Indian Murdered In Canada| కెనడాలో ఇటీవల భారతీయులపై, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుండడంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక భారతీయుడిని కత్తితో పొడిచి ఓ దుండగుడు హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కెనడాలోని భారత ఎంబసీ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
“ఒట్టావా సమీపంలో ఉన్న రాక్లాండ్ ప్రాంతంలో ఒక భారతీయుడు కత్తి దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన చాలా విచారకరం. ఈ ఘటనలో అనుమానితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువులకు మేము అన్ని విధాల సహాయం అందిస్తాం. స్థానిక కమ్యూనిటీతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నాం” అని భారత ఎంబసీ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం మృతుడి పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు. కెనడా మీడియా ప్రకారం.. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిందని సమాచారం. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. మృతుడి మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోందని స్థానిక పోలీసులు తెలిపారు.
Also Read: మాటలు జాగ్రత్త!.. బంగ్లాదేశ్ సారథి యూనుస్కు మోదీ వార్నింగ్
2024 డిసెంబరులో రెండు హత్యలు
కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. 2024 డిసెంబర్ 1న బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థి గురసిస్ సింగ్ (22) తన రూమ్మేట్ చేత హత్య చేయబడ్డాడు. అదే నెల 6న సెక్యూరిటీ గార్డ్ హర్షణ్దీప్ సింగ్ (20)ని కాల్చి చంపేశారు. హర్షణ్దీప్ సింగ్ కేసులో ఇద్దరిని ఎడ్మంటన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల ప్రకారం.. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సమాచారం అందిన వెంటనే అపార్ట్మెంట్కు వెళ్లి, స్పృహలేని స్థితిలో ఉన్న హర్షణ్దీప్ను కనుగొన్నారు. అతడిని తక్షణమే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్లో ముగ్గురు దుండగులు హర్షణ్దీప్పై దాడి చేసినట్లు స్పష్టంగా కనిపించింది.
భారతీయులపై పెరుగుతున్న దాడులు… విదేశాంగ శాఖ నివేదిక
2023లో విదేశాలలో 86 మంది భారతీయులపై దాడులు లేదా హత్యలు జరిగాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ 2024 డిసెంబర్లో పార్లమెంటుకు సమాచారం ఇచ్చారు. గత రెండు సంవత్సరాలతో పోల్చితే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021లో 29 కేసులు, 2022లో 57 కేసులు నమోదయ్యాయి. నివేదిక ప్రకారం.. అమెరికాలో 12 మంది, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియాలో 10 మంది భారతీయులపై దాడులు జరిగాయి.
భారతీయ పౌరులకు సహాయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం విదేశాల్లోని భారత మిషన్లు/పోస్టులలో 24 గంటల హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్లు కూడా మంత్రి తెలిపారు.