Murder news in hyderabad(Local news telangana): హైదరాబాద్ లోని బహదూర్ పురాలో దారుణ ఘటన వెలుగుచూసింది. బహదూర్ పురా పీఎస్ పరిధిలో ఖలీల్ అనే యువకుడిని అతని కన్నతండ్రి కళ్లెదుటే కత్తులతో పొడిచి హతమార్చారు. ఖలీల్ పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ హత్యతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖలీల్ బహదూర్ పురాలోని అసద్ బాబానగర్ లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం అర్థరాత్రి కొందరు యువకులు అతని ఇంట్లోకి వెళ్లి.. మాటల్లో పెట్టి బయటకు తీసుకొచ్చారు. మాట్లాడుతూనే తమవెంట తీసుకొచ్చిన కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఖలీల్ కేకలు విన్న తండ్రి బయటికి వచ్చే చూసేసరికి కత్తులతో దాడిచేస్తూ కనిపించారు. అడ్డుకోబోయిన తండ్రిని ఓ యువకుడు బెదిరించడంతో.. నిస్సహాయ స్థితిలో కొడుకు చనిపోతుంటే చూస్తూ ఉండిపోయాడు.
Also Read : వీడు మామూలోడు కాదు.. మిడ్ నైట్ ఏకంగా గంటలో ఆరు..!
ఎవరైనా వచ్చి కొడుకును రక్షించాలని వేడుకున్నా ఫలితం లేదు. వారికి భయపడి ఖలీల్ ను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కత్తిపోట్లతోనే ప్రాణాలు రక్షించుకునేందుకు ఖలీల్ పరుగులు పెట్టగా వెంటాడి మరీ హతమార్చారు. ఖలీల్ మృతదేహాన్ని బైక్ పైనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. సమీపంలోని సీసీటీవీలను పరిశీలించారు. తన కొడుకుపై కొందరు మూకుమ్మడి దాడి చేశారని ఖలీల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.