Income Tax Bill 2025| ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 13న కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు అమలులో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. పాత నిబంధనల్లో మార్పులు చేయడంతోపాటు, ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సరికొత్త మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అయితే, కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఎందుకు ప్రవేశపెట్టారో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (మార్చి 27) వివరించారు.
1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేసే ఈ బిల్లు.. ప్రభుత్వం లెక్కల్లో పన్ను ఎగవేతదారులు చూపని డబ్బు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. పాత చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే ఉంటూనే అనవసరమైన విభాగాలను తొలగించడం, భాషను సరళీకృతం చేయడం ఈ కొత్త చట్టం లక్ష్యం. అక్రమార్కులను పట్టుకోవటానికి మరిన్ని డిజిటల్ ఆధారాల అన్వేషణకు ఈ చట్టంతో మార్గం సుగమం కానుందని ఆమె పేర్కొన్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడంతోపాటు, అక్రమార్కులకు అడ్డుకట్టవేయనుందని ఆమె అన్నారు.
Also Read: లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్యాంకులు ఏం చేస్తాయి..ఫ్యామిలీ నుంచి రికవరీ చేస్తాయా..
కొత్త బిల్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో టాక్స్ అమలును అప్డేట్ చేయడంలో సహాయపడుతుందని, క్రిప్టోకరెన్సీల వంటి వర్చువల్ ఆస్తుల తనిఖీలో నిర్లక్ష్యం జరగకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ అన్నారు. డిజిటల్ ఖాతాల నుంచి లభించే ఆధారాలు.. కోర్టులో పన్ను ఎగవేతను నిరూపించడానికి, పన్ను ఎగవేత మొత్తాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఉపయోగపడతాయి. లెక్కల్లో చూపించని నల్లధనాన్ని వెలికితీయటానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషించిందని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
“మొబైల్ ఫోన్లలోని రహస్య మెసేజ్ల ద్వారా లెక్కల్లో లేని దాదాపు రూ.250 కోట్ల ధనం బయటపడింది. క్రిప్టో ఆస్తులకు సంబంధించిన వాట్సాప్ సందేశాల నుంచి ఆధారాలు కనుగొన్నాం. వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారా లెక్కల్లో లేని రూ.200 కోట్ల డబ్బు బయటపడింది” అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
ఒక కేసులో గూగుల్ మ్యాప్స్ హిస్టరీతో నగదు దాచడానికి తరచుగా సందర్శించే ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడిందని సీతారామన్ హైలైట్ చేశారు. ‘బినామీ’ ఆస్తులు నిర్ధారణ కోసం యజమాని ఇన్స్టాగ్రామ్ ఖాతాలను విశ్లేషించామని ఆమె తెలిపారు.
పన్ను విచారణ అధికారులు ఏయే ఖాతాలు యాక్సెస్ చేయవచ్చు?
అధికారులకు వాట్సాప్, ఫేస్ బుక్, టెలిగ్రామ్, ఈ మెయిల్స్ వంటి డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేసే హక్కును కొత్త బిల్లు కల్పిస్తుందని ఆర్థిక మంత్రి వివరించారు. అదనంగా, ఆర్థిక లావాదేవీలను దాచడానికి ఉపయోగించే వ్యాపార సాఫ్ట్వేర్, సర్వర్లను కూడా ప్రభుత్వం యాక్సెస్ చేయగలదు.
ఈ బిల్లు వెల్లడించని ఆదాయం విషయంలో, వర్చువల్ డిజిటల్ ఆస్తులను కవర్ చేస్తుంది. ఇందులో డిజిటల్ టోకెన్లు, క్రిప్టోకరెన్సీలు, క్రిప్టోగ్రాఫిక్ వంటివి ఉంటాయి.
ఇది శోధన, స్వాధీన కార్యకలాపాల సమయంలో వర్చువల్ డిజిటల్ స్థలాలను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను అధికారులకు అనుమతిని ఇస్తుంది. ఇమెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ పెట్టుబడి, ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లు, ఆస్తి యాజమాన్య వివరాలను నిల్వ చేసే వెబ్సైట్ల యాక్సెస్ ఈ చట్టం కవర్ చేస్తుంది. పన్ను దర్యాప్తులో భాగంగా డిజిటల్ ఖాతాల తనిఖీ కోసం యాక్సెస్ కోడ్లను ఓవర్రైడ్ చేసే అధికారం కూడా ఉంటుంది.