Blue Drum Murder: పంజాబ్లోని లుథియానాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక మోడల్ టౌన్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో నీలి రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీ బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో మృతదేహం సుమారు 10-15 రోజుల కిందటిదని, పూర్తిగా కుళ్లిపోయిందని తేలింది. మృతుడి మెడ, కాళ్లు వేరు చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారడంతో మృతుడిని గుర్తించడం కష్టంగా మారింది.
ఈ ఘటనతో లుథియానాలో ఇటీవల వెలుగు చూసిన ఇలాంటి నేరాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గతంలో కూడా నీలి రంగు డ్రమ్ములు లేదా ఇతర కంటైనర్లలో మృతదేహాలు లభ్యమైన కేసులు లుథియానాలో నమోదయ్యాయి. ఇది సీరియల్ కిల్లర్ పనా లేక ఏదైనా ముఠా పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సంఘటన కొంతకాలం క్రితం మీరట్లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసును గుర్తు చేస్తోంది. అక్కడ ఒక మహిళ లవర్తో కలిసి భర్తను చంపి మృత దేహాన్ని బ్లూ డ్రమ్లో దాచి పెట్టింది. ఈ కేసు కూడా ఇలాంటి కుట్రలో భాగమేనా అని లూథియానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు క్లూస్ టీమ్ను, ఫోరెన్సిక్ నిపుణులను సంఘటనా స్థలానికి పిలిపించారు. ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. చివరి సారిగా అదృశ్యమైన వారి వివరాల కోసం కూడా గాలిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ :
పోలీసుల దర్యాప్తులో ఆ డ్రమ్ కొత్త దని తేలింది. అయితే ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందనే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. నిందితులు డ్రమ్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు లూథియానాలోని 42 డ్రమ్ తయారీ కంపెనీలను ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో పాటు, డ్రమ్ను అక్కడికి ఎప్పుడు, ఎలా తీసుకువచ్చారో తెలుసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతంలోని సిసిటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు.
Also Read: స్టేజి డ్యాన్సర్తో యువకుడి పెళ్లి.. ఇష్టంలేని ఫ్యామిలీ, ప్లాన్ ప్రకారం
హత్య మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు:
ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. షేర్పూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాలలో వలసదారులు ఎక్కువగా ఉంటారని.. ఇలాంటి సంఘటనలు శాంతిభద్రతల గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గుర్తు తెలియని హంతకులపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఈ హత్య మిస్టరీని వీలైనంత త్వరగా ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీసులు ఈ కేసును ఛేదించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.