Cyber Crime: డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా, వాట్సాప్ లింకులు, నకిలీ ట్రేడింగ్ యాప్లు సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా, చదువుకున్నవారినీ, ఉద్యోగస్తులనూ, వృత్తి నిపుణులనూ వలలోకి దింపుతున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లాలోని పేరూరులో నివాసముంటున్న.. ఓ యోగా మాస్టర్ సైబర్ మోసగాళ్ల బారిన పడి ₹11,99,000 (సుమారు 12 లక్షలు) కోల్పోయాడు.
మోసం ఎలా జరిగిందంటే
ఆ బాధితుడు యోగా టీచర్గా పనిచేస్తూ, వాట్సాప్లో ఒక హేమాంగి డేట్ అనే వ్యక్తి నుండి లింక్ అందుకున్నాడు. ఆ లింక్ ఓ ట్రేడింగ్ యాప్కి దారి తీసింది. ఆ యాప్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేరుతో రూపొందించబడిన నకిలీ యాప్. నిజమైన యాప్లాగే డిజైన్ చేయబడి ఉండడంతో, ఇది ఫేక్ అని బాధితుడికి మొదట అర్థం కాలేదు.
ఆ యాప్లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. ప్రారంభంలో తక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయగా, లాభాలు చూపించారు. దీంతో విశ్వసించిన బాధితుడు క్రమంగా ₹11,99,000 వరకు పెట్టుబడి పెట్టాడు.
లాభాలు చూపించి వల వేసిన సైబర్ గ్యాంగ్
కొంతకాలం తరువాత లాభాలు వచ్చినట్లు స్క్రీన్లో చూపించారు. అయితే వాటిని విత్డ్రా చేసుకోవాలంటే 20% కమిషన్ ఫీజు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ స్థితిలోనే బాధితుడికి అనుమానం కలిగింది. వెంటనే ఆయన ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను సంప్రదించగా, ఆ యాప్ పూర్తిగా నకిలీ అని తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు
మోసపోయిన విషయం గ్రహించిన యోగా టీచర్ వెంటనే.. సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేసి, ఆ తర్వాత తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును క్రైమ్ నెంబర్ 488/2025గా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.
మోసగాళ్ల కొత్త పంథాలు
సైబర్ మోసగాళ్లు సాధారణంగా –
నకిలీ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ యాప్లు సృష్టిస్తారు.
వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా ఆకర్షణీయమైన లింకులు పంపుతారు.
మొదట చిన్న లాభాలు చూపించి నమ్మకం కలిగిస్తారు.
ఎక్కువ మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయించిన తర్వాత.. విత్డ్రా చేయడానికి అదనపు ఫీజులు అడుగుతారు.
చివరికి యాప్, వెబ్సైట్, కాంటాక్ట్ నంబర్లు అన్నీ డిసేబుల్ చేస్తారు.
ఈ తరహా పద్ధతుల ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మంది సైబర్ వలలో పడిపోయారు.
ప్రజలకు హెచ్చరిక
సైబర్ నిపుణులు, పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు .
అధికారిక యాప్ స్టోర్ (Play Store, App Store) ద్వారా మాత్రమే యాప్లు డౌన్లోడ్ చేయాలి.
వాట్సాప్, మెయిల్ ద్వారా వచ్చే లింకులు నమ్మకూడదు.
అజ్ఞాత వ్యక్తుల సూచనలతో పెట్టుబడులు పెట్టకూడదు.
లాభాల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అనుమానం పెట్టుకోవాలి.
మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి.
Also Read: శ్రీశైలం భక్తులకు అలర్ట్.. అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసోత్సవాల
పేరూరులో జరిగిన ఈ సంఘటన మరోసారి సైబర్ మోసాల తీవ్రతను గుర్తు చేస్తోంది. జాగ్రత్తగా లేకపోతే క్షణాల్లో జీవితాంతం కూడబెట్టిన పొదుపు మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంది. యోగా మాస్టర్పై జరిగిన ఈ మోసం ఇతరులకు ఒక పాఠంగా నిలిచి, డిజిటల్ యుగంలో అప్రమత్తత ఎంత అవసరమో చూపిస్తోంది.