India Financial Strike Pakistan| పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశాలు భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తంగా మారాయి. సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉగ్రవాదానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చే పాకిస్తాన్ను అణిచివేయాలని భారత ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ లక్ష్యంతోనే ఆర్థిక విధ్వంసాలకు (ఫైనాన్షియల్ స్ట్రైక్స్) సంబంధించి రెండు దశల్లో ప్రణాళికలు రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (FATF) గ్రేలిస్టులో పాకిస్తాన్ పేరుని మళ్లీ చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాకుండా, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) నుంచి పాకిస్తాన్కు లభించాల్సిన 7 బిలియన్ డాలర్ల సహాయంపై భారత ప్రభుత్వం వ్యతిరేకించే ఆలోచనలో ఉంది. ఈ చర్యలు అమలైతే ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది.
ఇప్పుడు FATF అంటే ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. కొంత మంది దేశాధినేతలు, రాజకీయ నాయకులు అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుని ఎక్కువగా ఉగ్రవాద కార్యకలాపాలకు, చీకటి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. వెనుకబడిన దేశాలు, అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లోని బ్యాంకింగ్ వ్యవస్థలు ఉగ్రవాదం కోసం దుర్వినియోగానికి గురవుతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (FATF) అనే సంస్థను స్థాపించారు. ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ కాదు. పారిస్ కేంద్రంగా 1989లో జీ-7 దేశాలు.. ఐరోపా కమిషన్ కలిసి ఏర్పాటు చేసిన సంస్థ..
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి నిధులు చేరకుండా నియంత్రించేందుకు FATF సంస్థ పలు నిబంధనలను రూపొందించింది. జీ7 దేశాలు సంపన్నమైనవిగా ఉండటంతో, మిగిలిన దేశాలు కూడా ఈ నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిబంధనల అమలు సరిగా చేయకుంటే ఆయా దేశాలపై FATF చర్యలు తీసుకుంటుంది. నిబంధనలను అమలు చేయని దేశాల జాబితాని గ్రే లిస్టు అని అంటారు.
FATF రూపొందించిన గ్రే లిస్ట్లో పాకిస్తాన్ ఉండటం కొత్త విషయం కాదు. కానీ, బ్లాక్లిస్ట్లోకి చేరితే పాకిస్తాన్కు విదేశీ పెట్టుబడులు రావడం అసాధ్యమవుతుంది. అంతేకాకుండా, IMF లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందడం కూడా కష్టతరమవుతుంది.
Also Read: భర్త కొడుకుపై కామ ప్రయోగం చేసిన నర్సు.. ఉద్యోగ లైసెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీయడంతో IMF నుంచి సహాయం కోసం ప్రయత్నిస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. దాంతోపాటు ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక అస్థిరతతో పాటు రాజకీయంగా కూడా పాకిస్తాన్లో అశాంతి నెలకొంది. పాక్ ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తోందని ఆరోపిస్తూ, IMF ఇచ్చిన 7 బిలియన్ డాలర్ల సహాయంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముంది. గత సంవత్సరం జూలైలో IMF, పాకిస్తాన్ మధ్య మూడేళ్ల కాలానికి సహాయ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు భారత్ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని నిరసనలు చేస్తే.. ఆ ఒప్పందం కాస్తా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బను ఎదుర్కొంటోంది.
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా విభాగాల అంచనా ప్రకారం, ఈ దాడికి ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ అనే సంస్థ పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ సంస్థ.. పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా ఉగ్రసంఘానికి అనుబంధంగా పనిచేస్తోంది. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ను ఒణికించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఒక ప్రధాన చర్యగా ఉంది.