Visaka Murder Case: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పెందుర్తి మండలం జుత్తాడ సామూహిక హత్యల కేసులో విశాఖపట్నం న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత పాశవికంగా నరికి చంపిన కేసులో నిందితుడైన బత్తిన అప్పలరాజును దోషిగా తేల్చిన కోర్టు, అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు.. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో బొమ్మిడి రమణ, ఉషారాణి, అల్లూరి రమాదేవి, నక్కెళ్ల అరుణ, బొమ్మిడి ఉదయ్, ఉర్విష ఘటనా స్థలిలోనే మృతి చెందారు. తర్వాత అప్పలరాజు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కోర్టుకు సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంతో నిందితుడికి మరణ శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడలో 2021 ఏప్రిల్ 15న బత్తిన అప్పలరాజు అదే గ్రామానికి చెందిన బమ్మిడి విజయ్కుమార్ కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత అప్పలరాజు డయల్ 100కు ఫోన్ చేసి, పోలీసులకు లొంగిపోయాడు. గ్రామానికి చెందిన బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య కొంతకాలంగా పాత వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన కక్ష పెంచుకున్న అప్పలరాజు, తెల్లవారుజామున కత్తితో బొమ్మిడి కుటుంబం నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రలో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన వారిని అడ్డువచ్చినట్టు దారుణంగా నరికేశాడు.
ఈ కిరాతక దాడిలో బొమ్మిడి రమణ, ఆయన భార్య ఉషారాణి, వారి బంధువులైన అల్లూరి రమాదేవి, నక్కెళ్ల అరుణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘాతుకంలో రెండేళ్ల బాలుడు బొమ్మిడి ఉదయ్, ఆరు నెలల పసికందు ఉర్విష కూడా బలయ్యారు. ఈ ఘటనతో జుత్తాడ గ్రామంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఆరుగురిని హత్య చేసిన తర్వాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
Also Read: 9 మంది అమ్మాయిలను 100 ముక్కలు చేసిన ట్విట్టర్ కిల్లర్కు ఉరిశిక్ష
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును ముమ్మరంగా చేపట్టారు. పక్కా ప్రణాళికతోనే ఈ హత్యలు జరిగినట్లు నిర్ధారించి, బలమైన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానానికి సమర్పించారు. విచారణలో అప్పలరాజు నేరం రుజువు కావడంతో, కోర్టు ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించి అతనికి మరణశిక్ష విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.