crime: స్నేహం అంటే వీరిద్దరిదే.. మరణంలో కూడా వీరిద్దరు ఒకటిగా ఉన్నారు. ఒడిశాకు చెందిన వీరిద్దరు చిరకాల మిత్రులు.. హైదరాబాద్లో ఉద్యోగం కోసం వచ్చి నివాసం ఉంటున్నారు. వారిద్దరూ ఐటీ ఉద్యోగం చేసుకుంటూ ఒకే అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే వారిద్దరూ ఆదివారం తెల్లవారుజామున ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందారు. ఈ విషాదకర ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని జైపుర్కు చెందిన భానుప్రకాశ్(36), అదే రాష్ట్రం రావుర్కెలాకు చెందిన నళినికంఠ బిశ్వాల్(37)లు కళాశాలలో చదివేటప్పటి నుంచి స్నేహితులు.
అయితే వివాహితులైనా విరిద్దరు రాజేంద్రనగర్ మంచిరేవులలోని యునైటెడ్ అమిగో అవెన్యూ అపార్ట్మెంట్లోని వేర్వేరు ఫ్లాట్లలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి 8 గంటలకు స్నేహితులిద్దరూ కారులో అపార్ట్ మెంట్ నుంచి బయటకు వెళ్లి.. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మేడ్చల్ నుంచి పటాన్ చెరు మీదుగా అవుటర్రింగ్ రోడ్డుపై ఇంటికి వెళుతుండగా.. వేగంగా వెళ్తున్న కారు మార్గం మధ్యలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టి విద్యుత్ స్తంభానికి తగిలి పక్కరోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఈ టార్చర్ నావల్ల కాదు.. అందుకే వెళ్లిపోతున్నా, యూపీలో టెక్కీ సూసైడ్
కారు ప్రమాదానికి గురైన వెంటనే బిశ్వాల్ ఐఫోన్ ద్వారా అతని భార్య సునైనా మెుబైల్కు సమాచారం చేరడంతో.. లోకేషన్ వివరాలు వెళ్లాయి. ఆమె ఆందోళన చెందుతూ అదే అపార్ట్మెంట్లో ఉంటున్న భానుప్రకాశ్ భార్య సాయిలక్ష్మికి విషయాన్ని తెలియజేశారు. వెంటనే వారు ఘటనాస్థాలనికి చేరుకున్నారు. కాగా వీరిలో భానుప్రకాశ్, సాయిలక్ష్మి దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఐఫోన్ వాడుతున్న వ్యక్తులు ఉంటే.. అది అత్యవసర నంబర్లకు సమాచారాన్ని చేరవేస్తుంది.