Iran Israel US War| ఇరాన్లోని మూడు న్యూక్లియర్ సైట్లపై ఆదివారం అమెరికా దాడులు చేసింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దంలో అమెరికా జోక్యం చేసుకోవడంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను “విజయవంతం” అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో సంఘర్షణను ఇరాన్ ఆపకపోతే “మరింత తీవ్ర పరిణామాలు” ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్త పరిస్థితులు తదుపరి ఈ పరిణామాలకు దారి తీయవచ్చు అనే ప్రశ్నకు విశ్లేషకులు అయిదు ప్రత్యామ్నాలు సూచిస్తున్నారు.
మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయవచ్చు
ఇరాన్ తన న్యూక్లియర్ సైట్లపై దాడులకు ప్రతీకారంగా ఈ ప్రాంతంలోని (బహ్రెయిన్, సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలిటరీ స్థావరాలు) అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేయవచ్చు. “ఈ ప్రాంతంలోని ప్రతి అమెరికన్ పౌరుడు లేదా సైనికుడు ఇప్పుడు ఇరాన్ టార్గెట్” అని ఇరాన్ జాతీయ మీడియా ప్రకటించింది. అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్లలో మత, సాంస్కృతిక, దౌత్య స్థలాల వద్ద భద్రతను న్యూయార్క్ పోలీసు శాఖ పెంచేసింది.
ఇరాన్ సైన్యంపై ఇజ్రాయెల్ దాడి
ఇజ్రాయెల్ హై అలర్ట్ ప్రకటించి.. ఇరాన్ సైనిక శక్తికి కీలకమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)పై ముందస్తు దాడులు చేయవచ్చు. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన ప్రకారం.. దేశం(ఇజ్రాయెల్) లోని అన్ని ప్రాంతాల్లో సైనిక బలగాలు పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించి ఆ బలగాలను యుద్దం వైపునకు మళ్లించే ప్రయత్నంలో ఉంది. కేవలం అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే సెక్యూరిటీని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపింది. విద్యా సంస్థలు, సమావేశాలు, ఆఫీసుల్లో సమావేశాలను నిషేధించింది.
హెజ్బొల్లా, హౌతీల ద్వారా ఇరాన్ దాడులు
ఇరాన్ తన మిత్రపక్షాలైన హెజ్బొల్లా, యెమెన్లోని హౌతీలు, ఇరాక్లోని షియా మిలీషియాలు, గాజాలోని హమాస్లను యాక్టివేట్ చేసి.. లెబనాన్, ఇరాక్, సిరియా నుంచి ఇజ్రాయెల్పై దాడులు చేయించవచ్చు. ఈ సమూహాలు ఇరాన్ “రెసిస్టెన్స్ యాక్సిస్”లో భాగం. అయితే ఈ సారి ఈ సమూహాలు పెద్దగా చురుగ్గా లేవు. ప్రస్తుతం ఈ మిలిటెంట్ గ్రూపులన్నీ బలహీనపడ్డాయి. అంతర్గత విభేదాలు, సొంత సమస్యలతో ఉన్నాయి. హెజ్బొల్లా నాయకుడు షేక్ నయిమ్ ఖాసిమ్ ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమం శాంతియుతమని.. ఇజ్రాయెల్, అమెరికాతో పోరాటంలో ఇరాన్కు “పూర్తి మద్దతు” ఇస్తామని ప్రకటించారు.
ఇరాన్ కు చైనా, రష్యా దౌత్య మద్దతు
ఇరాన్ మిత్రులైన.. చైనా, రష్యా దేశాలు—ప్రపంచంలో ప్రభావం కలిగిన దేశాలు. ప్రస్తుతం ఇజ్రాయెల్ తో సంఘర్షణలో—సంయమనం పాటించాలని ఇరాన్ కు సూచిస్తున్నాయి. కానీ రహస్యంగా ఇరాన్కు దౌత్య మద్దతు కల్పిస్తున్నాయి. ట్రంప్.. ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణకు “ఆజ్యం పోస్తున్నారు” అని చైనా ఆరోపించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. ఈ యుద్ధం పట్ల స్పందిస్తూ.. ఇజ్రాయెల్ శత్రుస్వభాన్ని వీడాలని కోరారు. రష్యా కూడా అమెరికా సైనిక జోక్యాన్ని వ్యతిరేకించింది. ఇరాన్లోని బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి “చెర్నోబిల్ లాంటి విపత్తు”కు దారితీస్తుందని రష్యా న్యూక్లియర్ ఎనర్జీ చీఫ్ హెచ్చరించారు.
చమురు ధరల పెరుగుదల
ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలలో ఇరాన్ ఒకటి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ను మూసివేయవచ్చు. ఈ సముద్ర మార్గంలో భారీ స్థాయిలో ప్రపంచ వాణిజ్యం కొనసాగుతోంది. ప్రతి రోజు ఈ మార్గంలోనే 20 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. సౌదీ ఈస్ట్-వెస్ట్ పైప్లైన్, యూ.ఎ.ఈ. పైప్లైన్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు కొంత చమురును రవాణా చేయగలవు, కానీ ప్రమాదం, రవాణా ఖర్చులు పెరగడం వల్ల చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయి.
Also Read: ఇరాన్ అణు బాంబులు తయారు చేయడం లేదు.. అమెరికా గూఢాచారుల రిపోర్ట్
ఇరాన్ పై నేరుగా వైమానిక దాడులు చేయడం అమెరికాకు ఇదే మొదటిసారి. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ లాంటి బలమైన మిలిటరీ, వైమానిక శక్తి కలిగిన దేశం కావడంతో ఇజ్రాయెల్, అమెరికాలకు ఈసారి అంత ఈజీగా పై చేయి సాధిస్తాయని చెప్పడం కష్టంగా మారింది.