France PM Michel Barnier| పాశ్చాత్య దేశం ఫ్రాన్స్ లో చాలాకాలంగా రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. జూలై 2024లో అక్కడి పార్లమెంట్ (నేషనల్ అసెంబ్లీ) ఎన్నికలు జరిగాయి. కానీ మూడు ప్రధాన పార్టీలకు దాదాపు సమానంగా ఓట్లు పడ్డాయి. దీంతో ఎవరికీ మెజారిటీ దక్కలేదు. దీంతో రెండు నెలల పాటు ప్రధాన మంత్రి ఎవరు.. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయనేది చాలా ఉత్కంఠంగా సాగింది. చివరికి మూడు నెలల క్రితం మిచెల్ బార్నియర్ ప్రధాన మంత్రి పదవి చేప్పట్టారు. అయితే ఆయనను కూడా తాజాగా గద్దె దించేశారు. నేషనల్ అసెంబ్లీలో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం జరిగింది. ఇందులో ఆయనకు వ్యతిరేకంగా 331 ఓట్లు (కావాల్సినవి 288) పడ్దాయి. దీంతో మిచెల్ బార్నియర్ తన ప్రధాన మంత్రి కోల్పోయారు.
ఫ్రాన్స్ లో అధ్యక్ష ఎన్నికలు వేరు, ప్రధాన మంత్రి ఎన్నికలు వేరు. అయితే ఈసారి అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్కి చెందిన రినయసెన్స్ పార్టీకి కూడా మెజారిటీ దక్కలేదు. దీంతో ఆయన ది రిపబ్లికన్స్ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన మంత్రిగా రిపబ్లికన్స్ పార్టీ నాయకుడు మిచెల్ బార్నియర్ ప్రధాని పగ్గాలు చేపట్టారు. కానీ నెల రోజుల క్రితం నేషనల్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పట్ల చాలా మంది ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ తో ఫ్రాన్స్ ప్రజలకు అన్యాయం జరుగుతుందని విమర్శలు చేశారు.
Also Read: ఇండియాను కాదని చైనా వెళ్లిన నేపాల్ కొత్త ప్రధాని.. బిఆర్ఐ ప్రాజెక్టుపై ఒప్పందం
దీంతో యూరోప్ లోని రెండో అతిపెద్ద ఎకానమి ఫ్రాన్స్ చరిత్రలో రెండోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 577 మంది ఎంపీలున్న ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో బార్నియర్ ప్రభుత్వానకి వ్యతిరేకంగా మరియా లీపెన్ కు చెందిన ప్రతిపక్ష ‘ది నేషనల్ ర్యాలీ’ పార్టీతోపాటు అధికార కూటమిలోని చాలా మంది ఎంపీలు కూడా కలిసి ఓటేశారు. దీంతో ఫ్రాన్స్ లో కొత్త ప్రభుత్వం మూడు నెలలకే కుప్పకూలింది.
నియమాల ప్రకారం.. గురువారం డిసెంబర్ 5, 2024 సాయంత్రం వరకు బార్నియర్ ప్రధాన మంత్రి తన రాజీనామా సమర్పించాలి. అవిశ్వాస తీర్మానం ఓడిపోయిన తరువాత బార్నియర్ ఇలా అన్నారు. ” ఫ్రాన్స్ ప్రధాన మంత్రిగా సేవలు అందించం నాకు గౌరవంగా ఉంది. ఈ అవిశ్వాస తీర్మానం అన్ని విషయాలు కఠినతరం చేసింది. ఇంకా కష్టాలు మున్ముందు ఎదురవుతాయి. ఆ విషయం నేను కచ్చితంగా చెప్పగలను. ” అని ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు.
నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం జరిగే సమయంలో అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్ సౌదీ అరేబియా దేశ పర్యటనలో ఉన్నారు. ఫ్రాన్స్లో ప్రభుత్వం కూలిపోయినా అధ్యక్షుడిగా ఎమ్మానుయెల్ మాక్రాన్ 2027 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం తదుపరి ప్రధాన మంత్రి ఎవరనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. దీంతో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ 2025 సంవత్సరం జూలై నెల వరకు అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్ కు యూరోపియన్ యూనియన్ దేశాలు సంయుక్త ఎకానమీపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫ్రాన్స్ దేశ అప్పులు భారీగా పెరిగిపోవడమే దీనికి కారణం. ఇప్పుడు ప్రభుత్వం కూలిపోవడంతో ఫ్రాన్స్ లో వడ్డీ రేట్లు ఇంకా పెరిగిపోయి పరిస్థితులు దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరోప్ దేశాలలో ఇప్పటికే గ్రీస్ దివాలా తీసింది. దీనికి చాలా దేశాల ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి.