫ్లాష్బ్యాక్కు వెళితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న పంచాయితీ. కానీ అప్పుడు, ఇప్పుడు .. అంటే సీఎంగా ఉన్నప్పుడూ.. మాజీగా మారాక కూడా దీనిపై కేసీఆర్ స్పందించలేదు. ఎన్నికల సమయంలో దాదాపు బహిరంగసభలు నిర్వహించారు కేసీఆర్.. కానీ పల్లెత్తు మాట కూడా ఈ టాపిక్పై మాట్లాడలేదు. కనీసం బీజేపీ కక్ష పూరితంగా తన కూతురును కేసులో ఇరికించింది. అనే డైలాగ్ కూడా ఆయన నోటి నుంచి రాలేదు. నిజానికి ఈ అంశాన్ని తన పొలిటికల్ మైలేజ్కు వాడుకోవచ్చు.. కానీ అలా జరగలేదు. ఇప్పుడేమో ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో వేసింది ఈడీ.. ఇప్పుడు కనీసం ఢిల్లీకి వెళ్లి పరామర్శించలేదు.
Also Read: సీతమ్మకు బంగారు పట్టుచీర.. ప్రత్యేక ఆకర్షణగా సీతారాముల ప్రతిమలు
అయితే దీనికి గల కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కిల్స్లో అయితే ఓ ప్రచారం జోరుగా జరుగుతోంది. అసలు కవిత ఇలాంటి స్కామ్కు తెరలేపారన్న విషయం చాలా ఆలస్యంగా కేసీఆర్కు తెలిసిందన్న టాక్ వినిపిస్తోంది. సంతోష్రావు, కవిత డైరెక్షన్లోనే ఈ దందా కొనసాగినట్టు కథలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ కవితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. మన తెలుగువారు మాములుగానే మహిళలు వ్యాపారాలు చేయడాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అలాంటిది కవిత ఇలాంటి లిక్కర్ దందాలో దిగడాన్ని కేసీఆర్ అస్సలు ఊహించలేదని టాక్.. ఈ విషయాలను మేము ఈ విషయాలను కన్ఫామ్ చేయడం లేదు.. జస్ట్ జరుగుతున్న ప్రచారాన్ని మీ ముందు పెడుతున్నాం అంతే.. ఈ రీజన్ కారణంగానే కేసీఆర్ ఈ అంశంపై మౌనాన్ని ఆశ్రయిస్తున్నారా? అనేది ప్రశ్న.
ఇదే కాదు.. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా కేసీఆర్ ఈ టాపిక్ను తెరపైకి తీసుకురావడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న బీఆర్ఎస్ పార్టీని ప్రస్తుతం బతికించుకోవడంపైనే కేసీఆర్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఫోకస్ మొత్తం పార్లమెంట్ ఎన్నికలపైనే పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే కృష్ణా జలాలపై నల్లగొండలో నిర్వహించిన సభకు వెళ్లారు. కరీంనగర్లో వినోద్ కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల మీటింగులకు హాజరయ్యారు.
పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. చేవెళ్ల మీటింగ్కు కూడా హాజరయ్యారు. ఇన్నీ చేసిన ఆయన ఢిల్లీ వెళ్లే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఎన్నికల సమయంలో లిక్కర్ స్కామ్ కేసును ప్రస్తావిస్తే నెగెటివ్ అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారా? ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ను ప్రస్తావించి.. ఉన్న పరువు కూడా బజారుకు ఇడ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
Also Read: గ్రేటర్ ఆర్టీసీపై సమ్మర్ ఎఫెక్ట్.. సర్వీసులు కుదింపు
నాట్ ఓన్లీ కేసీఆర్.. కవిత అరెస్ట్పై బీఆర్ఎస్ మొత్తం సైలెంట్ మోడ్లోనే ఉంది. మార్చి 15న ఈడీ టీమ్ కవితను అరెస్ట్ చేసినప్పుడు హడావుడి చేసిన గులాబీ నేతలంతా ఇప్పుడు గప్చుప్ అయ్యారు. అరెస్టు అక్రమం, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? అంటూ ఈడీ ఆఫీసర్లతో అప్పట్లో వాదించిన అన్న కేటీఆర్.. అరెస్టు సమయంలో పరుగుపరుగున వచ్చిన మేనబావ హరీశ్ రావు కూడా ఇప్పుడు కవిత విషయంపై నోరు విప్పడం లేదు. కవిత ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన హరీశ్ రావు.
ఆ తర్వాత అటు మొఖం కూడా చూడలేదు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.
ఈడీ కావొచ్చు.. సీబీఐ కావొచ్చు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్పిన్ కవితే అంటున్నాయి. ఆధారాలు చూపిస్తున్నాయి. ఈ విషయాలను కోర్టు బలంగా నమ్ముతుంది కాబట్టే ఆమెకు బెయిల్ కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో కవిత అంశాన్ని సింపతి కోసం వాడుకుంటే.. అసలుకే మోసం వస్తుందన్న ఫీల్లో ఉన్నారు బీఆర్ఎస్ పెద్దలు కేసీఆరే పట్టించుకోనప్పుడు.. పార్టీ నేతలం మీమేంత? అనుకుంటున్నారు పార్టీలోని తర్వాతి క్లాస్ నేతలు.. సో.. ప్రస్తుతానికి కవిత, లిక్కర్ స్కామ్ అన్న పదాలను తన డిక్షనరి నుంచి కేసీఆర్ తొలగించినట్టు కనిపిస్తోంది.