YSRCP Party: ఓటమి తరువాత వైసీపీని తిరిగి యాక్టివ్ చేయడానికి, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలని జగన్ పిలుపుల మీద పిలుపులు ఇస్తున్నా.. కొందరు నేతల తీరు మారడం లేదు. జగన్ ఆదేశించినా కొందరు నేతలు ఇంకా సైలెంట్ గానే ఉంటుండటం వైసీపీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టేస్తుందంట. దాదాపు రెండేళ్లు గడుస్తున్నా కూడా నియోజకవర్గాల నుంచి బయటకు రావడానికి కొందరు నేతలు ఇంకా ఎందుకు భయపడుతున్నారు. ఇంచార్జుల మౌనం పై వైసీపీలో నడుస్తున్న చర్చ ఏంటి? దీనిపై వైసీసీ శ్రేణులు ఏమంటున్నాయి?
ఓటమి తరువాత వైసీపీలో మార్పులు చేర్పులు మొదలుపెట్టారు మాజీ సీఎం జగన్ రెడ్డి. అయితే తమ అభీష్టాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు తమకు సంబంధం లేని నియోజకవర్గాలకు పంపడంపై గుర్రుగా ఉన్నారు చాలామంది వైసీపీ నేతలు. ఓటమి తరువాత తమను తమ సొంత నియోజక వర్గాలకు పంపాలని జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు .ఒకవైపు ఓటమి, రెండో వైపు ఓడిన నేతల విజ్ఞప్తుల మేరకు వారిని సొంత నియోజకవర్గాలకు తిరిగి మళ్ళీ ఇంచార్జులుగా నియమించారు వైసిపి అధ్యక్షుడు. దాంతో అడప దడపా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొన్న కొందరు నేతలు వాటిని విజయవంతం చేయడంలో కీ రోల్ పోషించారు. ఇక అంతా సెట్ రైట్ అయిందనుకుంటున్న తరుణంగా తాజాగా ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిణామాలు, చోటు చేసుకున్న ఘటనల విషయంలో మాత్రం ఇటీవల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓటమి తర్వాత సొంత నియోజకవర్గాలకు తిరిగి పంపినా.. కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుపై వరుసగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక ,ఆర్థిక, రాజకీయ సమీకరణాల ప్రాతిపదికన సర్వేలు చేయించుకుని జగన్ అభ్యర్థులను నిర్ణయించి, వారిని సిట్టింగ్ స్థానాల నుంచి తొలగించి పక్క నియోజవర్గాల్లో పోటీ చేయించారు. ఘోర పరాజయం తర్వాత వారికి యధా విధిగా సొంత నియోజకవర్గాల పార్టీ బాధ్యతలు అప్పగించినా. .పలువురు నేతలు యాక్టివ్ అవ్వకుండా మౌనవ్రతం పాటిస్తున్నారంట. పేరుకే ఇంచార్జులుగా పెత్తనం చేస్తున్నారని నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలపై కనీసం నోరు మెదపడం లేదని వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల వార్డు, జిల్లా, గ్రామ, మండల కమిటీల నియామకం చేపట్టాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది.
Also Read: మణిపూర్లో మళ్లీ మొదలైన మారణహోమం.. బాంబు దాడిలో చిన్నారులు మృతి
పార్టీకి పునర్వైభవం తెచ్చేలా అడుగులు వేయాలి అంటే అందుకు తగ్గట్టుగానే స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని, అందుకు అవసరం అయితే కేంద్ర కార్యాలయం సహకారం సైతం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కొందరు నేతలు మాత్రం పార్టీ ఆదేశాలను పట్టించుకోవడం లేదంట. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని చెప్పినా, కొందరు నేతలు గడపదాటి అడుగు బయట పెట్టడం లేదట. దాంతో సీనియర్లుగా ఉన్నది దేనికి, సొంత నియోజకవర్గానికి పంపిస్తే తామేంటో చూపిస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని అటు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
అలా ఇంటి బయటకు అడుగు బయట పెట్టని నేతలు అంతా సాదా సీదా నేతలేం కారు. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రులుగా పదవులు అనుభవించిన వారే. విప్ లాగా బాధ్యతలు నిర్వహించిన వారే కావడంతో ఇప్పుడు నేతల వైఖరిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల అనేక అంశాలకు సంబంధించి పార్టీపై ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నా.. సైతం కొందరు నేతలు స్పందించిన పాపాన పోలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో కీలక నేతలుగా చెలామణి అయిన మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, వనిత, ఉషశ్రీ చరణ్, కారుమూరు నాగేశ్వరావు, ధర్మాన ప్రసాదరావు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగ నాగార్జున, కొడాలి నాని.. ఇలా చాలామంది సీనియర్లు కూటమి నేతల విమర్శలను లైట్ తీసుకుంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు నోరేసుకుని పడిపోతూ.. చెలరేగిన నేతలు ఓడిపోగానే ఎందుకు స్పందించడం లేదన్న చర్చ పార్టీలో నడుస్తోంది. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, దౌర్జనాలకు సంబంధించి కేసుల్లో ఇరుక్కుంటామన్న భయంతోనే వారంతా.. పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఓటమి తర్వాత జగన్ పార్టీ ప్రక్షాళన చర్యలు చేపట్టినప్పుడు, పదవులు అనుభవించిన వాళ్లు సొంత నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన ముందు ప్రగల్భాలు పలికి వచ్చారంట. తీరా ఇన్చార్జులుగా ప్రకటించాక సొంత వ్యవహరాలు చక్కపెట్టుకుంటూ.. కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారంటున్నారు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో అధికారంపై కలలు కంటున్న జగన్ వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Storey By: Appa Rao Big Tv
Also Read: కూటమిలో కాకరేపుతున్న జమ్మలమడుగు రాజకీయం.. ఆదినారాయణ రెడ్డి అసలు స్కెచ్ అదేనా..!