Chiranjeevi: మామూలుగా ఒక హీరో కోసం రాసుకున్న కథను ఆయన రిజెక్ట్ చేయడం వల్ల మరొక హీరో దగ్గరకు వెళ్లడం సహజం. ఏ హీరో కోసం రాసుకున్న కథను ఆ హీరో యాక్సెప్ట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాగే సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని కూడా చాలామంది దర్శకులు, రచయితలు చాలా కథలు రాసుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ చాలావరకు వేరే హీరోల చేతికి వెళ్లిపోతుంటాయి. తాజాగా ‘మజాకా’ విషయంలో కూడా అదే జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కథను ముందుగా చిరంజీవి దగ్గరకు వెళ్లిందట.
తండ్రి పాత్రలో చిరు
త్రినాథరావు నక్కినతో కలిసి తరచుగా పనిచేస్తున్న రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ.. ‘మజాకా’ కథను కూడా రాశారు. అయితే ఈ మూవీలో కొడుకు పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. తండ్రి పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఈ తండ్రీకొడుకుల పాత్రలో రావు రమేశ్, సందీప్ కిషన్ (Sundeep Kishan) నటించారు. కానీ ముందుగా ఇదే పాత్రల్లో చిరంజీవి, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తే బాగుంటుందని దర్శకుడు భావించాడట. పైగా చిరు, సిద్ధు తండ్రీకొడుకులుగా నటించనున్నారనే వార్త అప్పట్లో సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ కూడా క్రియేట్ చేసింది. కానీ ఈ కథను మెగాస్టార్ రిజెక్ట్ చేయడంతో ‘మజాకా’లో నటించడానికి సందీప్, రావు రమేశ్ ఫైనల్ అయ్యారు.
క్రింజ్ కామెడీ
ఫిబ్రవరి 26న ‘మజాకా’ (Mazaka) విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే ఆ మూవీని ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం సందీప్ కిషన్ తెగ కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ పాటలు అన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఇటీవల విడుదలయిన ఈ ట్రైలర్ చూసిన తర్వాత చిరంజీవి (Chiranjeevi).. ఈ మూవీని రిజెక్ట్ చేసి మంచి పని చేశారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తండ్రీకొడకుల కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇప్పటికే చాలాసార్లు చూశామనే ఫీలింగ్ వస్తుందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా ట్రైలర్ను పూర్తిగా క్రింజ్ కామెడీతో నింపేశాడని దర్శకుడిపై కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: రెజీనా నుండి రూ.5 లక్షలు.. సందీప్ కిషన్ బెస్ట్ ఫ్రెండ్ బెటర్ హాఫ్ కాబోతోందా
సెట్ అవ్వదు
మెగాస్టార్ చిరంజీవికి కామెడీ కథల్లో నటించడం ఇష్టమే కానీ ‘మజాకా’ కోసం ఏకంగా ఒక హీరోకు తండ్రి పాత్రలో కనిపించాలంటే కచ్చితంగా తన ఇమేజ్పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఆ విధంగా కూడా ఆయన ఈ మూవీని రిజెక్ట్ చేయడమే బెటర్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ సందీప్ కిషన్ మాత్రం తన కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించే సినిమాగా ‘మజాకా’ నిలుస్తుందని నమ్ముతున్నాడు. ఇందులో సందీప్కు జోడీగా తెలుగమ్మాయి రీతూ వర్మ నటించింది. అంతే కాకుండా ‘మన్మథుడు’ మూవీ ఫేమ్ అన్షు.. ఈ మూవీతో మళ్లీ నటిగా రీఎంట్రీ ఇస్తోంది. అన్షు రీఎంట్రీ వల్ల కూడా ‘మజాకా’పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.