Bihar Crime News: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అమ్మాయి తరపు పేరెంట్స్ ససేమిరా అన్నారు. మనసిచ్చిన అమ్మాయి తట్టుకోలేకపోయింది. ప్రియుడు లేకుండా ఉండలేనని భావించింది. కోరుకున్న ప్రియుడితో పారిపోయింది. అక్కడి నుంచి సీన్ రివర్స్ అయ్యింది. తండ్రికి ఆగ్రహం కలిగేలా కూతురు చేయడంతో తట్టుకోలేకపోయాడు. చివరకు కూతుర్ని చంపేసి, బాత్రూంలో దాచాడు. సంచలనం రేపిన ఈ ఘటన బీహార్ లో వెలుగుచూసింది.
అనగనగా సాక్షి
బీహార్ సమస్తిపూర్లో పరువు హత్య జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో అడ్డంకులు చెప్పారు. చివరకు ప్రియుడితో కలిసి ఢిల్లీకి చెక్కేసింది. తిరిగొచ్చిన కూతుర్ని ఓ తండ్రి దారుణంగా చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కన్నీరు పెట్టాడు. మూడు రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అసలు గుట్టు బయటపడింది.
పోలీసుల వివరాల మేరకు.. రిటైర్ ఆర్మీ అధికారి ముకేష్కుమార్ సింగ్ సమస్తిపూర్ జిల్లాలో ఉంటున్నాడు. పదవీ విరమణ కావడంతో ఇంట్లో ఉంటున్నారు. ఆయనకు 20 ఏళ్ల కూతురు సాక్షి ఉంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. కాలేజీ నుంచి ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడు సాక్షి ఫ్యామిలీ ఉన్న ఏరియాలో ఉంటున్నారు.
కూతురు ప్రేమ విషయం తండ్రికి తెలిసింది. తమకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని, దాని ప్రకారం వెల్లడం మంచిదని కూతుర్ని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అందరం ఒంటరి వాళ్లం అవుతామని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే కూతురు మనసు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రియుడ్ని దూరం చేస్తున్నారని నెగిటివ్ ఆలోచన వచ్చింది.
ALSO READ: కూతుర్ని చంపి ఆపై ఉరేసుకున్న తల్లి
ఢిల్లీకి చెక్కేసింది, ఆపై రీల్స్
చివరకు ప్రియుడితో కలిసి మార్చి నాలుగు ఢిల్లీకి వెళ్లిపోయింది సాక్షి. అక్కడ రీల్స్ చేస్తూ సోషల్మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ విషయం నలుగురికి తెలిసింది. వాటిని చూసిన కన్నతండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. తన పరువు తీసిందని ఆవేదన చెందాడు. చేసేదేమీ లేక యువకుడి బంధువుని ఒప్పించి ఢిల్లీకి వెళ్లినవారిని వెనక్కి రప్పించాడు.
వారం కిందట తిరిగి ఇంటికి వచ్చింది సాక్షి. కూతురు తిరిగి రావడంతో లవ్ స్టోరీ సుఖాంతమైందని అంతా అనుకున్నారు. అసలు స్టోరీ అక్కడి నుంచే మొదలైంది. ఏప్రిల్ ఏడు నుంచి సాక్షి మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో సాక్షి తల్లి కంగారు పడింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందని భార్యని నమ్మించే ప్రయత్నం చేశాడు ముఖేష్ సింగ్. అయితే సాక్షి తల్లికి అనుమానం వచ్చింది.
చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించగా కంటతడి పెట్టి ఎమోషనల్ డ్రామా ఆడాడు. బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటకు పొక్కింది. లోపలికి వెళ్లి చూడగానే సాక్షి బాడీ కనిపించింది. షాకవ్వడం పోలీసుల వంతైంది. కన్న తల్లి కన్నీరు మున్నీరు అయ్యింది. చివరకు పోలీసుల ముందు నిజం అంగీకరించాడు మాజీ ఆర్మీ అధికారి.
జరిగినదంతా చెప్పి, కూతురిని తాను హత్య చేసినట్టు నిజాన్ని అంగీకరించాడు. సాక్షి ప్రియుడ్ని చంపేందుకు ఆయన ప్రయత్నించాడు. ఆ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.