Iran, Israel, US Ceasefire| మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో 12 రోజుల పాటు నడిచిన యుద్ధం ప్రస్తుతానికి కాల్పల విరమణతో ఆగిపోయింది. ప్రస్తుతానికి ప్రపంచదేశాలన్నీ ఊపిరిపీల్చుకున్నాయి. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఇరాన్ కూడా తగిన విధంగా డ్రోన్లతో ఇజ్రాయెల్ నగరాలపై విరుచుకుపడింది. ఇరు వైపులా వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఇది చాలాదన్నట్లు అమెరికా కూడా “ఆపరేషన్ మిడ్నైట్ హామర్” పేరుతో భారీ బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడలు చేసింది. అమెరికా దాడిని ప్రపంచదేశాలన్నీ తప్పు బట్టాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తి విరుద్దమని విమర్శించాయి. రష్యా అయితే తమ అణుబాంబులు ఇరాన్ కు అందిస్తామని పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. కానీ ఇరాన్ ఖతార్ లోని అమెరికా ఎయిర్ బేస్ పై బాలిస్టిక్ మిసైల్స్ తో దాడులు చేయడంతో సీన్ మొత్తం మారిపోయింది. దీంతో ఈ యుద్దం ఇక గల్ఫ్ దేశాలన్నింటికీ వ్యాపిస్తుందని భయపడుతున్న వేళ. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధం ఆపేస్తున్నాం అని చెప్పి.. కాల్పుల విరమణ ప్రకటించారు.
అయితే ఇదంతా జరిగాక.. ఇప్పుడు ఈ మూడు దేశాలు గెలుపు మాదే నంటే కాదు మేము విజయం సాధించామని ప్రకటనలు చేస్తున్నాయి. నిజానికి ఈ యుద్ధంలో ఏ దేశం ఏం సాధించింది? అనే ప్రశ్న తలెత్తుతుంది.
మూడు దేశాల విజయ ప్రకటనలు
యుద్దంలో ఈ విరామంతో.. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మూడు దేశాలు ఇది తాము సాధించిన విజయంగా చెప్పుకుంటున్నాయి. ఇరాన్ యొక్క అణు సామర్థ్యాన్ని బలహీనపరిచినట్లు అమెరికా చెప్పుకుంటోంది. ఇరాన్ను గణనీయంగా బలహీనపరిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ నాయకులు కూడా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాని ఎదిరించి నిలబడ్డామని చెప్పుకుంటోంది. ఈ మూడు దేశాలు తమ ప్రజలను ఒప్పించడానికి ఇదే ప్రచారాన్ని ఉపయోగిస్తున్నాయి.
అమెరికా ఏం సాధించింది?
అమెరికా ఎప్పుడూ ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణకు దౌత్యపరమైన పరిష్కారాన్ని సమర్థించింది. కానీ ఆదివారం.. దాని B-2 బాంబర్లు ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేశాయి. ట్రంప్ ఇరాన్ను “మధ్యప్రాచ్యంలో బెదిరింపు శక్తి” అని పిలిచి, శాంతిని కోరకపోతే మరింత దాడులు ఉంటాయని హెచ్చరించారు. అయితే, ఇరాన్ ఖతార్లోని అమెరికా మిలిటరీ ఎయిర్ బేస్పై దాడి చేసిన తర్వాత, ట్రంప్ దాడి చేయకూడదని నిర్ణయించారు. ఎందుకంటే ఇరాన్ ముందుగా హెచ్చరిక ఇచ్చింది. ఈ దాడిలో అమెరికన్లు గాయపడలేదు, కనుక ట్రంప్ శాంతి స్థాపకుడిగా కనిపించారు.
ఇజ్రాయెల్ సాధించిన విజయం
అమెరికా దాడులకు ముందు, ఇజ్రాయెల్.. ఇరాన్ యొక్క అణు, సైనిక లక్ష్యాలపై దాడులు చేసి, ఇరాన్ యొక్క వైమానిక రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది. అంతేకాకుండా ఇరాన్ కు చెందిన ముఖ్య సైనిక నాయకులను ఇజ్రాయెల్ హతమార్చింది. అమెరికా దాడులు ఇజ్రాయెల్కు పెద్ద లాభాన్ని చేకూర్చాయి. ఎందుకంటే అమెరికా తమ వైపే ఉందని ఇజ్రాయెల్ మరోసారి ప్రపంచానికి చూపించింది.
పెరిగిన ఇరాన్ ధైర్యం
అమెరికా దాడుల తరువాత, ఇరాన్ కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఇరాన్ ఒంటరి పోరాటం సాగించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా ఖమేనీ ఒక బంకర్లో ఉంటూ.. పరిమిత దాడిని ఆదేశించారు. ఖతార్లోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈ దాడులకు ముందే ఇరాన్.. అమెరికా, ఖతార్ దేశాలను హెచ్చరించింది. ఈ దాడిలో ఎవరూ చనిపోలేదు, కనుక అమెరికా తిరిగి దాడి చేయకుండా ఆగిపోయింది. ఇరాన్ తన బలాన్ని చూపించడంతో శాంతియుతంగా విరామానికి దారితీసింది. ఇజ్రాయెల్ తో తాము సంధి చేసుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
Also Read: అమెరికా ఒక క్రిమినల్.. గుర్తండిపోయేలా శిక్ష విధిస్తాం.. ఇరాన్ వార్నింగ్
ఈ శాంతి శాశ్వతం కాదు
ఈ విరామం ప్రపంచ శక్తులకు ఊరటనిచ్చినప్పటికీ, ఇది శాంతి తాత్కాలికం. ఇరాన్ అణు సామర్థ్యం గురించి ఇంకా సందేహాలు ఉన్నాయి. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీశామని అమెరికా ప్రకటించినా.. ఇరాన్ మాత్రం ఈ వాదనలను తిరస్కరించింది. ఈ యుద్ధం తరువాత ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. అందుకే ఈ సమస్యను మూడు దేశాలు.. సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి.