Indian US Dportation| అగ్రరాజ్యం అమెరికాలో వలసదారుల చట్టం కఠినం కానుంది. జనవరి 2025లో రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమవలసదారులను వెంటనే వారి దేశాలకు తిరిగి పంపేయడం జరుగుతుందని ఇప్పటికే పలుమార్లు ట్రంప్ చెప్పారు. దీంతో ఆ దేశంలో సరైన అనుమతి పత్రాలు లేకుండా నివసిస్తున్న వలసదారుల భవిష్యత్తు అనిశ్చితిలో కనిపిస్తోంది.
చట్టప్రకారం వలస వచ్చినట్లు పత్రాలు లేనివారిని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు గుర్తించడం ప్రారంభించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఐసిఈ) శాఖ తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. అమెరికాలో దాదాపు 14 లక్షల 50 వేల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నారు. వీరి వద్ద అనుమతి పత్రాలు లేవు. వీరిలో 18000 మంది భారతీయులు కూడా ఉండడం గమనార్హం.
గత మూడు సంవత్సరాల గణాంకాలు చూస్తే.. ఇండియా నుంచి అమెరికాలో సరిహద్దుల్లో అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 90,000. వీరిలో ఎక్కువ మంది గుజరాత్, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్.
Also Read: భార్యకు భరణం ఎంత ఇవ్వాలో లెక్కలు చెప్పిన సుప్రీం కోర్టు..
అమెరికాకు వలస వెళ్లిన భారతీయులలో అనుమతి పత్రాలు లేని వారు చట్టప్రకారం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న తరువాత ఈ ప్రక్రియం రెండు నుంచి మూడేళ్ల వరకు సాగే అవకాశం ఉంది. వారి అనుమతి వచ్చేలోపే ప్రభుత్వం ముఖ్యంగా ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత వారందరినీ ఇండియాకు తిరిగి పంపించేసే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్లో ఇండియా కంటే చాలా ఎక్కువ సంఖ్యలో దాని పొరుగు దేశాలకు చెందినవారే ఉన్నారు. అమెరికా తో సరిహద్దులు పంచుకునే హోండురాస్, గౌటెమాలా దేశాల పౌరులే అధిక సంఖ్యలో అమెరికాలో అక్రమంగా ప్రవేశించి అక్కడే జీవనం సాగిస్తున్నారు. అమెరికాలో హోండురాస్ దేశానికి చెందిన అక్రమ వలసదారుల సంఖ్య అత్యధికంగా 2,61,000 ఉంటే.. గౌటేమాలాకు చెందిన వారు 2,53,000 వారున్నారు.
ఆసియా ఖండం నుంచి అత్యధికంగా చైనా నుంచి అక్రమంగా వెళ్లినవారు.. 37,908 మంది ఉండగా.. ఇండియా నుంచి 17,940 మంది ఉన్నారు.
అమెరికా ఇప్పుడు అక్రమ వలసదారులపై (US Deportation) ఉక్కుపాదం మోపే యోచనలో ఉండడంతో దాని సరిహద్దుల భద్రత, కఠిన వలస చట్టాల అమలులో కొన్ని దేశాల ప్రభుత్వాలు అమెరికాతో సహకరించడం లేదు. ఇండియా కూడా అమెరికా అక్రమ వలసదారులపై తీసుకునే చర్యల్లో సహకరించడం లేదు. ఇండియాతో పాటు ఇరాన్, పాకిస్తాన్, క్యూబా, భూటాన్, రష్యా, వెనెజుయెలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు సహకరించక పోవడంతో అమెరికాతో వీటికి దౌత్యపరమైన ఇబ్బందులు తప్పవని తెలస్తోంది.
అక్రమ వలసదారులను వారి దేశాల అధికారులతో సంప్రదించి.. వీలైతే వారికి ఇంటర్వ్యూలు చేసి ఆ తరువాత వారికి ఉచితంగా విమానం ద్వారా తిరిగి పంపించేస్తారు. అయితే ఆ దేశాల ప్రభుత్వాలు పూర్తిగా అమెరికా అధికారులతో సహకరించడం లేదని అమెరికా ఐసిఈ అధికారులు తెలిపారు.
ఈ పరిస్థితుల దృష్యా ట్రంప్ అధికారం హస్తగతం చేసుకోగానే అన్నింటి కంటే ముందు అక్రమ వలసదారులను వారి కుటుంబాలతో సహా పంపించేస్తానని చెబుతన్నారు.