Uncle Murder| సిన్సియర్గా లవ్ చేసుకునే ప్రేమికులు తమ ప్రేమకు అడ్డుగా ఎవరొచ్చినా సహించారు. అది కుటుంబ పెద్దలైనా, చివరికి సమాజమే అయినా. అందుకే ఓ యువకుడు సమాజాన్ని ఎదురించి తన ప్రేమను సాధించాలనుకున్నాడు. కానీ చివరకు హంతకుడయ్యాడు. అతని ప్రేమకు తోడుగా నిలబడిన మరో ఇద్దరు స్నేహితులు కూడా జైలు పాలయ్యారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ నగరానికి చెందిన ఆకాశ్ ప్రజాపతి అనే 19 ఏళ్ల కుర్రాడు కవిత (పేరు మార్చబడినది) అనే ఒక యువతిని ప్రేమించాడు. అయితే ఆకాశ్ ప్రజాపతి బాబాయ్ (తండ్రి తమ్ముడు) మహేంద్ర ప్రజాపతి (28)కి ఆరు నెలల క్రితం కవిత అక్కతో వివాహం జరిగింది. దీంతో కవిత ఇప్పుడు ఆకాశ్ ప్రజాపతికి పిన్ని వరుస. బాబాయ్ భార్యకు ఆమె చెల్లెలు. ఈ సంబంధం కారణంగా వారిద్దరి ప్రేమకు హిందూ సంప్రదాయాలు అడ్డంకిగా మారాయి.
అయితే యుక్త వయసు కదా.. ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. ఎవరేమన్నా తమ ప్రేమే తమకు గొప్పదని భావించారు. అందుకే తరుచూ దొంగచాటుగా కలుసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఒకరోజు వారిద్దరూ రహస్యంగా కలుసుకోవడం మహేంద్ర ప్రజాపతి (ఆకాశ్ బాబాయ్) కు తెలిసిపోయింది. దీంతో ఆయన తన అన్న కొడుకు ఆకాశ్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. వారిద్దరి ప్రేమ ఫలించదని.. మరోసారి కవితను కలిస్తే కుటుంబ సభ్యులతో కలిసి అతడిని చంపేస్తారని బెదరించాడు.
ఆకాశ్ తన బాబాయ్ తో కలిసి కార్పెంటర్ పని కూడా చేసేవాడు. ఆకాశ్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులు కూడా కలిసి పనిచేసేవారు. వారితో ఆకాశ్ తన బాధ చెప్పుకున్నాడు. తాను కవితను వదిలి ఉండలేనని చెప్పుకున్నాడు. అతని బాధ చూసి ఆకాశ్ ఇద్దరు స్నేహితులు అతడికి సాయం చేసేందుకు అంగీకరించారు.
Also Read: పెట్రోల్ పంప్ మేనేజర్ హత్య.. బాటిల్లో పెట్రోల్ పోయలేదని తుపాకీతో..
అందుకే తన ప్రేమను పొందేందుకు ఆకాశ్ ఒక ప్లాన్ వేశాడు. తరుచూ ఆకాశ్ తన బాబాయ్ మహేంద్ర ప్రజాపతితో కలిసి కార్పెంటర్ పనిచేసేందుకు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఒకరోజు ప్రయాగ్ రాజ్ పక్క జిల్లా కౌషంభిలో ఫర్నీచర్ చేసేందుకు వెళ్లాల్సి ఉంది. పని ఎక్కువగా ఉండడంతో మహేంద్రతో పాటు ఆకాశ్, అతని ఇద్దరు స్నేహతులు కూడా కలిసి వెళ్లారు.
అలా వెళ్లిన మహేంద్ర తిరిగి రాలేదు. మరుసటి రోజు పనిపూర్తి చేయకుండానే ఆకాశ్, అతని ఇద్దరు స్నేహితులు తిరిగి ఇంటికి వచ్చేశారు. మహేంద్ర దారిలో తప్పిపోయాడని.. ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని అందరితో ఆకాశ్ అతని స్నేహితులు బుకాయించారు. దీంతో మహేంద్ర భార్య, అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మహేంద్ర మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా ఆకాశ్ నే ప్రశ్నించారు. కానీ ఆకాశ్ పదే పదే మహేంద్ర దారిలో తప్పిపోయాడని చెప్పాడు. దీంతొ ప్రయాగ్ రాజ్ పోలీసులకు కౌషంభి పోలీసుల నుంచి సమాచారం అందింది. మహేంద్ర శవం లభించిందని.
మహేంద్ర శవం ఒక నిర్మానుష ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు కింద లభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మహేంద్ర తలపై బలంగా కొట్టినట్లు గాయాలున్నాయి. దీంతో పోలీసులు ఇది హత్య అని నిర్ధారించి.. ముందుగా ఆకాశ్, అతని ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంత వేధించినా ముందుగా ఆకాశ్ నోరు విప్పలేదు. కానీ అతని స్నేహితులలో ఒకరు నిజం చెప్పేశాడు. మహేంద్ర ప్రజాపతితో కలిసి తాము ముగ్గురం వెళ్లగా.. దారిలో మహేంద్ర మద్యం సేవించేందు ఆగాడాని ఆ సమయంలో మత్తులో ఉన్న మహేంద్ర తలపై ఒక ఇటుకతో ఆకాశ్ పలుమార్లు గట్టిగా కొట్టాడని చెబుతూ నిజం బయటపేట్టేశాడు.
దీంతో పోలీసులు ఆకాశ్, అతని ఇద్దరు స్నేహితులు ఇళ్లలో తనిఖీలు చేశారు. ఆకాశ్ ఇంట్లోనే అతను మహేంద్ర మొబైల్ ఫోన్ దాచి ఉంచాడు. అది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆకాశ్ వేసుకున్న చొక్కపై కూడా మహేంద్ర రక్తపు మరకలున్నాయి. ఆ తరువాత ఆకాశ్ కూడా తానే హత్య చేసినట్లు తన నేరం అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు మహేంద్ర ప్రజాపతి హత్య కేసు నమోదు చేసి ఆకాశ్ ని ప్రధాన నిందితుడిగా.. అతడి స్నేహితులు నేరంలో సహకరించినట్లు పేర్కొంటూ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ముగ్గురు నిందితులను రిమాండ్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది.