Floods in Brazil : 80 ఏళ్లలో ఎన్నడూ చూడని వరదలు బ్రెజిల్ ను ముంచెత్తాయి. భారీ వర్షాలు 150 ఏళ్ల క్రితం రికార్డును బ్రేక్ చేశాయి. ఈ విషయాన్ని బ్రెజిల్ జియోలాజికల్ సర్వీస్ వెల్లడించింది. సౌత్ బ్రెజిల్ లోని రియో గ్రాండ్ డి సుల్.. భారీ వర్షాలకు అతలాకుతలమైంది. వరదలతో పాటు భారీ వర్షాలకు 60 మంది మృతి చెందగా.. మరో 70 మంది గల్లంతైనట్లు అక్కడి మీడియా పేర్కొంది.
వర్షాలు, వరదల కారణంగా 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లన్నీ నీటమునగడంతో వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. గడిచిన 80 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడం తొలిసారి అని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఏడాది కాలంలో బ్రెజిల్ ను నాలుగో సారి వర్షాలు భయపెట్టాయి. గతేడాది జులై, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో వరదల కారణంగా 75 మంది మరణించారు.
Also Read : బలూచిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. జర్నలిస్ట్ సహా ముగ్గురు మృతి..!
వరదల కారణంగా.. తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. మొబైల్ నెట్ వర్క్ పనిచేయకపోవడంతో కమ్యూనికేషన్ కు సైతం ఆటంకం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉందని అధికారులు తెలిపారు. సైన్యాన్ని రంగంలోకి దించి లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది ప్రపంచ దేశాలను వరదలు ముంచెత్తాయి. ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్, కెన్యా దేశాలను వరదలు వణికించాయి. గత నెలలో ఆప్ఘనిస్థాన్ లో కురిసిన వర్షాలకు వరదలు సంభవించగా.. 33 మంది మరణించారు. పదులసంఖ్యలో ప్రజలు గల్లంతవ్వగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కెన్యాలోనూ వరదల కారణంగా 38 మంది మృతి చెందారు. ఇక దుబాయ్ ను కూడా భారీ వర్షం ముంచెత్తిన విషయం తెలిసిందే. ఏడాదికాలంలో కురవాల్సిన వర్షం.. 24 గంటల్లో కురవడంతో దుబాయ్ జనజీవనం అస్తవ్యస్థమైంది.
భారత్ లో మాత్రం విపరీతమైన ఎండలు చంపేస్తున్నాయి. బయట అడుగుపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి. కొన్నిప్రాంతాల్లో ఎండలు ఎడారిని తలపిస్తున్నాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వడగాలుల ధాటికి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు.