Saif Ali Khan : బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు దాడి జరిగిందా? జరిగింది అన్నట్టు డ్రామాలు చేశారా? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు సైఫ్ ను గాయపరిచిన నిందితుడి గురించి పోలీసులు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంటే, మరోవైపు సైఫ్ అలీ ఖాన్ క్లెయిమ్ చేసిన ఇన్సూరెన్స్ పై వివాదం నడుస్తోంది. అసలు సైఫ్ ఎంత ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేశారు? ఈ వివాదం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
వివాదం ఇదే…
జనవరి 16వ తేదీ రాత్రి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇంటిపై దాడి జరిగింది. దాడి అనంతరం ఆయన లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఇప్పుడు క్షేమంగా ఇంటికి చేరుకున్న సైఫ్ ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేశారు. ఆయన ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేయడం విశేషం కాదు. కానీ ఇక్కడ ఆయన అలా క్లెయిమ్ చేశారో లేదో ఇలా లక్షల్లో ఇన్సూరెన్స్ అమౌంట్ అప్రూవ్ అయ్యింది. ఇదే తాజా వివాదానికి కారణం. సామాన్యుల విషయంలో ముప్పుతిప్పలు పెట్టే ఇన్సూరెన్స్ కంపెనీలు, సైఫ్ కి మాత్రం రూ. 36 లక్షలు క్లెయిమ్ చేయగా, వెంటనే రూ. 25 లక్షలు అప్రూవ్ చేశారు. ఈ విషయం తాజాగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) దృష్టికి చేరింది. ఆసుపత్రి చిన్నదైనా, పెద్దదైనా రోగులందరూ ఒకే విధమైన క్లెయిమ్లు పొందాలని మెడికల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ కోరింది.
సదరు ఇన్సూరెన్స్ కంపెనీపై విచారణ జరిపించాలని అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సుధీర్ నాయక్ మాట్లాడుతూ.. “ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు వివక్ష చూపుతున్నాయి? సైఫ్ అలీఖాన్ క్లెయిమ్ చేసిన రూ.25 లక్షలు అవసరమైన ప్రాసెస్ ను పూర్తి చేయకుండానే అప్రూవ్ అయ్యాయి. ఆయనకు మాత్రం ఇలా ఎందుకు అప్రూవ్ చేశారు?” అంటూ సూటిగా ప్రశ్నించారు.
సెలబ్రిటీ అయినందుకేనా ?
14000 కంటే ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉన్న IMC ముంబై, సైఫ్ అలీ ఖాన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేవలం కొన్ని గంటల్లో క్లియర్ చేయటంపై ప్రశ్నలను లేవనెత్తింది. సైఫ్ సెలబ్రిటీ అయినందున అతనికి ఇంత ప్రాధాన్యత ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా సైఫ్పై దాడి కేసులో ముంబై పోలీసులు సోమవారం బెంగాల్లోని నదియా జిల్లాలో సోదాలు నిర్వహించారు. పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఇంతకుముందు అరెస్టయిన నిందితుడు, బంగ్లాదేశ్ వ్యక్తి ఉపయోగించిన సిమ్ ఈ మహిళ పేరు మీద ఉందని దర్యాప్తులో తేలింది. ముంబై పోలీసు బృందం ఆదివారం బెంగాల్ లో అరెస్టు చేసిన మహిళను తీసుకెళ్లేందుకు, ట్రాన్సిట్ రిమాండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని బెంగాల్ పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ మహిళ పేరు ఖుఖుమోని జహంగీర్ షేక్. ఆమె షరీఫుల్కు పరిచయస్తురాలు. సిలిగురి సమీపంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా షరీఫుల్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలోని అందులియా నివాసి అని సమాచారం.