Israel Stops Gaza Humanitarian Aid | గాజా యుద్ధాన్ని కొనసాగించాలనే ఇజ్రాయెల్ ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం ఆపేయాలని ప్రపంచదేశాలతో పాటు అమెరికా కూడా ఒత్తిడి చేయడంతో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించింది. కానీ గాజా యుద్ధం ఆపేసినందుకు ఇజ్రాయెల్ లోని నెతన్యాహు ప్రభుత్వం చిక్కుల్లో పడింది. కూటమి పార్టీల ముఖ్యనేతలు యుద్ధం ఆపేసినందుకు రాజీనామాలు చేయడంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై యుద్ధం తిరిగి ప్రారంభించాలనే ఒత్తిడి పెరుగుతోంది.
అందుకే రెండవ దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు ముందుకు సాగకుండా నెతన్యాహు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గాజాలోకి ప్రవేశించే మానవతా సాయం ఆహారం, ఇతర సరుకుల సరఫరాలను ఆదివారం నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు పంపిస్తున్న మానవతా సహాయం గాజా ప్రజలకు అందకుండా ఆగిపోయింది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలన్న తమ తాజా ప్రతిపాదనను హమాస్ అంగీకరించకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం, తొలి దశ తర్వాత జరిగే చర్చలు ఫలవంతం కాకపోతే పోరును ప్రారంభించే హక్కు తమ దేశానికి ఉందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు తెలిపారు.
నెతన్యాహు మాట్లాడుతూ, ప్రస్తుత ఒప్పందాల ప్రకారం చర్చలు ఫలించవని భావిస్తే మొదటి దశ తర్వాత కూడా దాడులను పునఃప్రారంభించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. బందీలను విడుదల చేస్తూ ఉంటేనే కాల్పుల విరమణ కొనసాగుతుందని కూడా తెలిపారు. దీనిపై హమాస్ తీవ్రంగా స్పందించింది. మానవతా సహాయాన్ని ఆపివేయాలన్న నిర్ణయంతో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిర్వీర్యం చేయాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. తమ చెరలో ఉన్న బందీలు ఇబ్బందులు పడతారని హమాస్ హెచ్చరించింది. జనవరిలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
Also Read: జెలెన్స్కీ యుద్ధాన్నే కోరుకుంటున్నారు.. వైట్ హౌస్ వాగ్వాదం వైరల్ వీడియో
ఇజ్రాయెల్పై మండిపడిన ఈజిప్టు
శాంతి చర్చలు మరియు కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్టు, నెతన్యాహు ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఆకలిని ఆయుధంగా ఉపయోగిస్తోందని ఈజిప్టు మండిపడింది.
ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కదారి పట్టించేందుకు ఇజ్రాయెల్ యత్నిస్తోందని హమాస్ ఆరోపించింది. సహాయాన్ని ఆపివేయడాన్ని చౌకబారు చర్యగా పేర్కొంది. ఇది యుద్ధ నేరమేనని, కాల్పుల విరమణ ఒప్పందంపై దాడిగా భావిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బందీలపై ప్రభావం పడుతుందని హమాస్ హెచ్చరించింది.
కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన ఇజ్రాయెల్?
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు కొత్త ప్రతిపాదనలో, శనివారం నాడు ముగిసిన తొలి దశ కాల్పుల విరమణను ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని.. మరోవైపు రెండవ దశకు చర్చలు ప్రారంభించాలని సూచించారు. చర్చల తొలి రోజు హమాస్ తన వద్ద ఉన్న బందీల్లో సగం మందిని విడుదల చేయాలని, మిగిలిన వారిని శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత విడుదల చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రణాళికకు అమెరికా మద్దతు ఉందని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే అమెరికా ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.
ఈజిప్టు, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం.. శనివారం నాటికి ముగిసినా.. రంజాన్ మాసం కావడంతో తొలి దశ ఒప్పందాన్ని కొనసాగించాలని అమెరికా నియమించిన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ ప్రతిపాదించారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. హమాస్ అయితే.. ఈ ప్రతిపాదనను హమాస్ నిరాకరించింది. రెండవ దశ ఒప్పందానికి సంబంధించి ఈజిప్టులో చర్చలు జరిగినప్పటికీ.. ఎటువంటి పురోగతి లేదని తెలిపింది.