Pakistan : చేసిన పాపం ఊరికే పోదు. తరతరాల పాటు వెంటాడుతుంది. పాకిస్తాన్లో ఇప్పుడు అదే జరుగుతోంది. దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి పోషించింది. ఉగ్ర అగ్రనేతలను దేశంలో ప్రముఖ స్థానం కల్పించి.. టెర్రరిస్టులను తయారు చేసే కర్మాగారంగా మారింది. శిక్షణ ఇచ్చి, ఆయుధాలు అందించి.. ముష్కరులను సరిహద్దులు దాటించి.. ఏళ్ల తరబడి భారత్లో మారణహోమం సృష్టించింది. పహల్గాంలోనూ అదే దారుణానికి ఒడిగట్టడంతో పాకిస్తాన్ పాపం పండింది. ఆపరేషన్ సిందూర్తో దాయాది దేశంలో ఉగ్రవాదం వెన్నుముఖ విరిచేసింది ఇండియా. పాక్ ఆర్మీకి సైతం కోలుకోలేని దెబ్బ కొట్టింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని.. పాక్ గొంతెండేలా చేస్తోంది. లేటెస్ట్గా నీటి కోసం సింధ్ ప్రావిన్స్లో అంతర్యుద్దమే జరుగుతోంది. ఏకంగా హోమంత్రి ఇంటినే తగలబెట్టారు ఆందోళనకారులు. పోలీసులు కాల్పుల్లో ఇద్దరు నిరసన కారులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పాకిస్తాన్లో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది.
పాక్లో అంతర్యుద్ధం..
ఓవైపు బలూచిస్తాన్లో తిరుగుబాటు దారులు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ షురూ అయినప్పటి నుంచీ.. బలూచ్ గెరిల్లాలు భీకర దాడులు చేస్తున్నారు. పాక్ ఆర్మీ వాహనాలే టార్గెట్గా గెరిల్లా యుద్ధం చేస్తున్నారు. BLA అటాక్లో పదుల సంఖ్యలో పాక్ సైనికులు హతమయ్యారు. పహల్గాంలో పాల్పడిన పాపానికి.. అంతకంతకు అనుభవిస్తోంది. బలూచిస్తాన్ వేర్పాటువాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో మరో అంతర్యుద్ధం మొదలైంది. సింధ్ ప్రావిన్స్లో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇండస్ రివర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.
సింధు రివర్ ప్రాజెక్ట్పై తిరుగుబాటు
గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్లో భాగంగా పాక్ ఆర్మీ మద్దతుతో.. సింధు నది ప్రాజెక్టు చేపట్టింది. అయితే, సింధు జలాలను పంజాబ్ భూస్వాములు, కార్పొరేట్ వ్యవసాయ సంస్థలకు మళ్లించేందుకు కాలువలు నిర్మిస్తున్నారంటూ కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఏప్రిల్లో పనులు ఆపేసినా, సీక్రెట్గా కొనసాగిస్తున్నారు. ఆ విషయం తెలిసి నిరసనకారులు మరోసారి రోడ్డెక్కారు. ప్రాజెక్టును నిలిపివేయాలంటూ ఆందోళన నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. ఫైరింగ్లో ఇద్దరు నిరసనకారులు చనిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
Also Read : ఆ సుఖం కోసం.. పాక్కు సీక్రెట్స్.. యూట్యూబర్ జ్యోతి కేసులో ట్విస్ట్..
ప్రభుత్వంపై దండయాత్ర
నార్త్ సింధులో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. గూడ్స్ ట్రక్కులను, పెట్రోలియం కంపెనీ కార్యాలయాన్ని దోచుకున్నారు. సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ ఇంటికి నిప్పుపెట్టారు. మోరో పట్టణంలో పరిస్థితి కంట్రోల్ తప్పడంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. 15 మందికి పైగా నిరసనకారులు గాయపడగా, వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. సింధ్ ప్రావిన్స్ నివురుగప్పిన నిప్పులా ఉంది.