Mancherial: సొంత రక్తమే శత్రువైంది. కలిసి పెరిగిన తమ్ముడని కూడా చూడకుండా.. క్షణికావేశంలో ఒక అన్న చేసిన ఘాతుకం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసముద్రంలో నెట్టేసింది. భూమి కోసం పెంచుకున్న కక్షలు, చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకునే దాకా వెళ్లాయి. మంచిర్యాల జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివాదానికి కారణం ఇదే..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన చందు, అతని తమ్ముడు సందనవేణి రాజేష్ (28)ల మధ్య గత కొంతకాలంగా ఆస్తి, భూమి తగాదాలు నడుస్తున్నాయి. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఈ విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. అయినప్పటికీ అన్నదమ్ముల మధ్య ఉన్న వివాదం సద్దుమణగలేదు. లోలోపలే కక్షలు మరింత పెరిగాయి.
Also Read: నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!
గొడ్డలితో నరికి చంపి
ఈ నేపథ్యంలోనే, వివాదం కాస్తా మరోసారి ముదిరి పెద్ద గొడవకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన అన్న చందు, ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకువచ్చి తమ్ముడు రాజేష్పై ఒక్కసారిగా దాడి చేశాడు. మెడ, తల భాగాల్లో విచక్షణారహితంగా నరకడంతో, తీవ్ర రక్తస్రావమై రాజేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే తమ్ముడు రక్తపు మడుగులో పడిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
పోలీసుల ఎంట్రీ
సమాచారం అందుకున్న బెల్లంపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడైన అన్న చందు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భూమి కోసం తమ్ముడిని నరికి చంపిన ఈ ఘటన చంద్రవెల్లి గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
https://twitter.com/bigtvtelugu/status/2071194216483398075