TTD: తిరుమల భూలోక వైకుంఠంగా పిలవబడే ఈ పవిత్ర క్షేత్రం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. అర్చనలతో, సేవలతో లక్షలతో ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణం నిండిపోయే ఈ ఆలయంలో స్వామివారి దర్శనం పొందడం ప్రతి భక్తుడి జీవితంలో ఒక గొప్ప భాగ్యం. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తి, విశ్వాసాల, సంప్రదాయం ప్రకారం ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భాల్లో గ్రహణాలు ఒక ముఖ్యమైన ఆచార పరమైన అంశం. గ్రహణ సమయంలో ఆలయ తలుపులు మూయడం తిరుమలలోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో పాటించే సాంప్రదాయం.
తిరుమలలో దర్శనానికి తాత్కాలిక విరామం
ఇక రాబోయే సెప్టెంబర్ 7న జరగబోయే చంద్రగ్రహణం సందర్భంగా తిరుమలలో దర్శనానికి తాత్కాలిక విరామం కల్పించనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయబడతాయి. ఆ సమయం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం అందుబాటులో ఉండదు. ఈ మూసివేత రాత్రంతా కొనసాగి, సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయబడి ఉంటాయి.
Read also: Vinayaka chavithi songs : వినాయక చవితి వచ్చేస్తుంది, ఈ పాటలు పెట్టుకుని వైబ్ అవ్వండి మామ
గ్రహణం పూర్తయ్యిన తర్వాత తిరిగి ఆలయ తలుపులు సుప్రభాతంతో తెరవబడతాయి. ఆ వెంటనే ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు, పుణ్యహవాచనం నిర్వహిస్తారు. ఆలయ వాతావరణాన్ని పవిత్రం చేయడానికి ప్రత్యేక మంత్రోచ్ఛారణలు జరుగుతాయి. అనంతరం ఏకాంతంగా తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చనల వంటి ఆచారాలు పూర్తి చేస్తారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల తర్వాత మాత్రమే భక్తులకు దర్శనం ప్రారంభం అవుతుంది.
దాదాపు 14 గంటల పాటు స్వామి దర్శనం అందుబాటులో ఉండదు
సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటలకు తిరిగి శ్రీవారి దర్శనం ప్రారంభం కానుంది. అంటే దాదాపు 14 గంటల పాటు భక్తులకు స్వామి దర్శనం అందుబాటులో ఉండదు. ఈ సమయంలో ఆలయంలో జరగాల్సిన ఆర్జిత సేవలు కూడా రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇలా సంప్రదాయం ప్రకారం శాస్త్ర నియమాల ప్రకారం తిరుమలలో ఆలయ కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు కూడా ఈ ఆచారాల ప్రాముఖ్యతను గౌరవించి, దర్శన ప్రణాళికలు వేసుకునే సమయంలో ఈ విరామాన్ని గుర్తుంచుకోవాలి. శ్రీవారి కృప కోరుతూ భక్తులు ఆలయ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని టిటిడీ అధికారులు వెల్లడించారు.