Gautham Menon: ఈరోజుల్లో సీనియర్ హీరోలు మాత్రమే కాదు.. యంగ్ హీరోలు కూడా మాస్ ఇమేజ్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చాలావరకు రొమాంటిక్ సినిమాలు చేయడానికి హీరోలు ఎవరూ ఇష్టపడడం లేదు. రొమాంటిక్ లవ్ సినిమాలు అనేవి మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలుస్తాయని తెలిసినా.. హీరోలు మాత్రం ఆ కథలతో రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అదే విషయాన్ని ఓపెన్గా చెప్పాడు దర్శకుడు గౌతమ్ మీనన్. మామూలుగా గౌతమ్ మీనన్ (Gautham Menon) పేరు చెప్పగానే తను తెరకెక్కించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమాలే గుర్తొస్తాయి. అలాంటిది హీరోలు సైతం తన దగ్గర నుండి రొమాంటిక్ కథలు వినడానికి ఒప్పుకోవడం లేదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
కథలు అయిపోలేదు
‘‘ఈరోజుల్లో ఏ స్టార్ కూడా రొమాన్స్ చేయాలని అనుకోవడం లేదు. నేను తమిళ, తెలుగు, కన్నడ నుండి కూడా చాలామంది స్టార్లను అప్రోచ్ అయ్యాను. రొమాంటిక్ కథ అని చెప్పగానే మీటింగ్ పోస్ట్పోన్ చేసేవాళ్లు లేదా అసలు మీటింగ్కు ఒప్పుకునేవాళ్లే కాదు. అలా ఎందుకు చేశారో వాళ్లనే అడగాలి’’ అంటూ నవ్వాడు గౌతమ్ మీనన్. ఇక ఇండస్ట్రీ నుండి తనను ప్రభావితం చేసిన వ్యక్తుల పేర్లు చెప్పమనగా.. మణిరత్నం, కమల్ హాసన్, గురు దత్, రాజ్ కపూర్ పేర్లు చెప్పాడు. ‘‘నా దగ్గర ఇంకా కథలు అయిపోలేదు. నా చుట్టూ ఉన్నవాళ్ల కథల గురించి చెప్తూనే నా సినిమా జర్నీని ప్రారంభించాను. అలాగే కొనసాగిస్తున్నాను కూడా. ఫిల్మ్ మేకింగ్ అనేది నాకు చాలా ఇష్టం. దాంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఇష్టం’’ అని చెప్పుకొచ్చాడు.
స్టార్ అని మర్చిపోయా
‘‘నా ప్రతీ సినిమా ఏదో ఒక విధంగా ఒక ప్రయోగమే. కాఖా కాఖా విడుదలయిన కొత్తలో కూడా చాలారోజుల పాటు ప్రేక్షకులకు అది నచ్చలేదు. కట్స్ విషయంలో, ఇంకా చాలా విషయాల్లో అందులో చాలా కొత్త ప్రయోగాలు చేశాం. కానీ మెల్లగా వారికే అది నచ్చింది’’ అని గుర్తుచేసుకున్నాడు గౌతమ్ మీనన్. ఇక స్టార్లతో సినిమాలు చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా తెరకెక్కించారా అని అడగగా.. ‘‘నేను అలాంటివి చాలా అరుదుగా చేశాను. ఎంతవాడు గానీ సినిమా తన ట్రెండ్ను ఎలా మార్చిందో అజిత్ ఇప్పటికీ మాట్లాడతారు. డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మమ్ముట్టి స్టార్ అనే విషయం నేను మర్చిపోయాను’’ అన్నాడు.
Also Read: బుచ్చిబాబు ఏంటి ఇది.. శివన్నను ఇలా మార్చేశావు..
సినిమాలను చంపేస్తున్నాం
‘‘అసలు ప్రేక్షకులను థియేటర్లకు ఎలా తీసుకురావాలి అనే విషయం నాకు కూడా తెలియదు. నేర్చుకుంటున్నాను. తెలుగు, తమిళంలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం స్టార్ల వల్లే సాధ్యమవుతోంది. థియేటర్ బిజినెస్ను మనమే చంపేస్తున్నాం. మూవీ షూటింగ్ కోసం డబ్బులు కావాలి కాబట్టి డిజిటల్ సేల్స్పై దృష్టిపెడుతున్నాం. మొదట్లో ఓటీటీ అనేది సినిమాను అందరికీ దగ్గర చేస్తుందని అనుకున్నాను. థియేటర్లలో సినిమా విడుదలయిన మూడు, నాలుగు నెలల తర్వాత అది ఓటీటీలోకి వస్తే అప్పుడు థియేటర్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. రివ్యూలతో కూడా నాకు ప్రాబ్లం ఉంది’’ అంటూ రివ్యూలు, ఓటీటీ అనేవి సినిమాలను ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో మాట్లాడాడు గౌతమ్ మీనన్.