Thandel: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘తండేల్’ గురించే చర్చలు జరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తెరకెక్కింది ఈ సినిమా. అందుకే దీని ప్రమోషన్స్ విషయంలో చైతూ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మూవీ టీమ్ అంతా కూడా ప్రమోషన్స్లోనే బిజీగా గడిపేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi), చందూ మోండేటి, అల్లు అరవింద్.. ఇలా అందరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ‘తండేల్’ నుండి తాను అలిగి తప్పుకోవాలి అనుకున్న సందర్భం గురించి బయటపెట్టాడు చందూ మోండేటి. ఆ తర్వాత అల్లు అరవిందే తనను స్వయంగా బ్రతిమిలాడి తీసుకొచ్చాడట.
తర్వాత తెలిసింది
‘తండేల్’ అనేది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని మేకర్స్ ముందు నుండే చెప్తున్నారు. అయితే అసలు ఈ సినిమా వదిలి వెళ్లిపోవాలి అనిపించే సందర్భంగా ఎందుకు వచ్చిందా అని చందు మోండేటి తాజాగా బయటపెట్టాడు. ‘‘మేము కలెక్ట్ చేసిన సమాచారం ప్రకారం సినిమాకు వేరే ఇంటర్వెల్ రాసుకున్నాం. ఆ తర్వాత మరోసారి మేమంతా కలిసి శ్రీకాకుళం వెళ్లాం. ఆ 22 మందిని. ఇంకొదరిని కూర్చోబెట్టి అడిగితే 2017లో వచ్చిన స్టార్మ్ విషయం బయటపడింది. ఆ స్టార్మ్ వల్ల వాళ్ల పడవలు ఎలా అయ్యాయి, అదే సమయంలో ఒక పెద్ద కార్గో షిప్ రావడాన్ని ఎలా ఫేస్ చేశారు.. ఇదంతా చెప్పారు’’ అని చెప్పుకొచ్చాడు చందు మోండేటి (Chandoo Mondeti).
మధ్యలో వెళ్లిపోయాను
‘‘వాళ్లు చెప్పిందంతా విన్నాం. కానీ అప్పటికే బడ్జెట్ ఫిక్స్ అయిపోయింది. మళ్లీ మెల్లగా పిల్లిలాగా అరవింద్ గారి దగ్గరికి వెళ్లాను. ఆయనతో చెప్పగానే అప్రూవ్ చేశారు. అప్పుడే మధ్యలో నేను అలిగి చేయను అని చెప్పేశాను. ఆ స్టార్మ్ సీక్వెన్స్ వద్దు మామూలుగా వెళ్లిపోదాం అన్నాను. ఇప్పుడు ఉన్న ఆడియన్స్కు ఇదంతా తెలియాలి, ఇది కావాలి అని చెప్పి ఆ స్టార్మ్ను ఆహ్వానించారు’’ అని బయటపెట్టాడు చందు మోండేటి. ఆ స్టార్మ్ సీక్వెన్స్ గురించి విన్న వెంటనే బన్నీ వాసు ఓకే చెప్పేసి బడ్జెట్ గురించి ఆలోచించొద్దు అని చెప్పినా, అల్లు అరవింద్ కూడా వెనకాడకుండా ఒప్పుకున్నా తనకే బడ్జెట్ విషయంలో బాధ అనిపించి అలిగానని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు.
Also Read: శేఖర్ మాస్టర్.. మళ్లీ ‘ఫిదా’ అవ్వాలా ఏంటి.? ‘తండేల్’ కొరియోగ్రాఫిపై ట్రోల్స్..
చాలా కష్టపడ్డాం
అసలైతే ‘తండేల్’ (Thandel) సినిమా గతేడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ ఏడాదికి వాయిదా పడింది. మొత్తానికి ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. నాగచైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీలో మూవీలో హైలెట్ అవ్వనుందని ఇప్పటికే విడుదలయిన పాటలు, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కోసం ఈ మూవీని చూడాలని చాలామంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నేచురల్గా రావడం కోసం సముద్రంలో షూటింగ్స్ చేస్తూ చాలా కష్టపడ్డామని, కచ్చితంగా ఈ మూవీ ఆడియన్స్కు నచ్చుతుందని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది.