Manchu Manoj : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలలో ఎంత బిజీగా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆయన అటు రాజకీయాల ద్వారా ప్రజలకు న్యాయం చేకూరుస్తూనే.. ఇటు తనను నమ్ముకున్న అభిమానులకు వినోదాన్ని పంచడానికి కూడా సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఎప్పుడో ఎన్నికలకు ముందు మూడు సినిమాలు ప్రకటించారు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పటివరకు ఆ సినిమాలను విడుదల చేయలేదు. అందులో ముఖ్యంగా హరిహర వీరమల్లు (Harihara Veera mallu) సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
పైగా ఈ సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదట ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహించాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆయన తప్పుకోవడంతో నిర్మాత రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) రంగంలోకి దిగారు. ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని ప్రకటించగా.. ఏడు రోజుల్లో పూర్తి చేయాల్సిన షూటింగ్ ను కుదించి.. రెండు రోజుల్లోనే పూర్తి చేసి సన్నివేశాలను కూడా తగ్గించినట్లు సమాచారం.
ఇక ఎలాగో రెండు భాగాలుగా రాబోతోంది కాబట్టి ఇప్పుడు ఎంతవరకు షూటింగ్ అయితే అంతవరకు మొదటి పార్ట్ గా విడుదల చేయాలని మేకర్స్ కూడా భావించారట. ఇక అలా ఇప్పటివరకు పూర్తయిన షూటింగ్ ను ఒక పార్ట్ గా విడుదల చేయబోతున్నట్లు , మే 30వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ 30వ తేదీ కూడా హరిహర వీరమల్లు లేనట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ డేట్ ని ని మంచు హీరో లాక్ చేసుకున్నట్లు సమాచారం.
హరిహర వీరమల్లు స్థానంలో మంచు హీరో భైరవం..
ఇప్పటికే 12సార్లు వాయిదా పడ్డ హరిహర వీరమల్లు.. ఇప్పుడు కూడా వాయిదా పడడంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేయడమే కాదు దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ మూవీ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు నిరాశే మిగులుతోంది అనడంలో సందేహం లేదు. ఇక మంచు మనోజ్ (Manchu Manoj) విషయానికి వస్తే.. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న ఈయన ఇప్పుడు ‘భైరవం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి తన అన్నయ్య మంచు విష్ణు కన్నప్ప సినిమా రోజే ఈ సినిమా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మే 30వ తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది.
భైరవం సినిమా విశేషాలు..
భైరవం సినిమా విషయానికి వస్తే.. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ సంయుక్తంగా నటిస్తున్న చిత్రం భైరవం. విజయ్ కనక మేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ గజపతి పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అనౌన్స్మెంట్ వీడియోతో పాటు పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధా మోహన్ నిర్మిస్తున్నారు. 2018లో ఒక సినిమాలో అతిథి పాత్ర పోషించిన మంచు మనోజ్.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
మంచు మనోజ్ తో విజయ్ దేవరకొండ ఫైట్ ఫిక్స్..
ఇకపోతే ఇదే రోజు గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న కింగ్డమ్ (KingDom) సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇక ఎలాగో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ డేట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి.. ఇక విజయ్ దేవరకొండ , మంచు మనోజ్ మధ్య టఫ్ ఫైట్ జరగబోతుందని తెలుస్తోంది. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.