UPI Faster| భారతీయుల రోజువారీ జీవితాన్ని యుపిఐ టెక్నాలజీ ఒక్కసారిగా మార్చేసింది.లావదేవీల కోసం నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చిల్లర సమస్య అసలే ఉండదు. అంతా సులభతరం చేసింది ఈ టెక్నాలజీ. అందుకే యుపిఐని వినియోగించే వారి సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరగిపోతోంది. ఈ నేపథ్యంలో యుపిఐని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త నిబంధనలు తెస్తుంది. తాజాగా, NPCI ఒక కీలక ప్రకటన చేసింది. UPI సేవలు మరింత వేగవంతం, సమర్థవంతం కావాలని ఆదేశించింది. ఈ మార్పులను జూన్ 16 నాటికి అమలు చేయాలని NPCI.. అన్ని సభ్య సంస్థలకు సూచించింది.
NPCI జారీ చేసిన సర్కులర్ ప్రకారం.. యుపిఐలో తరచుగా ఉపయోగించే కొన్ని APIల (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) స్పందన సమయాన్ని తగ్గించారు. ఉదాహరణకు.. లావాదేవీ స్థితిని చెక్ చేసే (Check Transaction Status), లావాదేవీ రద్దు చేసే (Transaction Reversal) APIల స్పందన సమయం గతంలో 30 సెకన్లు ఉండగా.. ఇప్పుడు 10 సెకన్లకు తగ్గించారు. అలాగే, చిరునామా ధ్రువీకరణ (Validate Address) API స్పందన సమయం.. 15 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గింది. ఈ APIలు.. చెల్లింపు (Pay), సేకరణ (Collect) లావాదేవీలలో ఉపయోగపడతాయి.
ఈ మార్పులు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం.. వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల (PSPs)తో పాటు చెల్లింపు చేసే బ్యాంకులు (Remitter Banks), చెల్లింపు స్వీకరించే బ్యాంకుల (Beneficiary Banks)కు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ కొత్త స్పందన సమయాలతో UPI వినియోగదారులకు లావాదేవీలు మరింత సులభంగా, వేగంగా జరుగుతాయి. గతంలో విఫలమైన లావాదేవీలను రద్దు చేయడానికి లేదా చెల్లింపు స్థితిని తెలుసుకోవడానికి 30 సెకన్లు పట్టేది, ఇప్పుడు అది కేవలం 10 సెకన్లలో పూర్తవుతుంది.
ఈ మార్పుల వల్ల వినియోగదారుల అనుభవం మెరుగుపడుతుందని NPCI తెలిపింది. “సభ్య సంస్థలు తమ సిస్టమ్లలో అవసరమైన మార్పులు చేయాలి. భాగస్వాములు లేదా వ్యాపారుల వద్ద ఏవైనా సాంకేతిక మార్పులు అవసరమైతే, వాటిని కూడా సమన్వయం చేయాలి” అని NPCI సర్కులర్లో పేర్కొంది. ఈ మార్పులు UPI సేవలను మరింత నమ్మదగినవిగా, వేగవంతంగా చేస్తాయి.
ఈ కొత్త నిబంధనలతో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్లను ఉపయోగించే కోట్లాది మంది వినియోగదారులకు లావాదేవీలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. ఉదాహరణకు.. ఒక దుకాణంలో చెల్లింపు చేస్తున్నప్పుడు లేదా స్నేహితులకు డబ్బు పంపుతున్నప్పుడు, లావాదేవీ విజయవంతమైందా? లేదా? అని తెలుసుకోవడానికి ఇకపై ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మార్పులు డిజిటల్ పేమెంట్ల విశ్వసనీయతను మరింత పెంచుతాయి.
Also Read: ఈ యాప్లను వెంటనే ఫోన్ నుంచి తొలగించండి.. గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరిక
జూన్ 16 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనలు భారతదేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళతాయి. NPCI ఈ చర్యలతో భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది.