Gannavaram: కృష్ణాజిల్లా గన్నవరంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కొత్త బైపాస్ రోడ్డు బి.బి.గూడెం సమీపంలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని చీకట్లను నింపింది. వేగంగా వచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరొకరు రెండు చేతులు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
లారీలు, కారు ఢీ
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్లే నూతన జాతీయ రహదారి బైపాస్ పై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఒక కారును, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గూడ్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు పక్కనే ప్రయాణిస్తున్న మరో లారీ కిందకు దూసుకెళ్లింది. రెండు లారీల మధ్య కారు పూర్తిగా నలిగిపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కారులోని మరో వ్యక్తికి రెండు చేతులు తెగిపడి తీవ్ర రక్తస్రావమైంది.
స్కూటీని ముంచేసిన ఆయిల్ ట్యాంకర్
ఇదే సమయంలో సరిగ్గా అదే రోడ్డుపై పక్కనే స్కూటీపై వెళ్తున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ లారీ బలంగా ఢీకొట్టింది. లారీ చక్రాల కింద పడటంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ వరుస ప్రమాదాలతో జాతీయ రహదారి రక్తసిక్తమైంది.
Also Read: బీఆర్ఎస్ లో సర్వే కలకలం.. ఆ లీడర్ల లిస్ట్ రెడీ చేసిన కేటీఆర్.. వారికి నో టికెట్!
రంగంలోకి దిగిన పోలీసులు.. సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే గన్నవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో, క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు.