ప్రతి ఏటా జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఏదో ఒక దేశాధినేతను పిలవడం ఆనవాయితీగా వస్తున్నది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. 76వ భారతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను విశిష్ట అతిథిగా ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. రిపబ్లిక్ డే పరేడ్ కు ఇండోనేషియా నాయకుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది ఐదవసారి. 1950 జనవరి 26న జరిగిన తొలి గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ తర్వాత ముగ్గురు ఇండోనేషియా అధినేతలు హాజరయ్యారు. ఇప్పుడు సుబియాంటో వచ్చారు.
ఇండియా-ఇండోనేషియా మధ్య వేల ఏండ్ల సంబంధం
ఇండియా, ఇండోనేషియా మధ్య సంబంధాలు ఈ నాటివి కాదు. వేల సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశంగా ఉంది. కానీ, ఒకప్పుడు హిందూ, బౌద్ధ రాజుల పాలనలో కొనసాగింది.
1292లో ఇండోనేషియా పాలకుడిగా తొలి ముస్లిం రాజు
వాస్తవానికి అరబ్ ముస్లిం వ్యాపారులు 8వ శతాబ్దంలో ఇండోనేషియాలో అడుగు పెట్టారు. కానీ, ఇస్లాం 13వ శతాబ్దంలో ప్రచారం చేయబడింది. ప్రారంభంలో ఇస్లాంను అరబ్ ముస్లిం వ్యాపారులు, ఆ తర్వాత మిషనరీలు దేశంలో విస్తరించేలా చేశాయి. తొలి నాళ్లలో స్థానిక రాష్ట్రాలు ఇస్లాంను స్వీకరించాయి. ఆ తర్వాత పెద్ద పెద్ద కుటుంబాలు ఇస్లాంను స్వీకరించడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా ఇస్తాం విస్తరించింది. ఆ తర్వాత 13వ శతాబ్దంలో సుమత్రా ఉత్తర తీరం పూర్తిగా ఇస్లాంను స్వీకరించింది. 1292లో మార్కో పోలో చైనా నుండి తిరిగి వస్తుండగా.. ఇండోనేషియాలోని ముస్లిం నగరాల గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఇండోనేషియాలో సుల్తాన్ మాలిక్ అల్ సలేహ్ మొదటి ముస్లిం పాలకుడిగా సింహాసనాన్ని అధిష్టించారు.
ఇండోనేషియాలో 86 శాతం ముస్లిం జనాభా
2023లో ఇండోనేషియాలో సివిల్ రిజిస్టర్ డేటా ప్రకారం.. 87.06% మంది ప్రజలు ఇస్లాంను నమ్ముతారు. ఇక్కడ ఎక్కువ మంది సున్నీ ముస్లింలు ఉన్నారు. 2011లో దేశ ముస్లిం జనాభాలో 99% మంది సున్నీ ముస్లింలు కాగా, మిగిలిన 1% మంది షియా ముస్లింలు. ఇక్కడ 4 లక్షల మంది అహ్మదీ ముస్లింలు కూడా ఉన్నారు.
హిందూ పురాణాలకు అపార గౌరవం!
ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీలో ఉన్నప్పటికీ, ఇస్లామిక్ రాజ్యంగా పరిగణించబడలేదు. ఇండోనేషియా ప్రభుత్వం గుర్తించిన ఆరు అధికారిక మతాలతో కూడిన లౌకిక దేశంగా కొనసాగుతున్నది. ఇండోనేషియా, భారత్ కూడా సాంస్కృతిక సారూప్యతలను కలిగి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య భాష, సంస్కృతి, పురాణాల పరంగానూ ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇండోనేషియా ప్రజలు మహాభారతం, రామాయణాన్ని తమ గ్రంథాలుగా భావిస్తారు. అంతేకాదు, అక్కడి కరెన్సీ మీద కూడా భారతీయులు ఆరాధించే దేవతామూర్తుల ఫోటోలు ఉంటాయి. ఎయిర్ పోర్టులతో పాటు పలు పర్యాటక ప్రాంతాల్లో హిందూ ఇతిహాసాల్లోని ప్రముఖ ఘట్టాలను ప్రతిబింబించేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. అందుకే, ఇండోనేషియా, భారత్ మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి.
Read Also: ట్రంప్ గెలిచిన మూడు నెలల తర్వాత పలకరించిన మోదీ.. వీరి మధ్య ఎలాంటి బంధముంది..